త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Mine | బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి

Gold Mine | బంగారం మైనింగ్‌లో కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు ప్రాజెక్టుల్లో రెండు సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా భాగస్వామ్యం అయ్యే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

P

Telangana | Published On Aug 28, 2026, 5.24 pm IST

Gold Mine | బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి
Advertisement
  • భవిష్యత్తు ప్రాజెక్టుల్లో జాయింట్‌ వెంచర్‌ అవకాశాలు పరిశీలించండి..
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

Gold Mine | బంగారం మైనింగ్‌లో కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు ప్రాజెక్టుల్లో రెండు సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా భాగస్వామ్యం అయ్యే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. హట్టి గోల్డ్‌ మైన్స్‌ అనుభవాన్ని, సింగరేణి సాంకేతిక సామర్థ్యాన్ని సమన్వయం చేస్తే దేశీయంగా బంగారం ఉత్పత్తిని పెంచేందుకు మంచి అవకాశాలుంటాయని పేర్కొన్నారు. కర్ణాటకలోని గోల్డ్‌ మైన్స్‌ ప్రాంతంలో పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్‌ జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను భట్టి విక్రమార్క సందర్శించారు. బంగారు ఖనిజం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్‌ నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు. హట్టి గోల్డ్‌ మైన్స్‌కు బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్‌, శుద్ధిలో సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపారు. బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న నైపుణ్యాన్ని దీనికి జోడించాలని సూచించారు.

అన్వేషణ నుంచి శుద్ధి వరకు..

బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర రంగాల్లో హట్టి–సింగరేణి కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. దేశ ఆర్థిక భద్రతలో బంగారానికి కీలక స్థానం ఉందని భట్టి అన్నారు. దేశీయంగా ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయ పద్ధతుల్లో అన్వేషించి వెలికితీయడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలని పేర్కొన్నారు. బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఉత్పత్తి పెంపుతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగం, స్థానిక ఉపాధి, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

రోజుకు 2–4 కిలోల బంగారం

హట్టి గోల్డ్‌ మైన్స్‌లోని ఉత్పత్తి విభాగం, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్‌ కేంద్రాలను భట్టి పరిశీలించారు. ఖనిజాన్ని వివిధ దశల్లో ప్రాసెస్‌ చేసి శుద్ధ బంగారంగా మార్చే విధానాన్ని అధికారులు వివరించారు. హట్టి ప్రాజెక్టులో రోజుకు సగటున రెండు నుంచి నాలుగు కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. యూటీ ఓపెన్‌కాస్ట్‌ గోల్డ్‌ మైన్‌ వ్యూ పాయింట్‌ నుంచి ఖనిజం వెలికితీత ప్రక్రియను పరిశీలించిన భట్టి.. గని లోతు, అన్వేషణకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గని మ్యాప్‌లను పరిశీలించారు. యూటీ భూగర్భ గనిలో ఖనిజం తవ్వకం, రవాణా, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రతపై వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, జనరల్‌ మేనేజర్‌ పంకజ్‌ కులశ్రేష్ఠ, హట్టి గోల్డ్‌ మైన్స్‌ అధికారులు, రాయచూరు జిల్లా పరిషత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement