త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఆకాశం వైపు ఆశగా చూడటం రైతుకు అలవాటే.. కానీ ఆ ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆకాశం వైపు చూసి ఆశతో పంటలు వేయొద్దని, అందుబాటులో ఉన్న నీటిని చూసే ప్రణాళికలు వేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.

J

Telangana | Published On Aug 20, 2026, 9.26 pm IST

Uttam Kumar Reddy | ఆకాశం వైపు ఆశగా చూడటం రైతుకు అలవాటే.. కానీ ఆ ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదు
Advertisement
  • తెలంగాణలో వర్షపాతం లోటు ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి 
  • భవిష్యత్తులో వర్షాలు వస్తాయనే ఆశతో కాకుండా, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగానే వ్యవసాయం చేయాలి
  • వేసవి పూర్తయ్యే వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని కాపాడుకోవడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత 
  • హుజూర్‌నగర్ పరిధిలోని పులిచింతల వెనుక జలాలతో 53 వేల ఎకరాలకు సాగునీరు అందించే దొండపాడు ఎత్తిపోతల పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
  • రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన

Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఆకాశం వైపు ఆశగా చూడటం రైతుకు అలవాటే.. కానీ ఆ ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నదాతలకు కీలక సూచన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు (Rain Deficit) ఉన్నాయని, రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఒకవేళ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాలు సరిగ్గా కురవకపోతే పరిస్థితి మరింత కష్టంగా మారే ప్రమాదం ఉందంటూ ఆయన రైతులను అలర్ట్ చేశారు.

గురువారం సూర్యాపేట జిల్లాలో ఆయన పర్యటించారు. మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ (దొండపాడు ఎత్తిపోతల) పథకం పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జలాశయాల్లో నీటి లభ్యత, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

వర్షాల కోసం కాకుండా.. ఉన్న నీటితోనే సాగు

వర్షపాతం లోటు కారణంగా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) తో సహా ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రావడం లేదని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం కేవలం తెలంగాణకే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన వివరించారు. "భవిష్యత్తులో వానలు వస్తాయన్న ఆశతో పంటలు వేయడం కన్నా.. పంట చేతికొచ్చే వరకు నీరు అందుతుందా? లేదా? అన్నది చూసుకుని నిర్ణయం తీసుకోవాలి. నమ్మకమైన నీటి వనరులను బట్టే వ్యవసాయ ప్రణాళికలు (Agricultural Plans) ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు.

ముందు తాగునీరు.. ఆ తర్వాతే సాగునీరు

ప్రభుత్వానికి సాగునీరు ఎంత ముఖ్యమో, తాగునీరు కూడా అంతే ముఖ్యమని మంత్రి గుర్తుచేశారు. వచ్చే వేసవి కాలం పూర్తయి, మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు ప్రజల దాహం తీర్చేందుకు సరిపడా నీటి నిల్వలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీరు, పైనుంచి వచ్చే ఇన్‌ఫ్లోస్ ఆధారంగానే సాగునీటి విడుదలపై సైంటిఫిక్‌గా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

పులిచింతల బ్యాక్ వాటర్‌తో 53 వేల ఎకరాలకు భరోసా

కృష్ణా జలాలపై ఆధారపడిన మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల రైతులకు మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఒక రక్షణ కవచం లాంటిదని ఉత్తమ్ తెలిపారు. నాగార్జునసాగర్‌లో నీరు లేనప్పుడు పులిచింతల (Pulichintala Project) వెనుక జలాలను లిఫ్ట్ చేసి దాదాపు 53 వేల ఎకరాలకు నీరందించేలా ఈ పథకాన్ని డిజైన్ చేశామన్నారు.

ఈ ప్రాజెక్టు కింద నిర్మించాల్సిన 40 కి.మీ కాలువల్లో ఇప్పటికే 30 కి.మీ పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ డిసెంబర్ నాటికి ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లను (Irrigation Engineers) మంత్రి ఆదేశించారు. అలాగే, పథకం నిర్వహణకు అవసరమైన 132 కేవీ సబ్-స్టేషన్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement