త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lingamaneni Sanjush Arrest | లగ్జరీ కారుతో ఢీకొట్టి సేల్స్ గర్ల్ ప్రాణం తీసింది జనసేన ఎంపీ కొడుకే

మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద అతివేగంతో ఆస్టన్ మార్టిన్ కారు నడిపి యువతి ప్రాణాలు తీసిన కేసులో రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌ అరెస్ట్.

J

Hyderabad | Published On Aug 20, 2026, 9.12 pm IST

Lingamaneni Sanjush Arrest | లగ్జరీ కారుతో ఢీకొట్టి సేల్స్ గర్ల్ ప్రాణం తీసింది జనసేన ఎంపీ కొడుకే
Advertisement
  • హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న యువతిని బలంగా ఢీకొట్టిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారు
  • ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన లైఫ్‌స్టైల్ స్టోర్ సేల్స్ గర్ల్ భారతి ముఖి (26)
  • కారు నడిపింది జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌గా నిర్ధారించి అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం

Lingamaneni Sanjush Arrest | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) ఐటీ కారిడార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇనార్బిట్ మాల్ ఎదురుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ కారు ఓ అమాయక యువతి ప్రాణాలను బలిగొంది. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనలో కారు నడిపింది జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌గా పోలీసులు నిర్ధారించారు. అతడిని అరెస్ట్ (Arrest) చేసి విచారణ ముమ్మరం చేశారు.

భోజనానికి వెళ్లి వస్తుండగా..

పోలీసుల వివరాల ప్రకారం.. ఇనార్బిట్ మాల్‌లోని (Inorbit Mall) లైఫ్‌స్టైల్ స్టోర్‌లో భారతి ముఖి (26) అనే యువతి సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. ఆగస్టు 16 మధ్యాహ్నం 3 గంటల సమయంలో తోటి ఉద్యోగిని పూజతో కలిసి భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఐటీసీ కోహినూర్ (ITC Kohinoor) దగ్గర ఫుడ్ తీసుకుని, తిరిగి మాల్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ఘోరం జరిగింది.

అతివేగమే ప్రాణం తీసింది

ఆ సమయంలో రోడ్డుపై అత్యంత నిర్లక్ష్యంగా, అతివేగంగా దూసుకొచ్చిన ఆస్టన్ మార్టిన్ (Aston Martin) లగ్జరీ కారు భారతిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమై, విపరీతమైన రక్తస్రావం జరగడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన వారు అదే కారులో బాధితురాలిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంపీ కొడుకు అరెస్ట్

ఈ ఘటనపై మృతురాలి మేనేజర్ అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడి సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి కారు నడిపింది ఎంపీ కుమారుడు సంజూష్‌ (Sanjush) గా తేల్చారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి యువతి మరణానికి కారణమైనందుకు గాను అతడిపై కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.

Advertisement
Advertisement