త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heatstroke | ఇది మీకు తెలుసా?.. వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం..

Heatstroke | రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కే సూర్యుడు సెగ‌లు క‌క్కుతున్నాడు. ఇక మ‌ధ్యాహ్నం బ‌య‌ట తిర‌గాలంటేను ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు.

G

Telangana | Published On May 25, 2026, 9.42 am IST

Heatstroke | ఇది మీకు తెలుసా?.. వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం..
Advertisement

Heatstroke | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కే సూర్యుడు సెగ‌లు క‌క్కుతున్నాడు. ఇక మ‌ధ్యాహ్నం బ‌య‌ట తిర‌గాలంటేను ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. ప‌లు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. భాణుడి ప్ర‌తాపానికి వ‌డ‌గాలులు (Heat Waves) తోడ‌వ‌డంతో జ‌నం అల్లాడిపోతున్నారు. దీంతో వ‌డ‌దెబ్బ‌తో (Heatstroke) మృత్యువాత ప‌డుతున్నారు. శుక్ర‌, శ‌నివారాల్లో 100 మందికిపైగా మృతిచెంద‌గా ఆదివారం 61 మంది మ‌ర‌ణించారు. ఒక్క ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనే 26 మంది ఎండ‌దెబ్బ‌తో చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో వడదెబ్బతో చనిపోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు (Ex-gratia) ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధిత కుటుంబానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం (Heatstroke Aid) అందిస్తున్న‌ది.

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ద్వారా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇవ్వ‌నుంది. అయితే దీనికోసం కొన్ని నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. వడదెబ్బతో వ్యక్తి మరణించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేయించాలి. `నివేదిక‌లో వడదెబ్బ కార‌ణంగానే మరణం సంభవించింది` అని స్పష్టంగా ఉండాలి. వ్య‌క్తి మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ధ్రువీకరించాల్సి ఉంటుంది.

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందాక పరిహారం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ నేప‌థ్యంలో పరిహారం కోసం ఏయే స‌ర్టిఫికెట్లు కావాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం..

ఇవి త‌ప్ప‌నిస‌రి..

ప్రభుత్వ ద‌వాఖాన‌లో ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్
స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదుచేసి పంచనామా నిర్వహించాలి
మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం
మృతుడి, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డుల జిరాక్సులు, బ్యాంక్ పాస్‌ బుక్ వివరాలు
కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు ఎలా చేయాలంటే..

మరణం సంభవించిన వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి
దరఖాస్తుతోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి తహశీల్దార్ ఆఫీస్‌లో స‌మ‌ర్పించాలి

Advertisement

తాజావార్తలు

Advertisement