త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Damodara Rajanarsimha | హెచ్‌ఐవీ ఒక‌ప్పుడు ప్రాణాంతక‌మే.. కానీ ఇప్పుడు కాదు: కేబుల్ బ్రిడ్జ్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి దామోద‌ర‌

Aids awareness rally at Cable Bridge | ఎయిడ్స్ (Aids) ఒక‌ప్పుడు ప్రాణాంతక వ్యాధేన‌ని.. కానీ ఇప్పుడు సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాంత‌కం కాద‌ని ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ(Damodara Rajanarsimha) అన్నారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (Telangana Aids Control Society) ఆధ్వర్యంలో మాదాపూర్‌ కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన‌ మానవహారం కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

S

Telangana | Published On Apr 9, 2026, 11.57 am IST

Minister Damodara Rajanarsimha | హెచ్‌ఐవీ ఒక‌ప్పుడు ప్రాణాంతక‌మే.. కానీ ఇప్పుడు కాదు: కేబుల్ బ్రిడ్జ్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి దామోద‌ర‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఎయిడ్స్ (Aids) ఒక‌ప్పుడు ప్రాణాంతక వ్యాధేన‌ని.. కానీ ఇప్పుడు సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాంత‌కం కాద‌ని ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ(Damodara Rajanarsimha) అన్నారు. చికిత్సతో నాలుగైదు దశాబ్దాలు సాధారణ జీవితాన్ని గడపొచ్చ‌ని చెప్పారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (Telangana Aids Control Society) ఆధ్వర్యంలో మాదాపూర్‌ కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన‌ మానవహారం కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. అధికారుల‌తో క‌లిసి హెచ్ఐవీపై అవ‌గాహ‌న (Awareness) క‌ల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు గురువారం ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. హెచ్‌ఐవీ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని.. చికిత్స తీసుకోకుంటే అది ఎయిడ్స్‌గా మారుతుందన్నారు. లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి‌ తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని తెలిపారు. షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా వ్యాపించద‌ని వివ‌రించారు.

అవ‌గాహ‌నే అస‌లైన స‌మాధానం..

అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అవగాహనే దీనికి స‌రైన‌ సమాధానమ‌న్నారు. హెచ్‌ఐవీ బాధితులను ఇబ్బంది పెట్టొద్ద‌ని.. వారికి గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మెడిసిన్‌ అందిస్తోందన్నారు. హెచ్‌ఐవీ & ఎయిడ్స్ చట్టం 2017 ప్రకారం వివక్ష చూపడం నేరమ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది రోగుల‌కు వైద్య సేవలు అందిస్తున్నామ‌ని వివ‌రించారు. నిశ్చ‌ల జీవ‌న‌శైలి, అనారోగ్యకర అలవాట్లతో యువత జీవితాన్ని పాడు చేసుకోవ‌ద్ద‌ని కోరారు. ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే అని స్ఫ‌ష్టం చేశారు.

డ్ర‌గ్స్ వ‌ద్దు..

డ్రగ్స్‌కు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని దానికి చాలా దూరంగా ఉండాల‌ని సూచించారు. ముఖ్యంగా ఇంజిక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంద‌ని వెల్ల‌డించారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యవంతమైన కుటుంబాలతో ఆరోగ్యవంతమైన సమాజం, బలమైన రాష్ట్ర నిర్మానం సాకార‌మ‌వుతుంద‌న్నారు. కలిసిక‌ట్టుగా శ‌క్తివంత‌మైన‌ తెలంగాణను తయారు చేసుకోవాల‌ని మంత్రి దామోద‌ర‌ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement