త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘ‌ట‌న జ‌రిగితే మేడిప‌ల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాద‌వ్ ఏం పాపం చేసిండు?

RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో గ్యాంగ్‌ల స్వైర విహారం న‌డుస్తోంద‌ని.. అందులో కింది స్థాయి పోలీసులే బ‌లైతున్నార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ విమ‌ర్శించారు. జూబ్లీహిల్స్‌లో హ‌రికృష్ణ అనే బాధితుడి సంఘ‌ట‌న జ‌రిగితే మేడిప‌ల్లిలో కేసు ఎలా బుక్ అయిత‌ద‌ని.. సీఐ ముత్తుయాద‌వ్ ఏం పాపం చేశార‌ని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 29, 2026, 1.57 pm IST

RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘ‌ట‌న జ‌రిగితే మేడిప‌ల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాద‌వ్ ఏం పాపం చేసిండు?
Advertisement
  • డీసీపీ ర‌మణారెడ్డిని, ఏసీపీ వెంక‌ట్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయ‌లేదు
  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో గ్యాంగ్‌ల స్వైరవిహారం న‌డుస్తోంది
  • కిందిస్థాయి పోలీసులే బ‌లైతున్న‌రు
  • హ‌రికృష్ణ అనే బాధితుడు ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ కాలేదు
  • అత‌న్ని కొట్టుకుంట‌గే ఎవ‌రికో వీడియో కాల్‌లో కూడా చూపించార‌ట‌
  • రేవంత్ హయాంలో అంతా అరాచ‌కం, ఆట‌విక పాల‌నే
  • శాంతి భ‌ద్ర‌త‌లు కంట్రోల్‌లోనే ఉన్న‌య్ అని డీజీపీ అందంగా చిత్రీక‌రించే ప్ర‌యత్నం చేసిండు
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో గ్యాంగ్‌ల స్వైర విహారం న‌డుస్తోంద‌ని.. అందులో కింది స్థాయి పోలీసులే బ‌లైతున్నార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ విమ‌ర్శించారు. జూబ్లీహిల్స్‌లో హ‌రికృష్ణ అనే బాధితుడి సంఘ‌ట‌న జ‌రిగితే మేడిప‌ల్లిలో కేసు ఎలా బుక్ అయిత‌ద‌ని.. సీఐ ముత్తుయాద‌వ్ ఏం పాపం చేశార‌ని ప్ర‌శ్నించారు. డీసీపీ ర‌మ‌ణారెడ్డిని, ఏసీపీ ఎంక‌ట్‌రెడ్డిని ఎందుకు స్పెండ్ చేయ‌లేద‌ని నిల‌దీశారు. రేవంత్ హ‌యాంలో అంతా అరాచ‌కం, ఆట‌విక పాల‌నే కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. పైగా శాంతి భ‌ద్ర‌త‌లు అందంగా ఉన్నాయ‌ని డీజీపీ ఆనంద్ చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని విమ‌ర్శించారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ పాల‌న‌లో పోలీసు వ్య‌వ‌స్థ ఎలా ఉందో చెబుతూ ఫైర్ అయ్యారు.

ఫ్యాక్చ‌ర్ అయ్యి పోలీస్ స్టేష‌న్ కు పోతే హాస్పిట‌ల్ పంపి స‌ర్టిఫికెట్ తీసుకొని వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తారు. కానీ రేవంత్ హోంమినిస్ట‌ర్ అయ్యాక ఎంత అరాచ‌క పాల‌న న‌డుస్తుందో ఈ ఒక్క ఫొటో చాలు. బాధితుడు పోలీస్ స్టేష‌న్‌కు పోయినా.. గాంధీ హాస్ప‌టల్ పోయి ట్రీట్‌మెంట్‌కు పోయి రిజిస్ట్ర‌ర్ పోస్ట్‌లో పంపినా కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. ఇదీ రేవంత్‌రెడ్డి గారి అరాచ‌క‌ పాల‌న.

తెలంగాణ‌లో క‌నిపించ‌ని గ్యాంగ్‌వార్ నడుస్తోంది. అద్దాల మేడ‌ల వెన‌క ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఎక్క‌డో డెన్‌లు కూడా ఉన్న‌య‌ని అర్థం అయితుంది. గ‌త 30 నెల‌ల నుంచి ఈ గ్యాంగ్‌ల స్వైర విహారం అంతా ఇంతా లేదు. గ్యాంగ్‌ల కొట్లాట‌లో కింది స్థాయి పోలీసులు బ‌లి అయితున్న‌రు. మొన్న జూబ్లీహిల్స్‌లో జాయిన్ అయిన వారం రోజుల‌కే సస్పెండ్ అయిన ముత్తుయాద‌వ్ లాంటి వాళ్లు, చిట్యాల‌లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక జ‌ర్న‌లిస్టును కాంగ్రెస్ నాయ‌కుడు కొట్టిండ‌నే కేసులో ఎఫ్ఐఆర్ చేసినందుకు మ‌ల్లేష్ అనే సీఐని వెంట‌నే స‌స్పెండ్ చేసిర్రు. ముత్తు యాద‌వ్‌ను అయితే అకారణంగా స‌స్పెండ్ చేసిర్రు. ఈ చ‌ద‌రంగంలో బ‌హుజున వ‌ర్గానికి చెందిన ఆఫీస‌ర్లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న‌రు. మ‌నోవేద‌నకు గురైతున్న‌రు. ఎల్బీన‌గ‌ర్‌లో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని చ‌నిపోయిండు. సాక్షాత్తు డీజీపీ ఆఫీసులోనే ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని చ‌నిపోయిండు అంటే.. కింది స్థాయి పోలీసులు ఎంత ఒత్తిడికి గుర‌వుతున్న‌రో తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచించాలి.

నిన్న డీజీపీ గారేమో అంతా అందంగానే ఉంది. శాంతి భ‌ద్ర‌త‌లు కంట్రోల్‌లోనే ఉన్న‌య్ అని అందంగా చిత్రీక‌రించే ప్ర‌యత్నం చేసిండు. అయ్యా డీజీపీ గారు అన్నం ఉడికిందా అని తెలియ‌డానికి అన్ని మెతుకులు ప‌ట్టి చూడాల్సిన అవ‌స‌రం లేదు.

జూబ్లీహిల్స్‌లో సంఘ‌ట‌న జ‌రిగితే మేడిప‌ల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది. మేడిప‌ల్లి ఏమో మ‌ల్కాజిగిరిల ఉంట‌ది. జూబ్లీహిల్స్ ఏమో హైద‌రాబాద్ పోలీసుల ప‌రిధిలో ఉంటది. ఎవ‌రైతే త‌న్నిండ్రో వాడు పోయి సైబ‌రాబాద్ పోలీసు స్టేష‌న్ల కేసు పెడుత‌డు.. ఆ కేసు రిజిస్ట్ర‌ర్ కాదు. ఇదేదో సస్పెన్ష‌న్ త్రిల్ల‌ర్‌. ఎస్ఎస్ రాజ‌మౌళి ఒక సినిమాను త‌యారు చేస్త‌డో ఈరోజు ఆ విధంగా ఈ గ్యాంగ్‌ల స్వైర విహారం జ‌రుగుతుంది.

ఆగ‌స్టు 20న‌ మేడిపల్లిలో ఒక జీరో ఎఫ్ఐఆర్ అయింది. అందులో మేడ్చ‌ల్‌లో రియ‌ల్ ఎస్టేట్ చేసే హరికృష్ణ అనే వ్య‌క్తిని ఒక రోజు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి ర‌మ్మ‌న్న‌డు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర ఒక డెన్‌లో వీళ్లందరు వెయిట్ చేస్తున్న‌రు. హ‌రికృష్ణ త‌న మిత్రుడు కిర‌ణ్‌తోటి క‌లిసి రెంట‌ల్ కారులో పోతే సుమంత్‌తో పాటు మ‌రో న‌లుగురు రాడ్ల‌తోటి కొట్టిండ్రు, చంపుదామ‌ని ప్ర‌య‌త్నం చేసిండ్రు. ఈ హ‌రికృష్ణ అనే పిల‌గాన్ని కిర‌ణ్, రాము అనే వాళ్ల‌ను కొడుతున్న‌రు అనే విష‌యం కానిస్టేబుళ్ల‌కు ఎవ‌రు చెప్పిర్రు? సీపీ కాల్ పోయిందా? లేదంటే డీజీపీ కాల్ పోయిందా? డ‌య‌ల్ 100కు కాల్ పోయిందా? దెబ్బ‌లు తిన్నోన్ని పోలీస్‌స్టేష‌న్ల కూసోబెడితే సీసీ కెమెరాల‌ల్ల అంతా రికార్డ్ అయింది. జూలై 30 సాయంత్రం 5 గంట‌ల నుంచి కొడ‌త‌నే ఉన్న‌రు. మ‌రి వెంట‌నే జీడీ ఎంట్రీ పెట్టాలే క‌దా.. గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు పంపాలి క‌దా..

నేన్ కూడా పోలీసుగా ప‌ని చేసిన. మార్నింగ్ టెలికాన్ఫ‌రెన్స్ జ‌రుగుత‌నే ఉంట‌ది. ప్ర‌తి రాత్రి సిపీకి వివ‌రాలు చెప్త‌నే ఉంట‌రు. సుమంత్ కొట్టిన వ్య‌వ‌హారం ఎందుకు చ‌ర్చ‌కు రాలేదు. మ‌రి రేవంత్ ఎఫ్ఐఆర్ చేయొద్ద‌న్న‌డా? కిర‌ణ్‌కు ఏమ‌న్నా సంబంధం ఉన్న‌దా? ఈరోజు ప్ర‌జ‌ల‌కు డీజీపీ, సీపీ ఎవ‌రైనా సీనియ‌ర్ పోలీసు అధికారి చెప్పాలి.

కావూరిహిల్స్ ప‌క్క‌పొంటే మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ఉంట‌ది. హ‌రికృష్ణ‌ను కొట్టిన‌వాళ్లు ఆగ‌స్టు రెండో తారుఖున మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్ పోత‌రు. మ‌హేంద‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తితోని ఇప్పిచ్చిండ్రు. మేమంతా రూ. 1.8 కోట్ల రూపాయ‌లు హ‌రికృష్ణ‌కు ఇచ్చినం. పెద్దొళ్లు తెలుస‌ని.. 22ఎ ల మీ భూములు పెట్టుంటే నేన్ క్లియ‌ర్ చేపిస్తా.. ఎక్క‌డ‌న్నా దందాలు చేస్తు స‌గం స‌గం పంచుకుందామ‌ని చెప్పి అగ్రిమెంట్ చేసినం. తీరా హ‌రికృష్ణ మా ఫోన్లే ఎత్తుత‌లేడని చెప్పి హ‌రికృష్ణ మీద‌నే ఉల్టా ఫిర్యాదు ఇచ్చిర్రు. గ‌మ్మ‌త్తు ఏందంటే మాదాపూర్ సైబ‌రాబాద్‌ల ఉన్న‌ది. ఆ ఫిర్యాదు కూడా రిజిస్ట్ర‌ర్ కాలేదు. అంటే పైనుంచి హోంమంత్రి గారు ఎవ‌రి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలంటే అది చేస్త‌రు. ఇగ మ‌ధ్య‌ల కొండా సుష్మిత ప‌ర‌కాల‌లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రిపై మాట్లాడింది. అప్పుడు మేడిపల్లి లో కేసు నమోదు చేయాలని ఆదేశాలు రాగానే ఆగమేఘాల మీద కేసు నమోదు అయింది. ఏ ఎఫ్ఐఆర్ కావాల‌న్నా, ఎవ‌రిని అరెస్టు చేయాల‌న్నా ఆయ‌న్నే డిసైడ్ చేస్తున్న‌రు. స్టేష‌న్‌ బెయిల్ ఎవ‌రికి ఇవ్వాలి, సిట్ ఎవ‌రి మీద వేయాలో ఆయ‌న్నే డిసైడ్ చేస్తున్న‌రు. ఇంత‌కాడికి వ‌చ్చింది రేవంత్‌రెడ్డి గారి అరాచ‌క‌, ఆట‌విక పాల‌న‌.

ఏ ఆఫీస‌రు ఎఫ్ఐఆర్ ఒద్ద‌న్న‌డు.. ముత్తు యాద‌వ్ ఏం పాపం చేసిండు. ఆయన రాజేంద్ర నగర్ లో మంచి ఆఫీసర్. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ అయి త‌ర్వాత వ‌చ్చి డీసీపీ ర‌మ‌ణారెడ్డిని అడిగితే వెంట‌నే వ‌చ్చి ముత్తు యాద‌వ్‌ను స‌స్పెండ్ చేసిర్రు. మ‌రి ర‌మ‌ణారెడ్డిని ఎందుకు స‌స్పెండ్ చేయ‌లే? ఏసీపీ ఎంక‌ట్‌రెడ్డిని ఎందుకు స్పెండ్ చేయ‌లే? రేవంత్‌రెడ్డి ఏంజెప్తే అది చేస్త‌డు వెంక‌ట్‌రెడ్డి.

పోలీసులు ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు పోవాలంటే జీడీ ఎంట్రీ అన్నా ఉండాలి.. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ అయినా అయి ఉండాలి. ఈ మూడు లేకుండానే రేవంత్ ఆదేశాల మేర‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లో కొండా సురేఖ ఇంటికి వెళ్త‌రు. పోయిన వెంట‌నే వాళ్ల కూత‌రు సుష్మిత ప‌టేల్ వ‌చ్చి మా సుమంత్‌ను ఎందుకు అరెస్టు చేస్తున్న‌రు అంటే పోలీసులు వెంట‌నే వెళ్లిపోయిండ్రు. న‌ల్ల‌బాలు అనే వ్య‌క్తి అన్నం తింటుంటే ప్లేట్‌ను త‌న్ని వాళ్ల అమ్మ‌ను కొట్టి తీసుకొని పోయిండ్రు. నిన్న‌టికి నిన్న ఒక షాపు మున్సిపాలిటీలు వాళ్లు కూల‌గొట్టిండ్రని కోదాడ‌లో మొర్రో అని రోడ్డు మీద అంద‌రు క‌లిసి ధ‌ర్నా చేస్తుంటే కోదాడ సీఐ, పోలీసులు త‌న్నుకుంట ఆ వ్య‌క్తిని కార్ల‌వ‌డేస్త‌రు.

సుమంత్ గ్యాంగ్‌లో తీవ్ర గాయపడిన వ్యక్తి చెయ్యి విరిగింది. మళ్లీ ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి అతన్ని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు అని బాధితుడు అంటున్నాడు. అతనికి గాయాలు అయ్యాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నాడు, సీసీ కెమెరాలలో అన్ని రికార్డ్ అయ్యాయి. బాధితుడు అంత ఇబ్బంది పడుతున్నాడు కనీసం హాస్పిటల్ కు పంపకుండా పోలీసులు అక్కడే ఉంచుకున్నారు. ఇంత జరిగినా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు. రేవంత్ రెడ్డి చేయకుండా అడ్డుకున్నాడా. కిరణ్‌కు ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉన్నదా?

సిట్ విచార‌ణ జ‌రిపించాలి..

ముఖ్యమంత్రి ఇంటికి జూబ్లీహిల్స్‌లో ఇంత పెద్ద దారుణం జరిగితే ఎందుకు కేసు కాలేదు? దీనిపై సిట్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రికి మంచిగా ఉంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో డ్యూటీ లేదంటే చార్మినార్, కలపతర్, బొల్లారం, బహదూర్ పూర్లో డ్యూటీ వేస్తున్నారు. డీజీపీ గారు కింద స్థాయి పోలీసులను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతలేరు. తెలంగాణ భవన్ లో ఉన్న మాకు మా సమస్యలపై మాట్లాడండి అని చెప్తున్నారు. మహిళ కానిస్టేబుల్ లకు టాయిలెట్ లు కట్టలేరా?

ముఖ్యమంత్రి సభలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి మహిళ కానిస్టేబుల్, ఎస్సై లకు మాత్రం బాత్రూంలు కట్టడం లేదు. ఫోర్ బ్రదర్ అనే ఫ్యూచర్ సిటీకి మాత్రం పోలీసులను పంపుతున్నారు. 2012 బ్యాచ్ ఎస్సై లకు ప్రమోషన్ లు ఇవ్వండి అని అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. మేం జూనియర్‌ల కింద పని చేయాల్సి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి బాధలు పట్టించుకోండి డీజీపీ గారు.

మేం గట్టిగా అడిగితే మా బీఆర్ఎస్ నాయకుల గన్ మెన్ లను తీసివేస్తున్నారు. మరి జానా రెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఆయన ఏం హోదాలో ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఇచ్చారు. అదే మా జోగు రామన్నకు ఎందుకు ఇవ్వడం లేదు?

సుమంత్ ఎక్క‌డ ఉన్న‌డు?

జూబ్లీహిల్స్ లో అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నది మరి సుమంత్ ఎక్కడ ఉన్నాడు? దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు. కిరణ్ అనే వాడు రేవంత్ రెడ్డి దోస్తు. ఎప్పుడూ రేవంత్‌తోనే ఉంట‌డు. కిరణ్ అనే ఆయన ట్రూ కాలర్ ఐడీలో పీఏ టు రేవంత్ రెడ్డి అని రాసుకున్నాడు. పెద్ద పెద్ద అధికారుల అవినీతి మాత్రం ఏసీబీ కనిపించదు. వీళ్ళ దగ్గరకు ఏసీబీ మాత్రం పోదు. కింది స్థాయి అధికారులకు మాత్రం ఏసీబీ పోతుంది.

రాజకీయ చదరంగంలో పోలీస్ అధికారులను బలిచేస్తున్నారు. దిన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటి అన్నింటిపై చర్చ జరగాలి. అంటే సిట్ వేయాలి. చేతులు విరగకొట్టిన, తీవ్ర గాయాలు అయిన ఎఫ్ఐఆర్ కాలేదు. రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే ఇబ్బందులు ఎదుర్కుంటారు. నాపై, నా కుటుంబ సభ్యులపై ఒక్క ఛాన‌ల్ ఇష్టానుసారంగా కథనాలు రాస్తే కేసు నమోదు చేయలేదు. నా స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని ఎస్సై నీ కోరితే మాకు పై అధికారుల ఒత్తిడి ఉన్నది సర్ ఆయనను కాపాడాలని అంటున్నారు.

మేం అధికారంలో రాగానే ట్రిబ్యునల్ వేస్తాం.. పోలీసుల తీరుపై విచారణ చేస్తాం. అబిబుల్లాను అకారణంగా బదిలీ చేశారు. ఆయనకు గ్యాలంట్రి ఇవ్వాలి. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ ఉన్నాడు. ఆయనను ఎందుకు పట్టుకోవడం లేదు? దీనిపై విచారణ జరగాలి. ముత్తు యాదవ్ వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి అని ప్ర‌వీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

ఈ స‌మావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కె .కిశోర్ గౌడ్, బీఆర్ఎస్ నేత కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement