త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | నిజంగా మీకు ఇంకా ప‌రువుంద‌ని రుజువు చెయ్‌.. కూలీ ప‌ని చేసైనా ప‌రిహారం చెల్లిస్తం: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌

RS Praveen Kumar | తమరి పరువు పోయిందని కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారని.. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తామ‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. నోరు లేని, పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా? అని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 25, 2026, 11.48 am IST

RS Praveen Kumar | నిజంగా మీకు ఇంకా ప‌రువుంద‌ని రుజువు చెయ్‌.. కూలీ ప‌ని చేసైనా ప‌రిహారం చెల్లిస్తం: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌
Advertisement
  • బాలిక ప‌రువు విలువ ఎన్నికోట్లో చెప్ప‌గ‌ల‌రా?
  • మీ కొడుకు మాన‌సిక చికిత్సకు ఆనాడే ఖ‌ర్చు పెడితే ఎంత బాగుండేదో
  • ఈ కేసులో మీరే మొద‌టి ముద్దాయి.. త‌రువాత‌నే భ‌గీర‌థుడు
  • బండి సంజ‌య్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఘాటు విమ‌ర్శ‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: తమరి పరువు పోయిందని కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారని.. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తామ‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని, పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు. ఈమేర‌కు ఆయ‌న సోమ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

బాధిత కుటుంబాన్ని బెదిరించ‌లేదంటే మేం న‌మ్మం..

కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది! ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారు. మీరు, సంగప్పలు గ‌త‌ ఏప్రిల్ 23న బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా? అని ఆర్ఎస్పీ నిల‌దీశారు.

ఆనాడే మీ ప‌రువు తీసుకున్నారు.

మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు. ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారు చేసి వదిలారు. ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే అని ప్ర‌వీణ్‌కుమార్ నొక్కొ చెప్పారు.

రేవంత్ మిత్ర ధ‌ర్మాన్ని పాటిస్తున్నారు..

సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు. కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది అని పేర్కొన్నారు.

లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ !!
పై శ్లోకాన్ని మిమ్మ‌ల్ని పెంచి పెద్ద చేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం చేసుకోండి. వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు అని ఆర్ఎస్పీ త‌నదైన శైలిలో విమ‌ర్శించారు.

 

Advertisement
Advertisement