త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్‌, డేట్ చెప్తే ఆధారాల‌తో వ‌స్తం

Koppula Eshwar | సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టెండర్లపై అవగాహన లేదని.. మొద‌ట‌ రూ.630 కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పి.. త‌ర్వాత ఆరు రోజులకే మాట మార్చి రూ.1130 కోట్లకు టెండర్లు పిలిచామ‌ని చెప్పార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ విమ‌ర్శించారు. గురుకుల టెండర్లపై అడ్లూరి స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామ‌న్నారు.

S

Telangana | Published On Jun 22, 2026, 6.07 pm IST

Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్‌, డేట్ చెప్తే ఆధారాల‌తో వ‌స్తం
Advertisement
  • గురుకుల టెండర్లపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధం
  • అన్ని డాక్యుమెంట్లతో వ‌చ్చి అవినీతిని నిరూపిస్తాం
  • ఆధారాలుంటేనే హ‌రీశ్‌రావు మాట్లాడతార‌ని ల‌క్ష్మ‌ణ్ తెలుసుకోవాలి
  • దళిత వర్గాల డబ్బునూ దోచుకోవాలనుకోవడం మూర్ఖత్వం
  • కొండా సురేఖ లెట‌ర్ రాసినా ప‌ట్టించుకోలే
  • గుజరాత్‌లోని మఫత్ లాల్ కంపెనీకి రూ.1800 కోట్ల టెండ‌ర్లు ఎట్లిస్త‌రు?
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్

Koppula Eshwar | త్రినేత్ర‌.న్యూస్‌: సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టెండర్లపై అవగాహన లేదని.. మొద‌ట‌ రూ.630 కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పి.. త‌ర్వాత ఆరు రోజులకే మాట మార్చి రూ.1130 కోట్లకు టెండర్లు పిలిచామ‌ని చెప్పార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ విమ‌ర్శించారు. మొత్తం టెండర్లు రూ.2,500 కోట్లకు పిలిచారన్నారు. గురుకుల టెండర్లపై అడ్లూరి స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామ‌న్నారు. టైమ్‌, డేట్ చెప్తే హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. ఆధారాల‌తో వ‌చ్చి అవినీతిని నిరూపిస్తాం అని తేల్చి చెప్పారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అడ్లూరిపై నిప్పులు చెరిగారు.

మేం కూడా అదే అంటున్నం..

గురుకుల విద్యాసంస్థల టెండర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దలా తన్నుకుపోయింది. ఈ అవినీతిపై హరీశ్‌రావు మాట్లాడితే కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. అవినీతి బయటపడిన రోజు వారికి ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు. టెండర్ల ప్రక్రియతో తనకు సంబంధం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. మేం కూడా అదే అంటున్నాం. మంత్రులకు టెండర్లపై అవగాహన లేదని చెబుతూనే ఉన్నాం అని ఎద్దేవా చేశారు.

రూ.2,500 కోట్ల‌కు టెండ‌ర్లు పిలిచారు..

టెండర్ల విధానం మార్చేపుడు బోర్డు మీటింగ్‌లో చర్చ జరిగితే ఆ మినిట్స్ బయటపెట్టాలి. అధికారులు అవినీతికి పాల్పడి మీకు ముడుపులు చెల్లిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టెండర్లపై అవగాహన లేదు. గ్రాసరీస్ టెండర్లు వాటిలో కలపలేదు. మొత్తం రూ.2500 కోట్లకు టెండర్లు పిలిచారు. గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి బహిరంగ విచారణకు సిద్ధమా? టెండర్లలో దళిత, బీసీ కాంట్రాక్టర్లను పక్కన పెట్టారు. అవగాహన లేనిది మంత్రి అడ్లూరికే. చేనేత సొసైటీలకు, లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కారొరేషన్‌లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకునేలా నిబంధనలు మార్చారు. జీవో1, జీవో 110ను ఉల్లంఘించారు అని కొప్పుల ఆరోపించారు.

హైకోర్టుకు వెళ్లే దుస్థితి వ‌చ్చింది..

గురుకులాల టెండర్లు నిబంధనల మేరకు లేవు. టెండర్ల డాక్యుమెంట్లు బయటపెట్టాలి. టెస్కోను, లెదర్ కార్పొరేషన్లను కాదని గుజరాత్‌కు చెందిన మఫత్ లాల్ కంపెనీకి రూ.1800 కోట్లకు పైగా 5 టెండర్లు కట్టబెట్టారు. కమీషన్ల కోసమే టెండర్ల నిర్వహణ జరిగింది. చిన్న కాంట్రాక్టర్లు టెండర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. హైకోర్టు టెస్కో, లెదర్ కార్పొరేషన్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేసింది.
ఆ సంస్థలు నాన్ అవైల‌బిలిటీ సర్టిఫికెట్ ఇవ్వకున్నా గుజరాత్ కంపెనీకి టెండర్లు ఎలా కట్టబెట్టారు?

చిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. టెస్కోకు గురుకుల టెండర్లలో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసినా దాన్ని పక్కన బెట్టారు. ఇవన్నీ వాస్తవాలు అయితే అదే పనిగా మంత్రి అడ్లూరి అబద్దాలతో తప్పు దోవపట్టిస్తున్నారు. టెండర్ల అవినీతికి సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అడ్లూరి సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. గురుకుల టెండర్లపై హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధంగా ఉన్నాం. హరీశ్‌రావు అన్ని ఆధారాలు ఉంటేనే మాట్లాడతారని మంత్రి అడ్లూరి తెలుసుకోవాలి అని కొప్పుల ఈశ్వ‌ర్ హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement