త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

ఢిల్లీలో సెప్టెంబర్ 5న జరగనున్న సీజేపీ భారీ నిరసన మార్చ్‌ను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అసలు కోర్టు ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

J

National | Published On Aug 31, 2026, 2.49 pm IST

CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

సంక్షిప్త సారాంశం

సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన మార్చ్‌పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతల (Law and Order) నిర్వహణ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల బాధ్యత అని న్యాయస్థానం పేర్కొంది. BRICS సమ్మిట్ దృష్ట్యా ఈ మార్చ్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. గత నిరసనల్లో జరిగిన హింసపై విచారణకు నియమించిన HPEC కమిటీ తమ పర్యవేక్షణలోనే పనిచేస్తుందని సీజేఐ స్పష్టం చేశారు.

Advertisement

CJP September 5 March Delhi | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ప్రొటెస్ట్ మార్చ్‌ను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. లా అండ్ ఆర్డర్ (law and order) చూసుకోవాల్సింది కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలే అని సోమవారం జరిగిన విచారణలో తేల్చి చెప్పింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. "ఈ నిరసన హింసాత్మకంగా మారుతుందని ఊహించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తారని మేం ఆశిస్తున్నాం" అని బెంచ్ వ్యాఖ్యానించింది. మార్చ్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా.. ఇస్తే ఎలాంటి నిబంధనలు విధించాలనేది అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది.

బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit) టెన్షన్..

ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా గేట్, సెంట్రల్ విస్టా లాంటి సెక్యూరిటీ జోన్లలో నిరసనలకు అనుమతించొద్దంటూ మాజీ పోలీసు అధికారి రాజేంద్ర సింగ్, శివం ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది రిజ్వాన్ అహ్మద్ వాదిస్తూ.. "నిర్వాహకులకు పోలీసుల అనుమతి లేదు. సమ్మిట్ ముందు ఒకవేళ చిన్న లాఠీచార్జి జరిగినా అది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ మార్చ్‌ను వాయిదా వేయాలి" అని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఈ వ్యవహారం తమ పరిధిలోనిది కాదని ధర్మాసనం పేర్కొంది. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అప్పుడు తమ వద్దకు రావచ్చని పిటిషనర్లకు సూచించింది.

అసలు ఈ నిరసన ఎందుకు?

నీట్ (NEET) పరీక్ష రద్దు, రీ-టెస్ట్ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ CJP ఈ మార్చ్‌ను ప్రకటించింది. అలాగే జులై 20న జరిగిన ఆందోళనల్లో పోలీసుల తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. దీనికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కూడా మద్దతు పలికింది.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే కమిటీ విచారణ..

జులై 20 నాటి నిరసనల్లో పోలీసుల లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే రిటైర్డ్ జడ్జి ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల హై-పవర్డ్ ఎంక్వయిరీ కమిటీ (HPEC)ని నియమించింది. ఆందోళనకారుల హింస, పోలీసులకు గాయాలు, ప్రభుత్వ ఆస్తి నష్టం తదితర అంశాలపై ఈ కమిటీ విచారణ జరపనుంది. ఈ కమిటీ పూర్తిగా సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పనిచేస్తుందని, దీన్ని తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తామని సీజేఐ మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement