Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసానికి రూ.5 వేల కోట్లకు లైన్ క్లియరైంది.. ఏ ప్రాజెక్టు కూడా ఆగొద్దు
Uttam Kumar Reddy | రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే మిగిలిన రూ.3 వేల కోట్లు విడుదలవుతాయన్నారు. నిధుల కొరత కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడానికి వీల్లేదన్నారు.
- త్వరలోనే మిగిలిన 3 వేల కోట్లు విడుదలవుతాయి.. అనుమతుల పేరుతో పనులు ఆపొద్దు
- మిడ్మానేరు ఎడమ కాలువ పనులు వెంటనే పునఃప్రారంభించాలి
- పత్తిపాక డీపీఆర్ ఆగస్టు నెలాఖరులోగా సిద్ధం చేయాలి
- 96 శాతం పూర్తయిన రోళ్లవాగుకు అటవీ అనుమతులు వేగవంతం చేయాలి
- మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే మిగిలిన రూ.3 వేల కోట్లు విడుదలవుతాయన్నారు. నిధుల కొరత కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడానికి వీల్లేదన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై శనివారం అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉత్తమ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిధులు అడగండి..
ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను సాధారణ పరిపాలనా అంశాలుగా చూడకుండా అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. అవసరమైన ఆర్థిక అనుమతులు, టోకెన్లు పొందడంలో జాప్యం చేయొద్దని సూచించారు.

ఇంజినీరింగ్ పనులు కొనసాగుతుండగానే సాధ్యమైన ప్రాంతాల్లో భూసేకరణ, భూ యజమానులకు పరిహారం చెల్లింపు, నిర్వాసిత కుటుంబాల పునరావాస ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని సూచించారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వాటి ఫలాలను రైతులకు అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు.
మిడ్మానేరు ఎడమ కాలువ పనులు వెంటనే ప్రారంభించండి..
సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్మానేరు ఎడమ కాలువ మిగులు పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పనులకు అడ్డంకిగా మారిన భూసంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. సవరించిన అంచనాలు సిద్ధం చేయడం, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, చట్టబద్ధ అనుమతుల సాధన.. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి కాకుండా సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రక్రియల పేరుతో మరోసారి పనులు నిలిచిపోకుండా నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
పత్తిపాకతో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు కాకతీయ ప్రధాన కాలువలో డి-83 నుంచి డి-94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్లు వివరించారు.

పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించే రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, లైడార్ సర్వే, డేటా ప్రాసెసింగ్ ఇప్పటికే పూర్తయ్యాయని, బోర్హోల్ డ్రిల్లింగ్, ట్రయల్ పిట్స్, జియోటెక్నికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి ఉత్తమ్కు వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా డీపీఆర్ సమర్పిస్తామని తెలిపారు.
రోళ్లవాగును మొత్తం పూర్తి చేయాలి..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుపైనా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచి, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం ప్రాజెక్టు లక్ష్యం. మూడు బండ్లు, సర్ప్లస్ వీర్, హెడ్ స్లూయిస్లతో సహా ప్రధాన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే బండ్-2లో కొంత భాగం అటవీ భూమిలో ఉండటంతో మిగిలిన పనులు అటవీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి.
ప్రత్యామ్నాయ అటవీకరణకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన మిటిగేషన్ ప్లాన్కు ఆమోదం లభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రతి సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చండి..
ప్రాజెక్టుల వారీగా పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక జాబితా సిద్ధం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. ఏ ప్రాజెక్టులో ఏ సమస్య ఉంది? దాని పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరం? ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? అనే అంశాలన్నింటినీ స్పష్టంగా నమోదు చేయాలని చెప్పారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన ప్రతి సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చాలని, వచ్చే సమావేశం నాటికి వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అధికారులకు సూచించారు.
భూసేకరణ, ఆర్అండ్ఆర్ లేదా అటవీ అనుమతుల కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోయినా వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. నిధులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు మరింత ఆలస్యం లేకుండా నీరు అందించడమే లక్ష్యమని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రజాప్రతినిధులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్బాబు, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు
- ●Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్
- ●Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి 'జాతకం' చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ
- ●Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
- ●IND Vs SL Test | శ్రీలంక టెస్టు సిరీస్కు సాయి సుదర్శన్ దూరం..
- ●Honey Trap | మహిళ వలపు వల.. పాక్ హ్యాండ్లర్ల చేతికి దేశ రక్షణ రహస్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్

Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు

Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్

Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి 'జాతకం' చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..






