త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | జూరాల‌కు భారీ వ‌ర‌దొస్తోంది.. వెంట‌నే అన్ని పంపులు ఆన్ చేయాలి

Srinivas Goud | ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు భారీ వరద వస్తోందని.. ఉన్న రిజ‌ర్వాయ‌ర్లు నింపుకోవాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్‌గౌడ్ విమ‌ర్శించారు. పాలమూరు జిల్లాకు కృష్ణా, తుంగభద్ర, భీమ నదులే ఆధారమని చెప్పారు. జూరాల ప్రాజెక్టుకు కూడా భారీ వరద వస్తోంది.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకు వదులుతున్నారని ఆరోపించారు.

S

Telangana | Published On Jul 30, 2026, 3.28 pm IST

Srinivas Goud | జూరాల‌కు భారీ వ‌ర‌దొస్తోంది.. వెంట‌నే అన్ని పంపులు ఆన్ చేయాలి
Advertisement
  • విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్లు కిందకు వదులుతున్నరు
  • ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రానికి కృష్ణా జలాలు రావ్
  • క‌ర్ణాట‌క సీఎంతో రేవంత్‌రెడ్డి చ‌ర్చించి వెంట‌నే అడ్డుకోవాలి
  • లేదంటే పాలమూరు, నల్లగొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్‌

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు భారీ వరద వస్తోందని.. ఉన్న రిజ‌ర్వాయ‌ర్లు నింపుకోవాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్‌గౌడ్ విమ‌ర్శించారు. పాలమూరు జిల్లాకు కృష్ణా, తుంగభద్ర, భీమ నదులే ఆధారమని చెప్పారు. జూరాల ప్రాజెక్టుకు కూడా భారీ వరద వస్తోంది.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకు వదులుతున్నారని ఆరోపించారు. వెంట‌నే అన్ని పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ నేత‌ల‌తో కలిసి తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

కేవలం తాగునీటి అవసరాలకే నీటిని నిల్వ ఉంచుతామనే వైఖరి సరికాదు. వ్యవసాయానికి నీరు ఇవ్వమనే ప్రభుత్వ వైఖరి సరికాదు. రెండు పిల్లర్లను మరమ్మతు చేస్తే మేడిగడ్డ బ్యారేజీని వినియోగించుకునే అవకాశం ఉంది. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతోనే కన్నెపల్లి వద్ద మోటార్లను ఆన్ చేయడం లేదు. ఎల్‌నినో వంటి పరిస్థితులు వచ్చినా కరువును తట్టుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ రూపొందించారు. ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారంటే, కేసీఆర్ ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లే కారణం అని శ్రీ‌నివాస్‌గౌడ్ గుర్తు చేశారు.

ఆల్మ‌ట్టిని అడ్డుకోకుంటే పాల‌మూరు, న‌ల్లగొండ‌పై ప్ర‌భావం..

గోదావరి, కృష్ణా నదుల ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న అన్ని లిఫ్ట్ స్కీమ్‌లను నడపాలి. కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను మేం ఇటీవలే పరిశీలించాం. పొరుగు రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటక శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భూ సేకరణకే కర్ణాటక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆల్మట్టి విషయంలో కర్ణాటక దూకుడును చూసి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రానికి కృష్ణా జలాలు రావు. పాలమూరు, నల్లగొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డగా స్పందించి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి. సీఎం రేవంత్ కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి. సరైన సమయంలో స్పందించకపోతే పాలమూరు ఎడారిగా మారే ప్రమాదం ఉంది అని శ్రీ‌నివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

ఆరు నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి..

కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు కేవలం రూ.98 వేల కోట్లు మాత్రమే. లక్ష కోట్ల రూపాయలు నీళ్లలో కలిసిపోయాయని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు రావడం సంతోషకరం. కేసీఆర్ హయాంలో కేంద్రంపై తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే ఈ అనుమతులు వచ్చాయి. ఆరు నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి. కాలువల తవ్వకాలకు వెంటనే టెండర్లు పిలవాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈ పాటికే పూర్తయి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. సాగునీరు ఇవ్వడంపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ హెచ్చ‌రించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement