త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandralok Complex | చంద్రలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక భద్రతా లోపాలు.. నోటీసులు జారీ చేసిన ఫైర్ శాఖ

Chandralok Complex | సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలులో తీవ్ర లోపాలు బయటపడాయి. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ చేపట్టిన సమగ్ర తనిఖీల్లో భవనం భద్రతా ప్రమాణాలు కనీస స్థాయిలో కూడా పాటించలేదని అధికారులు స్పష్టం చేశారు.

P

Hyderabad | Published On Jul 3, 2026, 9.30 pm IST

Chandralok Complex | చంద్రలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక భద్రతా లోపాలు.. నోటీసులు జారీ చేసిన ఫైర్ శాఖ
Advertisement

Chandralok Complex | సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలులో తీవ్ర లోపాలు బయటపడాయి. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ చేపట్టిన సమగ్ర తనిఖీల్లో భవనం భద్రతా ప్రమాణాలు కనీస స్థాయిలో కూడా పాటించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో భవన నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఫైర్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వ‌హించారు. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ నేతృత్వంలో అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ కలిసి చంద్రలోక్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా భవనం దశాబ్దాల నాటి నిర్మాణమై ఉండడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల కింద‌ట నిర్మించిన ఈ భవనంలో గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి కనిపించిందని తెలిపారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకునేలా సూచనలు పంపనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా భవనంలోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా పాతబడిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ఈ అంశంపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఫైర్ శాఖ అధికారులు పేర్కొన్నారు. భవనంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా బయటకు రావడానికి తగిన స‌రైన మెట్లు లేకపోవడం కూడా పెద్ద లోపంగా అధికారులు గుర్తించారు. అంతేకాక భవనం చుట్టూ అవసరమైన సెట్‌బ్యాక్ స్థలం లేకపోవడంతో అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజిన్లు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలను ప్ర‌స్తావించారు. ఇలాంటి నిర్లక్ష్యం భవిష్యత్తులో మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా భవన నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిర్దేశిత గడువులోగా లోపాలను సరిచేయకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement