త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Floods 2026 Death Toll | నేపాల్‌లో ఆగని మృత్యుఘోష: 300 మంది భారతీయుల గల్లంతు.. విరుచుకుపడనున్న మరో ‘గ్లేసియర్’ ముప్పు

నేపాల్‌ వరదలు మృత్యులోయను తలపిస్తున్నాయి. 700కు పైగా మృతదేహాలు లభ్యం కాగా, 300 మంది భారతీయులు సహా 3 వేల మంది గల్లంతయ్యారు. మరో గ్లేసియర్ ముప్పుతో టెన్షన్!

J

International | Published On Aug 29, 2026, 7.43 pm IST

Nepal Floods 2026 Death Toll | నేపాల్‌లో ఆగని మృత్యుఘోష: 300 మంది భారతీయుల గల్లంతు.. విరుచుకుపడనున్న మరో ‘గ్లేసియర్’ ముప్పు
Advertisement
  • నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నదిలో గ్లేసియర్ బద్దలై సంభవించిన ఆకస్మిక వరదల్లో సుమారు 700 మంది మృతి
  • వరదల్లో 300 మందికి పైగా భారతీయులు సహా సుమారు 3,000 మంది గల్లంతు
  • త్రిశూలి ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 100 మంది కార్మికులు
  • కుప్పకూలిన శిధిలాలతో నదికి అడ్డంగా ఏర్పడిన కృత్రిమ డ్యామ్ (Barrier Lake) బద్దలైతే మరో భారీ విపత్తు తప్పదని నిపుణుల హెచ్చరిక
  • భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం
  • పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని నేపాల్ మంత్రి వెల్లడి

Nepal Floods 2026 Death Toll | త్రినేత్ర.న్యూస్ : ఆగస్టు 26, 2026న నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని రసువా జిల్లాలో గ్లేసియర్ (హిమానీనదం) కుప్పకూలిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. భోటే కోషి నదికి పోటెత్తిన ఆకస్మిక వరదల (Flash floods) ధాటికి వందలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇప్పటివరకు సుమారు 676 మృతదేహాలను వెలికితీయగా, మరో 300 మందికి పైగా భారతీయులు సహా సుమారు 3,000 మంది ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. బురద, శిథిలాల నడుమ ఆర్మీ రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

టన్నెల్‌లో చిక్కుకున్న 100 మంది కార్మికులు

వరద బీభత్సానికి త్రిశూలి 3A హైడ్రోపవర్ ప్రాజెక్టు (Trishuli 3A Hydropower Project) దారుణంగా దెబ్బతింది. ప్రాజెక్టులోని భూగర్భ టన్నెల్‌లో 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు నేపాల్ ఆర్మీ డ్రిల్లింగ్ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగిస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం, జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది సిబ్బంది గల్లంతైన వారిలో ఉన్నారు.

ముంచుకొస్తున్న 'సెకండ్ వేవ్' ఫ్లడ్ ముప్పు

ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే జియోలాజికల్ నిపుణులు మరో బాంబు పేల్చారు. 2,000 అడుగుల వెడల్పైన గ్లేసియర్ కుప్పకూలడంతో, దాని చుట్టుపక్కల ఉన్న మంచు, రాళ్లు బలహీనపడి 'సెకండరీ కొలాప్స్'కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలి విపత్తులో కొట్టుకొచ్చిన బురద, రాళ్లు నదికి అడ్డంగా పేరుకుపోయి లీండే ఖోలా నదిలో ఒక భారీ 'బారియర్ లేక్' (Barrier Lake) ఏర్పడింది. ఈ కృత్రిమ డ్యామ్ తెగిపోతే దిగువ ప్రాంతాలపైకి మునుపటి కంటే భయంకరమైన వరదలు విరుచుకుపడతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వార్నింగ్ ఇచ్చింది.

Nepal Glacier Flood Over 700 Dead 300 Indians Missing as New Threat Looms

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతోందని, ఈ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా 47 అత్యంత ప్రమాదకరమైన గ్లేసియర్ సరస్సులు (వాటిలో 21 నేపాల్‌లోనే ఉన్నాయి) ఉన్నాయని ఐసీఐఎంఓడీ (ICIMOD) నివేదిక వెల్లడించింది. చైనా ఇంజనీరింగ్ బృందాలు డ్రోన్లు, 3D లేజర్ స్కానర్ల సాయంతో వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

పునర్నిర్మాణానికి బిలియన్ డాలర్లు

నేపాల్ వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన గాలివానలు తప్పవని హెచ్చరించడం టెన్షన్ పెంచుతోంది. ఈ విపత్తు నుంచి దేశం కోలుకోవడానికి సుమారు 5 బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ అంచనా వేశారు. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి ప్రాణాలను రక్షించడం పైనే ఉందని, భవిష్యత్ పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ కమ్యూనిటీ మద్దతు కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో ఇప్పటికే 5,851 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement
Advertisement