త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కూరగాయల సాగును ప్రోత్సహించండి.. 75 శాతం స‌బ్సిడీతో విత్త‌నాల పంపిణీ

CM Revanth Reddy | రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

S

Telangana | Published On Jul 30, 2026, 6.45 pm IST

CM Revanth Reddy | కూరగాయల సాగును ప్రోత్సహించండి.. 75 శాతం స‌బ్సిడీతో విత్త‌నాల పంపిణీ
Advertisement
సెంట్రలైజ్డ్ కిచెన్స్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి
ఆర్గానిక్ సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించండి
నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నివేదికను అందజేసిన కమిటీ
CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్  కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి సారించాల‌న్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్‌టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. నివేదికలో కమిటీ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. తెలంగాణలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపింది. 75శాతం సబ్సిడీతో ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది.
గత ఏడాది ఈ సీజన్‌లో 79.49 లక్షల ఎకరాలు సాగవగా, ఈ ఏడాది 74.56 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయని పేర్కొంది. పత్తి పంట 45 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటల సాగు ఉందని నివేదికలో తెలిపింది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో 75 నుంచి 90శాతం సబ్సిడీ అందించి డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సూచించింది.
పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై అందించి.. పశు గ్రాస సాగును ప్రోత్సహించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని తెలిపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలంది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement