త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | కోహినూర్ వజ్రం తిరిగిచ్చేయండి.. భారతీయులకు బ్రిటన్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే: కవిత సంచలన వ్యాఖ్యలు

భారత్‌ను దోచుకున్న బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కోహినూర్ వజ్రంతో పాటు మన సంపదను తిరిగి ఇచ్చేయాలని కల్వకుంట్ల కవిత సంచలన డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Aug 15, 2026, 10.00 pm IST

Kalvakuntla Kavitha | కోహినూర్ వజ్రం తిరిగిచ్చేయండి.. భారతీయులకు బ్రిటన్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే: కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
  • 200 ఏళ్ల పాటు భారతీయులపై చేసిన అరాచకాలకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ (Public Apology) చెప్పాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
  • దేశం నుంచి దోచుకెళ్లిన కోహినూర్ వజ్రంతో పాటు ఇతర అపార సంపదను భారత్‌కు తిరిగి అప్పగించాలి
  • బ్రిటన్ హిస్టరీ పుస్తకాల్లో భారత్‌పై ఉన్న తప్పుడు రాతలను వెంటనే సరిదిద్దాలి
  • 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి కవిత వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. 200 ఏళ్ల పాటు భారతీయులపై సాగించిన అరాచకాలకు గాను బ్రిటన్ రాజు (British King) బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

కొల్లగొట్టిన సంపద తిరిగివ్వాలి..

దేశాన్ని పాలించిన కాలంలో మన అపారమైన సంపదను బ్రిటీషర్లు దోచుకుపోయారని, కోహినూర్ వజ్రంతో (Kohinoor diamond) సహా వాటన్నింటినీ వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జలియన్ వాలా బాగ్ లాంటి నెత్తుటి దారుణాలతో పాటు, కృత్రిమ కరువులు సృష్టించి లక్షలాది మంది భారతీయుల ప్రాణాలు బలిగొన్న చరిత్ర వారిదన్నారు. ప్రపంచ యుద్ధాలకు మన సైనికులను వాడుకుని, ఆ తర్వాత స్వాతంత్య్రం ఇస్తామన్న మాటను వారు తప్పారని కవిత గుర్తు చేశారు.

చరిత్రను వక్రీకరించారు..

బ్రిటన్ హిస్టరీ బుక్స్ (History books) లో భారత్‌కు సంబంధించి అనేక తప్పుడు రాతలు ఉన్నాయని, ఆ అసత్యాలను తక్షణమే సరిదిద్దాలని కవిత డిమాండ్ చేశారు. అప్పట్లో ఒకే భూభాగంగా ఉన్న భారత్, పాకిస్తాన్‌లను ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా విభజించి, రెండు దేశాల మధ్య శాశ్వత శత్రుత్వాన్ని సృష్టించింది బ్రిటీషర్లేనని ఆమె మండిపడ్డారు.

బానిసత్వపు ఆనవాళ్లు చెరిపేయాలి..

తెల్ల తోలు గొప్ప, నల్ల తోలు తక్కువ అనే వివక్షను బ్రిటీషర్లు దేశంలో నాటారని.. ఇప్పటికీ ఇంగ్లీష్ (English) మాట్లాడటమే గొప్ప అనే భావన నుంచి మనం బయటపడాలని కవిత పిలుపునిచ్చారు. బ్రిటీష్ కల్చర్ (Culture), బానిసత్వపు ఆనవాళ్లను చెరిపేసి, మన దేశ ఘన చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్‌ను నిర్మించగలరని.. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్య్రం అని, ఆ పోరాట స్ఫూర్తిని ఇప్పటి పిల్లలకు తప్పకుండా నేర్పించాలని ఆమె ఉద్బోధించారు.

Advertisement
Advertisement