త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suryapet Mining | సూర్యాపేట మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు.. టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్‌ డిమాండ్

Suryapet Mining | సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ (Suryapet Mining) బ్లాక్‌ల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Mar 2, 2026, 2.28 pm IST

Suryapet Mining | సూర్యాపేట మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు.. టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్‌ డిమాండ్
Advertisement

Suryapet Mining | త్రినేత్ర‌.న్యూస్‌: సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ (Suryapet Mining) బ్లాక్‌ల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గనుల శాఖ చేపట్టిన ఈ వేలం ప్రక్రియ పారదర్శకతకు విరుద్ధంగా సాగిందని ఆయన విమర్శించారు.

`గనుల శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు, పారదర్శకత లోపాలు ఉన్నాయి. ప‌సుపులబోడు, సైదుల్‌నామా, సుల్తాన్‌పూర్ మైనింగ్ బ్లాక్‌లలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ, టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదు. ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల క‌చ్చితమైన అక్షాంశ-రేఖాంశ కోఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డీజీపీఎస్‌ సర్వే (DGPS Survey) ధృవీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు, యూటీఎం (UTM) జియో కోఆర్డినేట్లు, అలాగే మినరల్ ఆక్షన్ రూల్స్, 2015 మరియు మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదు` అని లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి లోపాలు వేలం ప్రక్రియ చట్టబద్ధతను, పారదర్శకతను తీవ్రంగా దెబ్బతీస్తాయని కేటీఆర్ అన్నారు. టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్‌లను క‌చ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధనలు పాటించలేదని విమర్శించారు.

న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు WP(PIL) No.21 of 2024లో ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. సైదుల్‌నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ (Deccan Cements), సుల్తాన్‌పూర్ బ్లాక్‌కు NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని, ఈ సంస్థలు రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయన్నారు. అలాగే, మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్‌ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతున్న‌దని వెల్ల‌డించారు.

అటవీ శాఖ నుంచి తప్పనిసరిగా పొందవలసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ర‌క్షిత అట‌వీ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ జరగడం పర్యావరణానికి ముప్పు కలిగించడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రస్తుత వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నోటిఫికేషన్ నంబ‌ర్‌ 2263906/DM&G MI/Lst/2023 కింద చేపట్టిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని, స్వతంత్ర, పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ విష‌యంలో ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement