త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ ‘ఈగో’ వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య జరిగిన 'కోల్డ్ వార్' 200 మంది విద్యార్థినులను రోడ్డుపైకి తెచ్చింది. అసలు ఈ గొడవకు కారణమేంటి?

J

Telangana | Published On Jul 13, 2026, 4.37 pm IST

KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ ‘ఈగో’ వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
Advertisement
  • సంగారెడ్డి జిల్లా ఆందోల్ KGBVలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య వివాదంతో రోడ్డెక్కిన 200 మంది విద్యార్థినులు
  • వట్‌పల్లి KGBV కి సొంత భవనం లేకపోవడంతో ఆందోల్ క్యాంపస్‌లోనే తరగతుల నిర్వహణ
  • తమను చిన్నచూపు చూస్తూ హాస్టల్ నుంచి గెంటేశారని తల్లిదండ్రుల ఎదుటే కన్నీరుమున్నీరైన బాలికలు
  • అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ నడిరోడ్డుపై బైఠాయించి న్యాయం కోసం విద్యార్థినుల ధర్నా

KGBV Sangareddy Protest | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ (Andole) లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యాబుద్ధులు నేర్పి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఇద్దరు అధికారుల 'ఈగో' (Ego) ఏకంగా 200 మంది పేద విద్యార్థినులను రోడ్డుపాలు చేసింది. క్యాంపస్ లో మొదలైన ఈ 'కోల్డ్ వార్' చిలికి చిలికి గాలివానగా మారి, చివరికి వందలాది మంది బాలికలు హాస్టల్ నుంచి బయటకు వచ్చి నడిరోడ్డుపై బైఠాయించేలా చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివాదానికి అసలు కారణం ఇదే..

వట్‌పల్లి కేజీబీవీకి సొంత భవనం లేకపోవడమే ఈ పూర్తి గొడవకు ప్రధాన కారణం. పర్మినెంట్ బిల్డింగ్ (Permanent Building) లేకపోవడంతో, ఆ స్కూల్ విద్యార్థినులకు కూడా ఆందోల్ కేజీబీవీ క్యాంపస్‌లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఒకే ప్రాంగణంలో రెండు వేర్వేరు స్కూళ్లు, ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఉండటంతో మొదటి నుంచి ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తోంది. ఫెసిలిటీస్ (Facilities) విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం ఈగో క్లాషెస్‌కు దారితీసింది.

అవమానాలు భరించలేక కన్నీళ్లు

గత కొద్దిరోజులుగా ఈ అధికారుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. ఆందోల్ ప్రిన్సిపాల్, స్టాఫ్ తమను చిన్నచూపు చూస్తున్నారని వట్‌పల్లి విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దల మధ్య జరుగుతున్న ఈగో పోరాటంలో తాము నలిగిపోతున్నామని, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా మానసికంగా వేధిస్తూ, తీవ్రంగా అవమానిస్తున్నారని వారు వాపోయారు.

నడిరోడ్డుపై విద్యార్థినుల ఆందోళన

తాజా పరిణామాలతో వట్‌పల్లి విద్యార్థినులను ఆందోల్ హాస్టల్ భవనం నుంచి బయటకు పంపించేశారు. ఈ చర్యతో ఆందోళనకు గురైన బాలికలు వెంటనే తమ పేరెంట్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు అక్కడికి చేరుకునే సరికి తల్లిదండ్రుల ముందే బాలికలు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు జరిగిన అన్యాయంపై మండిపడుతూ దాదాపు 200 మంది విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. తమకు రక్షణ, న్యాయం కావాలంటూ నినాదాలు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

మౌనంగా అధికారులు.. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?

పేద బాలికలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ (Quality Education) అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేస్తే, ఇక్కడి అధికారుల తీరు ఆ ఆశయాన్ని నీరుగారుస్తోంది. వందలాది మంది రోడ్డుపై ఆందోళన చేస్తున్నా పై అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వట్‌పల్లి విద్యార్థులకు పర్మినెంట్ సొల్యూషన్ చూపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement