త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Farmers Commission | ఎఫ్‌టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం

తెలంగాణలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి వ్యవసాయ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి కీలక నివేదికను సమర్పించింది. ఆ వివరాలు ఇవే.

J

Telangana | Published On Aug 29, 2026, 5.53 pm IST

Telangana Farmers Commission | ఎఫ్‌టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం
Advertisement
  • జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి 'చిన్న నీటిపారుదల'పై నివేదిక సమర్పించిన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్
  • చెరువుల FTL పరిధిని గుర్తించి, ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి కీలక సూచన
  • చెరువుల రక్షణ కోసం ప్రత్యేకంగా 'మైనర్ ఇరిగేషన్ చట్టం' తీసుకురావాలని ప్రతిపాదన
  • పంటల మార్పిడి, FPO ల ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలని కమిషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Telangana Farmers Commission | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో చెరువుల పరిరక్షణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ తాజాగా ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. చైర్మన్ కోదండ రెడ్డి నేతృత్వంలోని బృందం.. చెరువుల ఆక్రమణల తొలగింపు, కొత్త చట్టాల రూపకల్పనపై ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది.

ఆక్రమణలపై ఉక్కుపాదం.. కొత్త చట్టం

హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) సరిహద్దులను వెంటనే గుర్తించాలని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆక్రమణలకు గురైన చెరువులను తక్షణమే రక్షించి, అక్రమ నిర్మాణాలను తొలగించాలని సూచించింది. రాబోయే తరాలకు నీటి భద్రత కల్పించేందుకు చెరువులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా 'చిన్న నీటిపారుదల చట్టం' (Minor Irrigation Act) తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిషన్ నొక్కిచెప్పింది.

ఇరిగేషన్ వ్యవస్థలో కీలక మార్పులు

నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు మోడ్రన్ టెక్నాలజీని వాడుకుంటూ.. ప్రత్యేక మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. చిన్న, పెద్ద నీటి వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (Command Area Management Systems) అభివృద్ధి చేయాలని సూచించింది. వ్యవసాయ స్థిరీకరణకు, గ్రామీణ ఉపాధికి చెరువుల పునరుద్ధరణే అత్యంత కీలకమని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, గంగాధర్, భవానీరెడ్డి తదితరులు సీఎంకు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

గత రెండేళ్లలో కమిషన్ చేసిన పనులు, ఇచ్చిన నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ పనితీరును అభినందించిన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పంటల మార్పిడి (Crop Rotation), ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (FPOs) ఏర్పాటు తదితర కీలక అంశాలపై ఇకనుంచి మరింత ఫోకస్ చేయాలని సీఎం సూచించారు.

Advertisement
Advertisement