త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Reservoirs | మూడో వంతు కూడా నిండలేదు.. వెలవెలబోతున్న రిజర్వాయర్లు

Telangana Reservoirs | గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్ నినో ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న ఆశలు నెరవేరేలా కనబడడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు వచ్చి ఆ రిజర్వాయర్లు నిండుతున్నాయే తప్ప.. దిగువన ఉన్న మనకు పెద్దగా కలిసొచ్చే పరిస్థితి లేదు.

S

Telangana | Published On Jul 30, 2026, 6.49 pm IST

Telangana Reservoirs | మూడో వంతు కూడా నిండలేదు.. వెలవెలబోతున్న రిజర్వాయర్లు
Advertisement

73 జలాశయాల్లో చేరిన నీరు కేవలం 33 శాతమే
1059 టీఎంసీలకు గాను ప్రస్తుతం ఉన్నది 360 టీఎంసీలే
డెడ్ స్టోరేజీ దిగువకు చేరిన శ్రీశైలం
గత 3 రోజులుగా వచ్చి చేరింది 3 టీఎంసీలే
వారం రోజులుగా 137 టీఎంసీలకే నాగార్జునసాగర్ పరిమితం

Telangana Reservoirs | త్రినేత్ర.న్యూస్ : గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్ నినో ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న ఆశలు నెరవేరేలా కనబడడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు వచ్చి ఆ రిజర్వాయర్లు నిండుతున్నాయే తప్ప.. దిగువన ఉన్న మనకు పెద్దగా కలిసొచ్చే పరిస్థితి లేదు. జూన్, జూలై మాసాలు గడిచిపోయినా.. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ దిగువకు చేరుకున్నది. నాగార్జున సాగర్‌లో కూడా నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరుకున్నాయి. గోదావరి బేసిన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా.. రాష్ట్రంలో నీళ్లు నిల్వ ఉంచుకోగల 73 రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం 1059 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం కేవలం 359 టీఎంసీలే నిల్వ ఉన్నాయి.

కృష్ణా బేసిన్‌లో.. నీళ్లే లేవు

ప్రభుత్వ నీటి పారుదల శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 87 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 73 రిజర్వాయర్లలో మాత్రమే ప్రస్తుతం నీటిని నింపుకోగలం. వీటన్నింటి నిల్వ సామర్థ్యం 1059.3 టీఎంసీలు. కాగా ప్రస్తుతం కేవలం 359 టీఎంసీలు (34 శాతం) మాత్రమే నిల్వ ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 326 టీఎంసీలు కాగా, కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 640 టీఎంసీలుగా ఉంది. అయితే.. కృష్ణా బేసిన్‌లో కేవలం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు కలిపే 527 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 203 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 299 టీఎంసీలతో మొత్తం 500కు పైగా టీఎంసీలతో కృష్ణా బేసిన్ కళకళలాడింది. గురువారం సాయంత్రం నాటికి శ్రీశైలంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీ(53 టీఎంసీలు) కన్నా దిగువకు 46 టీఎంసీలకు పడిపోయింది. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ (131 టీఎంసీలు) కన్నా 5 టీఎంసీలు మాత్రమే అధికంగా నీళ్లున్నాయి. వారం రోజులుగా ఇంతకు మించి నీళ్లు వచ్చి చేరలేదు.

గోదావరిలో కూడా.. అంతంతే

గోదావరి నదిపై రాష్ట్రంలో మొత్తం 57 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిలో 43 రిజర్వాయర్లను మాత్రమే ప్రస్తుతం వినియోగించుకుంటున్నాం. మేడిగడ్డ, అన్నారం,ప్రాణహిత రిజర్వాయర్ల వద్ద గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 1,96,00 క్యూసెక్కులు యథావిధిగా దిగువకు వెళ్లిపోతున్నాయి. కాగా, ఎగువ నుంచి నీటి ప్రవాహంతో శ్రీపాద ఎల్లంపల్లికి ఊరట కలిగింది. ప్రస్తుతం అక్కడ 16 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. లోయర్ మానేరు, మిడ్ మానేరు కలిసి మరో 14 టీఎంసీలు.. మల్లన్నసాగర్‌లో 13 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీరాం సాగర్ ప్రాజక్టులోకి 48 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీలకు గాను కేవలం 20 టీఎంసీలే వచ్చి చేరాయి. డెడ్ స్టోరేజీ పోను.. మనం వాడుకోగలిగినవి కేవలం 7 టీఎంసీలే. ఈ నీళ్లతో ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు అందే పరిస్థితి లేదు.

తెలంగాణలో (నీళ్లు నిల్వ ఉంచగల) మొత్తం రిజర్వాయర్లు - 73

నిల్వ సామర్థ్యం- 1059.3 టీఎంసీలు
ప్రస్తుతం ఉన్న నిల్వ - 359.85 టీఎంసీలు
శాతం - 33.97%

గోదావరి బేసిన్‌లో నిల్వ చేసుకోదగిన రిజర్వాయర్లు - 43

నిల్వ సామర్థ్యం - 326.93 టీఎంసీలు
ప్రస్తుతం ఉన్న నిల్వ - 116.01 టీఎంసీలు
గత ఏడాది ఇదే సమయానికి నిల్వ - 138.78 టీఎంసీలు
ఎంత తేడా - 22 టీఎంసీలు
ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి శాతం- 35 %

కృష్ణా బేసిన్‌లో రిజర్వాయర్లు - 30

నిల్వ సామర్థ్యం - 640.97 టీఎంసీలు
ప్రస్తుతం ఉన్న నిల్వ - 243.92
గత ఏడాది ఇదే సమయానికి నిల్వ - 580 టీఎంసీలు
ఎంత తేడా - 337 టీఎంసీలు
ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి శాతం - 38 %

 

Advertisement
Advertisement