త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | బీఆర్ఎస్‌ను బద్నాం చేయడం మీ అజ్ఞానానికి నిదర్శనం

ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారంలో బీజేపీ నేత రామచందర్ రావు కామెంట్స్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కొడుకు కేసును ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు.

J

Telangana | Published On Aug 30, 2026, 4.51 pm IST

RS Praveen Kumar | బీఆర్ఎస్‌ను బద్నాం చేయడం మీ అజ్ఞానానికి నిదర్శనం

సంక్షిప్త సారాంశం

ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వ్యవహారంలో బీఆర్ఎస్‌ను విమర్శించిన బీజేపీ నేత రామచందర్ రావుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అకృత్యానికి పాల్పడితే, బీజేపీ నేతలు అప్పుడు ఎందుకు రాజీనామా అడగలేదని సూటిగా ప్రశ్నించారు. రహ్మత్ బేగ్ వీడియోలపై ఎంఐఎం చీఫ్ ఒవైసీ వద్ద ఆధారాలు ఉంటే, వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ ఎవరో ఇంకా బయటకు రాకముందే, బీజేపీ నేతలు ఈ ఇష్యూలో బీఆర్ఎస్‌ను బద్నాం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.

Advertisement
  • బండి సంజయ్ కొడుకు కేసు ఏమైంది?
  • బీజేపీ, ఎంఐఎంలపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : ఎంఐఎం (MIM) బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈ ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) గట్టి కౌంటర్ ఇచ్చారు. రామచందర్ రావు కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని, బండి సంజయ్ కుమారుడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన తెరపైకి తెచ్చారు.

బండి సంజయ్ రాజీనామా ఎందుకు అడగలేదు?

గతంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు రామచందర్ రావు ఎందుకు స్పందించలేదని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. "ఆనాడు ఆ మైనర్ బాలికకు ఒక్క బీజేపీ మహిళా నాయకురాలు కూడా సపోర్ట్ చేయలేదు. బండి సంజయ్‌ని రాజీనామా చేయాలని మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆ బాలికను, ఆమె కుటుంబాన్ని బండి సంజయ్ బెదిరించినా ఎందుకు వారిపై యాక్షన్ (Action) తీసుకోలేదు?" అని ఆయన ప్రశ్నించారు.

ఆనాడు ఆ కేసును సీఎం రేవంత్ రెడ్డి నీరుగార్చాలని చూసినా, బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాడి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించిందని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. గుజరాత్‌లోని బిల్కిస్ బానో కేసు, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం లాంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. నేరస్తులకు పూలదండలు వేసి సన్మానించడం బీజేపీ సంస్కృతి అని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న బీజేపీ నేతలు.. ఈరోజు బీఆర్ఎస్ మీద అభాండాలు వేయడం ఆకాశం వైపు చూసి ఉమ్మేసుకోవడమే అన్నారు.

ఒవైసీ దగ్గర ఆధారాలు ఉంటే డీజీపీకి ఇవ్వాలి

ఇక మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటివరకు బాధిత మహిళ ఎవరో బయటకు రాలేదని, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ (Complaint) కూడా నమోదు కాలేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా వీడియోల ఆధారంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.

నిజంగా బాధిత మహిళ ఎవరో ఒవైసీకి తెలిస్తే, వెంటనే ఆమెను డీజీపీ (DGP) లేదా పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మీర్జా రహ్మత్‌పై ఉన్న వీడియో ఆధారాలను పోలీసులకు అప్పగించాలన్నారు. మరోవైపు తనపై డీప్‌ఫేక్ (Deepfake), మార్ఫ్డ్ వీడియోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రహ్మత్ బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు.

Advertisement
Advertisement