త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల ‘మెకియవెల్లీ’ గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న ‘బిగ్ ఫిష్’ ఎవరు?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మెకియవెల్లీ సిద్ధాంతాన్ని తెలంగాణపై ఎలా ప్రయోగిస్తున్నారు? రేవంత్ సర్కార్ పాత్ర ఏంటి?

J

Telangana | Published On Jun 2, 2026, 8.45 pm IST

Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల ‘మెకియవెల్లీ’ గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న ‘బిగ్ ఫిష్’ ఎవరు?
Advertisement

ఈ మకియవెల్లియన్ దుర్మార్గపు సిద్ధాంతం (Machiavellian evil laws) ప్రకారం—"ఒక చెరువుల నిశ్శబ్దంగ ఉన్న నీటిని పైకి కిందకి కదిలిస్తే, అందుల ఉన్న చేపలు భయంతో దిక్కుతోచక ఉపరితలానికి వస్తాయి. అప్పుడు జాలరి శ్రమ లేకుండ వాటిని తన వలలో వేసుకోవచ్చు."

ప్రస్తుత తెలంగాణ రాజకీయ దృశ్యాన్ని ఈ కోణం నుండి చూస్తే, ఇక్కడ చెరువు తెలంగాణ సమాజం అయితే, నీటిని కల్లోలపరుస్తున్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారికి లోపాయికారీగ సహకరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేపలు—తెలంగాణ ప్రజలు, అస్తిత్వం, రాజకీయ చైతన్యం.

మెకియవెల్లీ తన 'ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వయం సరిగ్గా ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నది. హైదరాబాద్‌లో తాము అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ల్యాండ్ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలను కాపాడుకోవడం, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడడం, తెలంగాణ ప్రాంతపు శాంతిని విచ్చిన్నం చేసి అస్థిరపరచడం లాంటి లక్ష్యాలు ఏవయినా కావచ్చు. వీళ్ళ రాక, కేకలలో తెలంగాణ ప్రాంతపు ప్రయోజనాలు ఎక్కడా ఉండవు. పాలిసీ మేకింగ్ ఉండదు. కేసీఆర్ వస్తే తమ అక్రమాస్తుల పునాదులు కదులుతాయని భయపడే ఈ ఆంధ్ర శక్తులు, తెలంగాణ రాజకీయ క్షేత్రంలో రెచ్చగొట్టే సన్నివేశాలు సృష్టిస్తూ, కుల-వర్గ విభేదాలని కాసేపు, విగ్రహాలని కాసేపు, పదం లేదని కాసేపు, ఎన్నో రూపాల్లో సాంస్కృతిక దాడులు.. నిరంతరం "Stir the Pot" అంటే అలజడి సృష్టించడం జరుగుతూనే ఉన్నది. ఇలా నీటిని నిరంతరం అస్థిరంగా ఉంచడం ద్వారా, తెలంగాణ ప్రజలను, ప్రాంతీయ నాయకత్వాన్ని ఎప్పుడూ ఆత్మరక్షణలోనే ఉంచాలనేది వీరి కుట్ర.

అలా జరిగితే నష్టపోయేది తెలంగాణ సమాజమే

ఇగ ఈ దుష్ట పన్నాగంలో గుంపు మేస్త్రి ప్రభుత్వం.. అయితే చేతకాని వాడన్న కావాలి, లేదా స్వార్థపూరిత భాగస్వామి అన్న కావాలి. రెండిట్లో ఎదో ఒకటి. ఇంకోదానికి ఆస్కారం లేదు.

మెకియవెల్లీ సిద్ధాంతం ప్రకారం, ఒక బలహీనమైన పాలకుడు తన ఉనికిని కాపాడుకోవడానికి శత్రువులతోనైనా చేతులు కలుపుతాడు. గుంపు మేస్త్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ ఆంధ్ర శక్తులు సృష్టిస్తున్న కృత్రిమ అలజడిని ఒక సాధనంగా వాడుకుంటున్నడు. కానీ అతను గమనించని విషయం ఏమిటంటే, ఈ చెరువు పూర్తిగా కల్లోలమైతే నష్టపోయేది తెలంగాణ సమాజమే. బహుశా తెలిసే కూడా చేస్తూ ఉండవచ్చు.

ఈ శక్తుల అంతిమ వ్యూహం కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే కాదు; హైదరాబాద్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే వ్యూహం కూడా ఉండవచ్చని పలు తెలంగాణ వాదుల వాదన. ఒకవేళ హైదరాబాద్ కేంద్ర పరిధిలోకి వెళ్తే, ఇక్కడి చట్టాలు మారిపోతాయి, స్థానిక ప్రభుత్వాల అధికారం పోతుంది. అప్పుడు తాము చేసిన భూదందాలు శాశ్వతంగ సురక్షితంగ ఉంటాయని ఈ జాలర్లు లెక్కేసుకుంటున్నరు.

ఆ వలలో చిక్కకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి 

వారు విసురుతున్న వల కేవలం హైదరాబాద్ మీదనే కాదు, తెలంగాణ ప్రజా చైతన్యంపై, దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ అస్తిత్వం పైన. ఇక్కడి ప్రజల రాజకీయ అవగాహనను గందరగోళంలో ముంచి, వారిని మానసికంగ బలహీనపరచడమే ఈ ఆటలోని "Big Fish" (పెద్ద చేప). ఎప్పుడైతే ప్రజలు తమ హక్కులను మరిచి ఈ కృత్రిమ వివాదాల వలలో చిక్కుకుపోతరో, అప్పుడు ఈ శక్తులు అనుకున్న కుట్రలు సులభం అయితాయి. తెలంగాణ ప్రజలు ఈ మకియవెల్లియన్ కుతంత్రాలను గుర్తించి, ఆ వలలో చిక్కకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణమిది.

తెలంగాణ ప్రజలు తాము కంగారుపడినా, ఆవేశపడినా వలలోకే వెళ్తామనే నిజాన్ని గ్రహించాలి. జాలరులు నీటిని కల్లోలపరిచేదే అందుకోసం—నీళ్లు ఎంత బురదగ మారితే, ముందర పొంచి ఉన్న అసలైన ప్రమాదాలు చేపలకు సరిగ్గా కనపడకుండ పోతయి. తెలంగాణ సమాజం తమ చైతన్యాన్ని ఆయుధంగా మలుచుకుని, ఈ కృత్రిమ అలజడిని తిప్పికొట్టడానికి కొన్ని బలమైన వ్యూహాలు ఉన్నాయి.

మొదటిది, ఎరను చూసి లొంగిపోవద్దు. జాలరి విజయం చేపల ఆవేశం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ శక్తులు కల్పిస్తున్న తీవ్రమైన వివాదాలు తెరపైకి వచ్చినపుడల్లా ప్రజలు ఎమోషనల్ కాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ వివాదాలన్నీ హైదరాబాద్‌ మీద కుట్ర నుండి, మరియు వారి అక్రమ భూసామ్రాజ్యాల రక్షణ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసిన కృత్రిమ ఎరలు అని గుర్తించడమే మొదటి విజయం. ప్రజలు స్పందించడం మానేస్తే, జాలరి ఆట సాగదు.

దానికి విరుగుడు అదే 

రెండవది, బురద నీటిని నిజాలతో శుభ్రం చేయడం. నీటిని కల్లోలపరిచినప్పుడు అపోహలు, అబద్ధాలు తొందరగ వ్యాపిస్తాయి. దీనికి విరుగుడు 'నిజాల వెల్లడి'. తెలంగాణలోని అపారమైన రాజకీయ చైతన్యం ఉన్న యువత, సామాజిక మాధ్యమాలు, మరియు మేధావులు ప్రతి ఒక వివాదం వెనుక ఉన్న ఆర్థిక, భూసంబంధిత ప్రయోజనాలను విశ్లేషించి ప్రజల ముందు పెడుతూనే ఉండాలి. సంయమనం కోల్పోకుండా. రాజకీయ డ్రామాలను, హైదరాబాద్‌లోని ల్యాండ్ బ్యాంకుల రక్షణ ప్లాన్లను ఆధారాలతో సహా బట్టబయలు చేయడం ద్వారా ఆ బురద నీటిని మళ్లీ స్వచ్ఛంగా మార్చవచ్చు.

మూడవది, 'తెలంగాణ అస్తిత్వాన్ని' ఒక రక్షణ కవచంగా మార్చుకోవడం. మెకియవెల్లీ సిద్ధాంతం ప్రకారం చేపలను విడివిడి గుంపులుగా విడగొడితేనే వల వేయడం సులువవుతుంది. ఇక్కడి ప్రజలను కూడా కులాలు, పార్టీల పేరుతో విడగొట్టాలని చూస్తున్నారు. దీనికి విరుగుడు—మనమంతా ఒక్కటే అనే 'తెలంగాణ అస్తిత్వ' భావనను బలంగా పట్టుకుని ఉండటం. ఏ సమస్య ఎదురైనా "దీనివల్ల తెలంగాణ సార్వభౌమత్వానికి, ఇక్కడి ప్రజలకు లాభమా నష్టమా?" అనే ఒకే ఒక్క కోణం నుండి ఆలోచిస్తే, శత్రువులు విసిరే విభజిత వలలు ముక్కలైపోతాయి.

బీఆర్ఎస్ మళ్లీ రాబోతోందనే భయం వల్లనే

చివరిగా, అసలైన సమస్యలపై పాలకులను నిలదీస్తూనే ఉండడం. ప్రభుత్వం ఈ ఆంధ్ర శక్తుల నాటకాలకు సహకరిస్తే... వచ్చే ఎన్నికల్లో తమ చైతన్యంతో బుద్ధి చెబుతామనే హెచ్చరికను స్పష్టంగా పంపాలి. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మళ్లీ రావడం ఖాయమనే భయం ఎలాగూ ఆ శక్తులలో ఉంది కాబట్టి, ఓటు అనే ఆయుధాన్ని చూపించి హెచ్చరిస్తూ ఉండాలి.

చెరువులో ఉన్న చేపలన్నీ పానిక్ అవ్వకుండా, ఏకతాటిపై ఉండి, పైనుంచి వస్తున్న వలను స్పష్టంగా చూడగలిగితే... ఆ జాలరి ఎంత ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేడు. తెలంగాణ సమాజం తన చారిత్రక చైతన్యంతో నిశ్శబ్దంగా ఉంటూనే ఈ కుట్రను గమనిస్తే, ఆ జాలర్లు తమ వలలను సర్దుకుని ఖాళీ చేతులతో వెనుతిరగక తప్పదు.

Author:

కృష్ణ చైతన్య అల్లం
BRS USA (Atlanta)

Advertisement
Advertisement