త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Archita Sarangi Instagram post | ‘ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?’ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కూతురి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ డిలీట్ చేయనంటూ ఆమె తేల్చి చెప్పారు.

J

Viral news | Published On Jul 26, 2026, 6.29 pm IST

Archita Sarangi Instagram post | ‘ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?’ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
Advertisement
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత చేసిన పోస్ట్ వైరల్
  • తన తల్లికి మెసేజ్ చేసి పోస్ట్ డిలీట్ చేయమని అడగొద్దని, తాను డిలీట్ చేయనంటూ ప్రధాన్ పీఏకు అర్చిత కౌంటర్
  • ఈ పరిణామాల తర్వాత అర్చిత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (Instagram account) డీయాక్టివేట్
  • ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని, ఆయనకు మద్దతుగా ఎంపీ అపరాజిత ప్రకటన

Archita Sarangi Instagram post | 'నీట్' (NEET) పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రాజీనామాపై ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కూతురు అర్చిత సారంగి చేసిన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన పోస్ట్‌ను డిలీట్ చేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.

"డిలీట్ చేయను.. జై జగన్నాథ్"

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే.. ఆ వార్తకు సంబంధించిన న్యూస్ హెడ్‌లైన్‌ను అర్చిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను తొలగించాలని ఆమెపై ఒత్తిడి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ (DP) పీఏను ఉద్దేశించి ఆమె ఘాటుగా స్పందించారు.

"DP పీఏకు నాదొక విన్నపం. నా పోస్ట్‌ను డిలీట్ చేయమని మా అమ్మకు టెక్స్ట్ మెసేజ్ చేయకండి. మీరు ఇబ్బంది పడకండి, నేను ఆ పోస్ట్ డిలీట్ చేయను. జై జగన్నాథ్! జై హింద్!" అని అర్చిత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.

మద్దతు తెలిపిన ఎంపీ.. అకౌంట్ డీయాక్టివేట్

ఒకవైపు కూతురు ఇలా పోస్టులు పెడుతుండగా.. మరోవైపు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధైర్యంగా ఆయన రాజీనామా చేశారని ఆమె ప్రశంసించారు. అపరాజిత సారంగి గతంలో ఐఏఎస్ (IAS) ఆఫీసర్‌గా పనిచేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో భువనేశ్వర్ నుంచి బిజూ జనతాదళ్ (BJD) అభ్యర్థిపై 35,000 పైగా ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. కాగా, ఈ వివాదం జరిగిన కొంత సమయానికే అర్చిత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ (Deactivated) అయినట్లు సమాచారం.

రాజీనామా వెనుక ప్రధాన్ ఏమన్నారంటే

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వంతో జరపాల్సిన మూడో విడత చర్చలకు ముందే ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. "దేశ యువత కలలు, వారి ఆకాంక్షల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలను దేశ వ్యతిరేక శక్తులు వాడుకోకూడదని.. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని స్పష్టం చేశారు.

ఆందోళన విరమించిన CJP

నీట్ ప్రొటెస్ట్‌లను ముందుండి నడిపించిన CJP ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ప్రధాన్ రాజీనామాతో పాటు, మే నెలలో పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, అలాగే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రులతో ప్రెస్ మీట్ నిర్వహించిన CJP.. తమ డిమాండ్లన్నీ నెరవేరాయని ప్రకటించి, ఆందోళనను విరమించుకుంది.

Advertisement
Advertisement