త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | కుదిరిన రాజీ.. స‌మ‌సిన వివాదం..

SBI | హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం భూముల (Raidurgam Lands) విష‌యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్ర‌భుత్వానికి (Telangana Govt) మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముగిసింది. ప్ర‌త్యామ్నాయ భూమి తీసుకునుందేకు ఒప్పుకోవ‌డంతో ఇరుప‌క్షాల మ‌ధ్య రాజీ కుదిరింది.

G

Telangana | Published On Jun 28, 2026, 7.36 am IST

SBI | కుదిరిన రాజీ.. స‌మ‌సిన వివాదం..
Advertisement

SBI | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం భూముల (Raidurgam Lands) విష‌యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్ర‌భుత్వానికి (Telangana Govt) మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముగిసింది. ప్ర‌త్యామ్నాయ భూమి తీసుకునుందేకు ఒప్పుకోవ‌డంతో ఇరుప‌క్షాల మ‌ధ్య రాజీ కుదిరింది. దీంతో భూవివాదంలో హైకోర్టులో (High Court) వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు ఎస్‌బీఐ అంగీకరించింది.

ఇటీవ‌ల రాయ‌దుర్గంలో (Raidurgam Auction) స‌ర్వేనంబ‌ర్ 83జ‌1లోని 6.29 ఎక‌రాల‌ను టీజీఐఐసీ (TGIIC) వేలం వేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఎక‌రానికి రూ.237 కోట్ల ధ‌ర ప‌లికింది. అయితే అందులో 5 ఎక‌రాలు త‌మ‌వంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి, ఎస్‌బీఐకి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ప్ర‌త్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఒప్పుకుని, ఎలాంటి స‌మాచారం లేకుండా కోర్టులో కేసు వేయ‌డంతో ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ బ్యాంకుతో (Lead Bank) ఉన్న లావాదేవీల‌ను పూర్తిగా తెగ‌దెంపులు చేసుకోవాల‌ని, బ్యాంక్ చైర్‌ప‌ర్స‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

మెట్టు దిగిన ఎస్‌బీఐ

దీంతో ఓ మెట్టు దిగివ‌చ్చిన ఎస్‌బీఐ.. ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు ప్రారంభించింది. సీఎస్ రామ‌కృష్ణారావు నేతృత్వంలోని ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ సంద‌ర్‌భంగా వేలం ద్వారా కోల్పోయిన ఐదెక‌రాల స్థ‌లానికి ప్ర‌త్యామ్నాయంగా రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో (Knowledge City) 2.5 ఎకరాలు లేదా ఉస్మాన్‌నగర్‌లో 2.5 ఎకరాలు లేదా భారత్‌ ఫ్యూ చర్‌ సిటీలో 10 నుంచి 15 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనికి అంగీకారం తెలిపిన ఎస్‌బీఐ ప్రతినిధులు.. బోర్డు ఆమోదం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ప్ర‌స్తుతం హైకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటామని వెల్లడించారు.

మాట‌మార్చి.. కోర్టుకెక్కి..!

అయితే వాస్త‌వానికి గతంలో తాము కేటాయించిన 5 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా వేరేచోట భూములు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం గత నెలలోనే ఎస్‌బీఐకి తెలిపింది. ఎస్‌బీఐ ప్రతినిధులు మే12న ప్రత్యామ్నాయ భూములను సందర్శించి సానుకూలంగా స్పందించారు. కానీ, ఉన్నతాధికారులు అంగీకరించడం లేదన్న కారణంతో నిర్ణయం మార్చుకుంది. రాయదుర్గంలోని భూములను ప్రభుత్వం వేలం వేయడంతో.. అవి తమవేనంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది.

Advertisement
Advertisement