త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Indlu Scheme | ఇందిరమ్మ ఇండ్లకు పోటెత్తిన దరఖాస్తులు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో అప్లికేషన్లు షురూ

హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసే 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకానికి విశేష స్పందన వస్తోంది. కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

J

Hyderabad | Published On Aug 15, 2026, 8.20 pm IST

Indiramma Indlu Scheme | ఇందిరమ్మ ఇండ్లకు పోటెత్తిన దరఖాస్తులు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో అప్లికేషన్లు షురూ
Advertisement
  • హైదరాబాద్‌లో 16 నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం 60,014 దరఖాస్తులు
  • సగటున ఒక్కో ఫ్లాట్‌కు 8 మందికి పైగా పోటీ
  • త్వరలోనే లాటరీ (Lucky Draw) ద్వారా కేటాయింపు
  • కొత్తగా ఎల్బీ నగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మరో 1920 ఇండ్లకు దరఖాస్తుల ఆహ్వానం
  • సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వెల్లడి

Indiramma Indlu Scheme | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' (Indiramma Indlu Towers) పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల కోసం శనివారం నాటికి ఏకంగా 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఫ్లాట్‌కు 8 మందికి పైగా పోటీ పడుతున్నారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం వెల్లడించారు.

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆగస్టు 20న పారదర్శకంగా లాటరీ (Lottery) పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు.

కొత్తగా ఆ 4 నియోజకవర్గాల్లో..

డిమాండ్ దృష్ట్యా, తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • ఎల్బీ నగర్ పరిధిలోని అమ్మగూడ (హయత్‌నగర్)
  • గోషామహల్
  • ముషీరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్
  • చాంద్రాయణగుట్ట పరిధిలో బండ్లగూడ (ఫలక్‌నుమా సమీపంలో)

ఈ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద స్టిల్ట్ ప్లస్ 10 అంతస్తుల్లో ఒక్కో నియోజకవర్గానికి 480 చొప్పున.. మొత్తం 1920 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఎవరూ వలస వెళ్లకుండా, వారు ఉంటున్న ప్రాంతాల్లోనే ఈ ఇండ్లను కేటాయించనున్నారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

కొత్తగా ప్రకటించిన ఈ 4 నియోజకవర్గాల ప్రజలు సెప్టెంబర్ 3వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దగ్గర్లోని 'మీసేవా' (MeSeva) కేంద్రాల్లో గానీ, ఆన్‌లైన్‌లో 'మీసేవా వెబ్‌సైట్' ద్వారా లేదా 'మీసేవా వాట్సప్' ద్వారా అప్లై చేసుకోవచ్చు.

నిబంధనలు.. సబ్సిడీ ఇలా

ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని కోసం విలువైన స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్మాణానికి అదనంగా రూ.5 లక్షల సబ్సిడీని (Subsidy) అందిస్తోంది.

దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.10 వేలు చెల్లించాలి. లాటరీలో ఇల్లు రాని వారికి ఈ డబ్బును పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తారు.

లాటరీలో ఇల్లు దక్కిన లబ్ధిదారులు మిగతా రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించారు.

ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్ బోర్డు ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ 040-24603572 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులు (టాప్ 5)

కూకట్‌పల్లి: 9,208

కుత్బుల్లాపూర్: 7,210

ఖైరతాబాద్: 6,970

నాంపల్లి: 5,114

శేరిలింగంపల్లి: 4,860

Advertisement
Advertisement