త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchander Rao | 22ఏ ఆంక్షలు ఎత్తివేయాలి

N Ramchander Rao | 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను తక్షణమే పరిష్కరించి, అసలైన హక్కుదారుల భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా తమ భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సామాన్య కుటుంబాలు హక్కులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సిద్దిపేటలో 22ఏ ఆంక్షలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Aug 31, 2026, 3.35 pm IST

N Ramchander Rao | 22ఏ ఆంక్షలు ఎత్తివేయాలి
Advertisement
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు
  • సిద్దిపేట‌లో బీజేపీ భారీ ధ‌ర్నా
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిపాటు
  • జీవో 97 ర‌ద్దు చేయాల‌ని డిమాండ్‌
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వ‌ద్ద‌ని హిత‌వు

N Ramchander Rao | 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను తక్షణమే పరిష్కరించి, అసలైన హక్కుదారుల భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా తమ భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సామాన్య కుటుంబాలు హక్కులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సిద్దిపేటలో 22ఏ ఆంక్షలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించడంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి, 22ఏ ఆంక్షల పేరుతో విఫలమయ్యాయని రాంచందర్‌రావు విమర్శించారు. సొంత భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి, విక్రయించడానికి, హక్కులు వినియోగించుకోవడానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బాధిత రైతులు, కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

గృహ నిర్బంధంపై ఆగ్రహం

రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని రాంచందర్‌రావు అన్నారు. ప్రశ్నించే హక్కును కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. పీడీ యాక్టులు పెట్టినా, అరెస్టులు చేసినా బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జీవో 97తో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని రాంచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులకు ఈసెట్‌ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందిన విలువైన భూములను రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకే ‘శక్తి’ పథకం పేరుతో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రూ.15 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన రూ.15 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఖాళీల భర్తీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయుష్‌ విద్యార్థుల స్టైపెండ్‌లను ఇతర రాష్ట్రాల తరహాలో పెంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌’తో వ్యవహరిస్తోందని విమర్శించారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని, విద్యార్థులు, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బీజేపీ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అన్యాయం : రఘునందన్‌రావు

జీవో 97తో రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని మెదక్‌ ఎంపీ ఎం రఘునందన్‌రావు ఆరోపించారు. ‘కౌశల్య వికాస్‌’ లేదా స్కిల్‌ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. ముఖ్యంగా ఈసెట్‌ ద్వారా బీటెక్‌లో లేటరల్‌ ఎంట్రీ పొందే అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విపక్ష, విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధం చేయడంపై రఘునందన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌పై ఫైర్‌..

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. నిర్బంధాలు, అణచివేత చర్యలతో విద్యార్థుల ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. విద్యారంగాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రైవేటు రంగానికి, రియల్‌ ఎస్టేట్‌ లబ్ధిదారులకు కొమ్ముకాస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు అండగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని, పోలీసుల నిర్బంధాలతో ఉద్యమాలను నిలువరించలేరని ప్రభుత్వాన్ని రఘునందన్‌రావు హెచ్చరించారు.

Advertisement
Advertisement