త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్స‌రీ సేవ‌లు మ‌రింత బలోపేతం చేస్తున్నాం

Damodara nd Vivek | సంగారెడ్డి జిల్లాలో ఇప్ప‌టికే ఏడు ఈఎస్ఐ డిస్పెన్స‌రీలు ఉన్నాయ‌ని.. ఇప్పుడు ఎనిమిదో డిస్పెన్స‌రీని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On Jul 9, 2026, 6.54 pm IST

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్స‌రీ సేవ‌లు మ‌రింత బలోపేతం చేస్తున్నాం
Advertisement
  • సంగారెడ్డిలో ఎనిమిదో డిస్పెన్స‌రీ ప్రారంభించడం సంతోషంగా ఉంది
  • రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి
  • శంషాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్‌లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులు ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం
  • ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అన్ని సౌకర్యాలు క‌ల్పిస్తాం
  • రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి

Damodara nd Vivek | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లాలో ఇప్ప‌టికే ఏడు ఈఎస్ఐ డిస్పెన్స‌రీలు ఉన్నాయ‌ని.. ఇప్పుడు ఎనిమిదో డిస్పెన్స‌రీని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు చెప్పారు. రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్‌, జగ్గారెడ్డిలతో కలిసి మంత్రులు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి రాజ‌న‌ర్సింహ మాట్లాడారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్‌టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, నేత్ర వైద్య సేవలు వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించాం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 104 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతూ వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నాం. ప్రజలకు అన్ని రకాల ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కార్మికుల వైద్య సేవల విస్తరణకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.

రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేద‌న్నారు. స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శంషాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలు ఈఎస్ఐ వైద్య సేవలపై ఆధారపడుతున్నాయని, ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

ఇటీవల ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కొన్ని ప్రత్యేక వైద్య సేవలు లేకపోవడంతో రోగులు సనత్‌నగర్‌కు వెళ్తున్న విషయం తన దృష్టికి వచ్చింద‌ని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ఆర్‌సీ పురంలో ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. కార్మికులు స్థానికంగానే పూర్తి స్థాయి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వివ‌రించారు. వ‌చ్చే ఏడాదిలో కార్డియాలజి సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు ప‌డొద్ద‌ని సూచించారు.

అనంత‌రం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మాట్లాడారు. రాష్ట్రంలో సంగారెడ్డి ప్రధాన పారిశ్రామిక జిల్లాగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. వేలాది మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వసతులను కల్పించాలన్నారు. ఈఎస్ఐ వైద్య సేవల విస్తరణ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

మంత్రులు వివేక్, దామోదరకు కృతజ్ఞతలు తెలిపిన జ‌గ్గారెడ్డి..

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్మలా జగ్గారెడ్డి అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకట స్వామికి, సహకరించిన మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ డిస్పెన్సరి అందుబాటులోకి రావడంతో సంగారెడ్డి ప్రాంత కార్మికులకు లాభం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌లు వనిత సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement