త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువ‌త‌కు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పిలుపు

Minister Vakiti Srihari | మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, క్రీడలు మాత్రం ఆరోగ్యకరమైన జీవనశైలికి, క్రమశిక్షణకు, విజయాలకు మార్గం చూపుతాయని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

P

Telangana | Published On Jun 22, 2026, 4.35 pm IST

Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువ‌త‌కు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పిలుపు
Advertisement

Minister Vakiti Srihari | మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, క్రీడలు మాత్రం ఆరోగ్యకరమైన జీవనశైలికి, క్రమశిక్షణకు, విజయాలకు మార్గం చూపుతాయని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఉపాధి, గుర్తింపు అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12.53 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిధులతో రూ.10.70 కోట్ల వ్యయంతో 400 మీటర్ల, 8 లైన్ల అంతర్జాతీయ ప్రమాణాల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, రూ.1 కోట్లతో నాలుగు ఓపెన్ జిమ్‌లు, రూ.51 లక్షలతో ఇండోర్ జిమ్, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ మిగిలిన పనులను పూర్తి చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. సింథటిక్ ట్రాక్ ద్వారా జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అవకాశాలు లభిస్తాయని అన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. యువత క్రీడలను సీరియస్‌గా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే సుమారు రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించిన మంత్రి, అవసరమైతే క్రీడారంగ అభివృద్ధికి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని స్విమ్మింగ్ పూల్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో క్రీడా సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి తొలి సంతకంతో మహబూబ్‌నగర్‌కు ఈ ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు. జిల్లాలో వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాను క్రీడల రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌కు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాలని కోరగా, అందుకు అవసరమైన 30 ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.12.53 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోచ్‌ల కొరత తీర్చేందుకు సుమారు 350 మంది కోచ్‌ల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కార్య‌క్ర‌మంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డీ జానకి, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నషా ముక్త్ భారత్ సప్తాహ్’ పోస్టర్‌ను ఆవిష్కరించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.

Advertisement
Advertisement