త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kakatiya Express | ఎగిసిప‌డ్డ మంట‌లు.. కాక‌తీయ ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం..

Kakatiya Express | వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో కాక‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. రైల్వే ట్రాక్ ప‌క్క‌నే మంట‌లు అంటుకోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ రైలును అక‌స్మాత్తుగా నిలిపివేశాడు.

S

Telangana | Published On May 11, 2026, 10.12 am IST

Kakatiya Express | ఎగిసిప‌డ్డ మంట‌లు.. కాక‌తీయ ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం..
Advertisement

Kakatiya Express | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో కాక‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. రైల్వే ట్రాక్ ప‌క్క‌నే మంట‌లు అంటుకోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ రైలును అక‌స్మాత్తుగా నిలిపివేశాడు. దీంతో ప్ర‌యాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

సికింద్రాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వెళ్లేందుకు కాక‌తీయ ఎక్స్‌ప్రెస్ బ‌య‌ల్దేరింది. వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోకి రాగానే.. ఎగిసిప‌డుతున్న మంట‌లు, ద‌ట్ట‌మైన పొగ‌ను పైల‌ట్ గ‌మ‌నించాడు. రైల్వే ట్రాక్ ప‌క్క‌నే అగ్నికీల‌లు ఎగిసిప‌డుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పైలట్ రైలును నిలిపివేశాడు. ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ మంట‌ల కార‌ణంగా.. రైలు 30 నిమిషాల పాటు ఆగింది. అనంత‌రం రైలు భ‌ద్రాచ‌లం బ‌య‌ల్దేరింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ప్ర‌మాదం వాటిల్ల‌క‌పోవ‌డంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మంట‌ల‌కు కార‌ణం రైతులేనా..?

మంట‌ల‌కు కార‌ణం రైతులేనా..? అని అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. త‌మ పంట పొలాల్లోని వ్య‌ర్థాల‌కు నిన్న రాత్రి రైతులు నిప్పు పెట్టారు. ఎండాకాలం కావ‌డంతో.. ఆ మంట‌లు స‌మీప పొలాల‌కు వ్యాపించి.. రైల్వే ట్రాక్ వ‌ర‌కు చేరుకున్నాయి. ఏ మాత్రం ఆల‌స్యం జ‌రిగినా.. మంట‌లు రైల్వే లైన్ విద్యుత్ తీగ‌ల‌కు, కేబుళ్ల‌కు మంట‌లు అంటుకునేవి. పెనుప్ర‌మాదం సంభ‌వించేది. స‌మయానికి లోకోపైల‌ట్ అప్ర‌మ‌త్త‌తో పెనుప్ర‌మాదం త‌ప్పింది.

రైతుల‌కు హెచ్చరిక..

వేసవి కాలం కావడంతో ఎండుగడ్డి, పొలం వ్యర్థాలను తగులబెట్టే సమయంలో రైల్వే ట్రాక్‌ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని రైతులకు రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisement
Advertisement