త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామ‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన‌ బీమా సంస్థ

Health Insurance | ముఖ్య‌మంత్రి మామ‌ను హెల్త్‌ ఇన్సూరెన్స్ (Health Insurance) సంస్థ ముప్పుతిప్ప‌లు పెట్టింది. పాల‌సీ తీసుకునేప్పుడు పోలియో వ‌చ్చిన విష‌యం చెప్ప‌క‌పోవ‌డంతో వైద్య బీమా క్లెయిమ్‌ను (Insurance Claim) తిర‌స్క‌రించింది.

G

Telangana | Published On Jul 25, 2026, 7.36 am IST

Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామ‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన‌ బీమా సంస్థ
Advertisement

Health Insurance | త్రినేత్ర‌.న్యూస్: ముఖ్య‌మంత్రి మామ‌ను హెల్త్‌ ఇన్సూరెన్స్ (Health Insurance) సంస్థ ముప్పుతిప్ప‌లు పెట్టింది. పాల‌సీ తీసుకునేప్పుడు పోలియో వ‌చ్చిన విష‌యం చెప్ప‌క‌పోవ‌డంతో వైద్య బీమా క్లెయిమ్‌ను (Insurance Claim) తిర‌స్క‌రించింది. అప్లికేష‌న్ ఫామ్ నింపేట‌ప్పుడు కావాల‌నే త‌న‌కు పోలియో (Pulse Polio) ఉంద‌ని చెప్ప‌లేదంటూ వైద్య ఖ‌ర్చులు చెల్లించేందుకు నిరాక‌రించింది. దీంతో వినియోగ‌దారుల ఫోర‌మ్‌లో (Consumer Forum) ఫిర్యాదు చేయ‌డంతో.. క్లెయిమ్‌తోపాటు కోర్టు ఖ‌ర్చులు, వ‌డ్డీ చెల్లించాల‌ని, దానికితోడు వయోవృద్ధుడిని మాన‌సికంగా వేధించినందుకు ఫైన్ కూడా చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. అడ్డగోలు నిబంధనలు చూపుతూ క్లెయిమ్‌ చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకల్య వ్యక్తుల రక్షణ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుందని హెచ్చరించింది.

బంజారాహిల్స్‌ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న సూదిని పద్మారెడ్డి(Sudini Padma Reddy-76)కి మూడేండ్ల‌ వయస్సులోనే పోలియో రావ‌డంతో అంగవైకల్యం సంభవించింది. కాగా,  2019లో ఆయన నివా బూపా ఆరోగ్య బీమా (Niva Bupa Health Insurance) సంస్థ నుంచి రూ.20 లక్షల పాలసీ కొనుగోలు చేశారు. దానిని 2025 వరకు రెన్యువల్‌ చేయించుకుంటూ వచ్చారు. పాలసీ తీసుకున్న సమయంలోనూ ఆయ‌న‌కు అంగవైకల్యం ఉంది. దానిని గుర్తించ‌ని బీమా సంస్థ ప్రతినిధి నమోదు చేయలేదు.

కాగా, 2024 మేలో పద్మారెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ద‌వాఖాన‌కు తరలించారు. దీంతో ఆయ‌న‌కు శస్త్ర చికిత్స చేశారు. హాస్పిట‌ల్ బిల్లు రూ.23.5 లక్షలు (Hospital Charges) అయ్యింది. ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న సమయంలో బిల్లులను బీమా సంస్థకు సమర్పించారు. అయితే పాలసీ తీసుకున్నప్పుడు ఆయనకు పోలియో ఉన్నట్లుగా నమోదు చేయలేదని చెబుతూ బీమా సంస్థ ప్రతినిధులు క్లెయిమ్‌ను నిరాకరించారు. దీంతో ఆయ‌న వినియోగదారుల ఫోరంలో పిర్యాదు చేశారు. పాలసీ తీసుకున్న‌ప్పుడు అప్లికేష‌న్ ఫామ్‌లో వైకల్యం గురించి ప్రస్తావించలేదని, సంస్థ నిబంధనల ప్రకారం క్లెయిమ్‌ను తిరస్కరించామని నివా బూపా లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది.

అప్పుడు క‌నిపించ‌లేదా..

అయితే బీమా సంస్థ తీరును ఫోర‌మ్‌ తప్పుబట్టింది. ఫిర్యాదుదారుడు 2019 నుంచి పాలసీని ఐదేండ్లుగా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో బీమా సంస్థ ప్రతినిధులు ఆయన వైకల్య పరిస్థితి గమనించే అవకాశం ఉంది. అయినా పట్టించుకోకుండా బీమా చెల్లించాల్సి వచ్చినపుడు ఆ కారణం చూపి తిరస్కరించడం తప్పని ఫోరమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దివ్యాంగుడైన సీనియర్‌ సిటిజన్‌ను అవమానించేలా సంస్థ తీరు ఉందంటూ మండిప‌డింది. వైకల్యం సాకుగా చూపుతూ క్లెయిమ్‌ను తిరిస్కరిస్తే డిసేబుల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వైకల్యం ఉన్నప్పటికీ పాలసీ తీసుకున్న సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా కారణాలతో ఆనారోగ్యానికి గురైతే క్లెయిమ్‌ ఇవ్వాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. క్లెయిమ్‌ మొత్తం రూ.20 లక్షలకు 9 శాతం వడ్డీ, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.2 లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాల‌ని ఆదేశించింది. అదనంగా వినియోగదారుల రక్షణ చట్టం కింద మరో రూ.లక్ష పరిహారాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 45 రోజుల్లోగా జమ చేయాలని చెప్పింది. 45 రోజులు దాటితే మరో రూ.లక్ష పరిహారం చెల్లించాల‌ని తీర్చువెలువ‌రించింది.

Advertisement
Advertisement