త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | బీసీల నోటికాడ బుక్క లాగేస్తున్న ‘రెడ్డి’ ప్ర‌భుత్వం

Teenmar Mallanna | తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన 7437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రకటన వెనుక బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, ప్రభుత్వ మోసాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీల ఉద్యోగాలను ‘దొంగతనంగా’ ఎత్తుకెళ్తున్నారని ఆయన మండిపడ్డారు.

S

Telangana | Published On Jul 30, 2026, 5.45 pm IST

Teenmar Mallanna | బీసీల నోటికాడ బుక్క లాగేస్తున్న ‘రెడ్డి’ ప్ర‌భుత్వం
Advertisement

పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌లో
ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ కోటా త‌గ్గించాలి
టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన 7437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రకటన వెనుక బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, ప్రభుత్వ మోసాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీల ఉద్యోగాలను ‘దొంగతనంగా’ ఎత్తుకెళ్తున్నారని ఆయన మండిపడ్డారు.

‘ఖాకీ’ బట్టలతో అణచివేసే కుట్ర

రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, కేవలం పోలీస్ పోస్టులనే ఎందుకు భర్తీ చేస్తున్నారో నిరుద్యోగులు ఆలోచించాలని మల్లన్న ప్రశ్నించారు. శారీరక దారుఢ్యం కలిగి, బలంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఉద్యోగాలు లేక ఉద్యమాల్లోకి వస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే.. వారిని ‘సైలెన్స్’ చేయడానికి, చేతికి లాఠీ ఇచ్చి ఖాకీ బట్టలు వేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.

బీసీల వాటా సగం మాయం

నోటిఫికేషన్ లెక్కలను వివరిస్తూ.. 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం 3715 పోస్టులు రావాల్సి ఉండగా, కేవలం 27 శాతం రిజర్వేషన్ ఇచ్చి 2008 పోస్టులకే పరిమితం చేశారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1700లకు పైగా బీసీ ఉద్యోగాలను ప్రభుత్వం బీసీలకు దక్కకుండా కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఈడబ్ల్యూఎస్ పేరుతో ఉద్యోగాల దోపిడీ

కేవలం 5 శాతం ఉన్న ఓసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టి, వారికి దక్కాల్సిన 372 పోస్టుల కంటే రెట్టింపుగా 744 పోస్టులు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈడబ్ల్యూఎస్ వల్ల జనరల్ కేటగిరీలో రావాల్సిన పోస్టులు తగ్గిపోయి, మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ ప్రభుత్వం ఉంటేనే న్యాయం

"బీసీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి ఈడబ్ల్యూఎస్‌లు ఉండవు.. బీసీల హక్కులు దొంగిలించే పరిస్థితి ఉండదు" అని మల్లన్న వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సోదరులు ఇప్పటికైనా ఆలోచించి, బీసీలకు రావాల్సిన ఉద్యోగాలను ఎవరు ఎత్తుకుపోతున్నారో గమనించాలని, మీ హక్కుల కోసం కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ నిరుద్యోగుల నోటికాడ బుక్కను ఈడబ్ల్యూఎస్ పేరుతో దొంగతనంగా ఎత్తుకెళ్తున్న ఈ నోటిఫికేషన్ కుట్రను నిరుద్యోగ లోకం గమనించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో ఈడ‌బ్ల్యూఎస్ కోటాను రద్దు చేసి ఆ రిజర్వేషన్ పేరుతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్యోగాల నుండి తొలగించి ఆ ఉద్యోగాలను అర్హులకు ఇస్తాం అని తీన్మార్ మ‌ల్ల‌న్న‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement