త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా

గన్‌మెన్లు లేకుండా నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వద్దాం.. అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా! దమ్ముంటే సిద్ధమా?

J

Telangana | Published On Aug 15, 2026, 7.58 pm IST

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
Advertisement
  • సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
  • స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శలు
  • రుణమాఫీ, వ్యవసాయ కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్
  • దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులను రేవంత్ మోసం చేశారని, రెండు ఏళ్లలో రూ.15 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టారని ఆరోపణ

Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి (Sangareddy) సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) లాంటి పవిత్రమైన రోజున కూడా ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడటం, చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డికి పవర్ ఫుల్ ఛాలెంజ్ విసిరారు.

4:20కి మొదలుపెట్టి.. అన్నీ 420 మాటలే

"కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డిలో సీఎం కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం మొదలుపెట్టి, అన్నీ ఆ 420 మాటలే మాట్లాడారు" అని హరీశ్ ఎద్దేవా చేశారు. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన రోజున, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పకుండా దిగజారుడు రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు నీరందించే సింగూరు (Singur), సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను సీఎం మూలకు పడేశారని ఆరోపించారు.

గన్‌మెన్లు లేకుండా వద్దాం.. రాజీనామాకు రెడీనా?

రైతు రుణమాఫీ (Farm Loan Waiver) పేరుతో రేవంత్ రెడ్డి ఘరానా మోసానికి పాల్పడ్డారని హరీశ్ రావు దుయ్యబట్టారు. "దేవుడి మీద ఒట్టు పెట్టి మరీ రైతులను మోసం చేశాడు. నా ఛాలెంజ్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఇద్దరం గన్‌మెన్లు లేకుండా నీ సొంతూరికి (కొండారెడ్డిపల్లికి) వద్దాం. అక్కడ వంద శాతం రుణమాఫీ జరిగిందని తేలితే నేను అక్కడే నా పదవికి రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు చేస్తావా?" అని సవాల్ విసిరారు.

ఉద్యోగాలపై క్షమాపణ చెప్పాలి

ఉద్యోగాల కల్పనపై సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. "అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చారు. కానీ నిన్నటి సభలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దీనికి సీఎం నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీకు దమ్ముంటే గన్‌మెన్లను వదిలేసి అశోక్ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఓయూ దగ్గరికి వస్తారా?" అని ప్రశ్నించారు.

బహిరంగ చర్చకు నేను సిద్ధం

రుణమాఫీ కోసం అసెంబ్లీలో రూ.35 వేల కోట్లు కేటాయించామని చెప్పి, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని హరీశ్ ఆరోపించారు. అలాగే, రైతుబంధు (Rythu Bandhu) పేరుతో గత రెండేళ్లలో రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. 24 గంటల కరెంట్ అని గొప్పలు చెబుతున్న సీఎం.. కనీసం 10 గంటలు కూడా త్రీ-ఫేస్ కరెంట్ (Three-phase power) ఇవ్వడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతుబంధు అంశాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని.. దమ్ముంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా (Defamation case) వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Advertisement