త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | పాల్వంచ శ్రీ‌నివాసగుట్ట అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి

Ponguleti Srinivas Reddy | పాల్వంచలోని శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ రీస‌ర్వేను నిర్ణీత గ‌డువులోపు పూర్తి చేయాల‌న్నారు.

S

Telangana | Published On Jul 19, 2026, 2.06 pm IST

Ponguleti Srinivas Reddy | పాల్వంచ శ్రీ‌నివాసగుట్ట అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి
Advertisement
  • భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
  • రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలి
  • అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచ‌న‌లు

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: పాల్వంచలోని శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆదేశించారు. గుట్టపై వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మ‌రోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ రీస‌ర్వేను నిర్ణీత గ‌డువులోపు పూర్తి చేయాల‌న్నారు. ఇందుకు రెవెన్యూ, అట‌వీ, పోలీసు శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో పని చేయాల‌ని సూచించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌లో జిల్లాలో భూముల రీ-సర్వే ప్రగతి, అటవీ-రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూములు, శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై ఆయన అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడారు. జిల్లాలో సర్వే పనులు మరింత వేగవంతం కావాలన్నారు. ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయ‌ని, ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు తెల‌ప‌గా మిగిలిన గ్రామాల్లోనూ నిర్దేశిత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల‌ని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు, రోవర్ పరికరాల కొరత రాకుండా అవసరమైన చోట అదనపు వనరులను సమకూర్చుకోవాలని ఆదేశించారు.

కొత్త‌గా పోడు సాగు జ‌ర‌గొద్దు..

అటవీ-రెవెన్యూ భూ సమస్యలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ప్రతి నెలా సమీక్షా సమావేశాల ద్వారా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలి. కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. గతంలో పోడు సాగు చేస్తున్న వారి సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి అని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement