త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bageshwar Dham | 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్.. హైదరాబాద్‌లో తొలిసారి నిర్వ‌హ‌ణ‌

Bageshwar Dham | హైద‌రాబాద్‌లో తొలిసారి జూలై 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమం నిర్వ‌హిస్తున్నామ‌ని కన్వీనర్ అంజనీ కుమార్ అగర్వాల్ తెలిపారు. సమష్టి కృషితో విజయవంతంగా చేయాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Jul 6, 2026, 2.17 pm IST

Bageshwar Dham | 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్.. హైదరాబాద్‌లో తొలిసారి నిర్వ‌హ‌ణ‌
Advertisement
  • 17న న‌గ‌రానికి పూజ్య బాబా రాక‌
  • హైదరాబాద్ బాగేశ్వర్ ధామ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • భక్తుల కోసం మూడు రోజుల పాటు హనుమాన్ కథ
  • ల‌క్ష మంది భ‌క్తులు వీక్షించేలా సౌక‌ర్యాలు
  • బ్రోచర్ ఆవిష్కరించిన సమితి సభ్యులు

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో తొలిసారి జూలై 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమం నిర్వ‌హిస్తున్నామ‌ని కన్వీనర్ అంజనీ కుమార్ అగర్వాల్ తెలిపారు. సోమ‌వారం జరిగిన స్వచ్ఛంద సేవకుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఇంతటి భారీ స్థాయిలో ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించ‌బోతున్నామ‌న్నారు. సమష్టి కృషితో విజయవంతంగా చేయాల‌ని ఆయన పిలుపునిచ్చారు. బాగేశ్వర్ ధామ్ నుంచి 60 మంది సభ్యుల బృందం, ఇతర ప్రాంతాల నుంచి 500 మంది రానున్నారని తెలిపారు. వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

పండిత్ సంజ‌య్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో భూమి పూజ‌..

భక్తుల కోసం మూడు రోజుల పాటు హనుమాన్ కథ ఉంటుంది. ఈ కార్యక్రమాలు గగన్ పహాడ్‌లోని పురాన్ సన్స్ ఫార్మ్స్ (ప్రెస్టీజ్ సిటీ గేట్ ఎదురుగా) జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగేశ్వర్ ధామ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వ‌చ్ఛంద సేవ‌కుల‌కు పాటించాల్సిన నియమాలు, సేవా విధానాలు, బాధ్యతల గురించి వివరించారు. పురాన్ సన్స్ ఫార్మ్స్‌లో పండిత్ సంజయ్ శర్మ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంత‌రం ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశాం. జూలై 16 నుంచి 19 వరకు స్వచ్ఛంద సేవకులు విధుల్లో ఉండాలి. ప్రతి స్వచ్ఛంద సేవకునికి 'బాబాస‌ తరఫున ప్రత్యేక ప్రశంసాపత్రం అందిస్తాం అని ఆయ‌న తెలిపారు.

ఈనెల‌ 17న పూజ్య బాబా హైదరాబాద్‌కు చేరుకుంటారు. రోజూ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంట‌ల‌ వరకు హనుమాన్ కథ ఉంటుంది. రెండో రోజు కథతో పాటు దివ్య దర్బార్ కూడా నిర్వహిస్తాం. ఇందులో బాబా భక్తుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు అందిస్తారు. ప్రతి స్వచ్ఛంద సేవకునికి మూడు రోజుల కోసం మూడు వేర్వేరు రంగుల స్కార్ఫ్‌లు, ఒక ఐడీ కార్డు అందిస్తారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో క్రమశిక్షణతో సేవలందించాలి. సేవ చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక సేవా నమోదు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. అపోలో, ఏఐజీ ఆసుపత్రులు ఆరోగ్య సేవలను అందిస్తాయి. రక్తపోటు, మధుమేహ పరీక్షలు, కంటి పరీక్షలతో కూడిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తాం. ఉచితంగా కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం అని అంజనీ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఏర్పాట్లు ఇలా..

2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ పందిరి నిర్మిస్తున్నారు. ఇందులో ఒకేసారి 50 వేల మంది కూర్చునే వీలుండగా మొత్తం లక్ష మందికి పైగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. 25 మంది కోర్ కమిటీ సభ్యులతో పాటు సుమారు 500 మంది భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు సేవలందిస్తారు. రెండు అంబులెన్సులు, ఒక అగ్నిమాపక వాహనం సిద్ధంగా ఉంటాయి. పోలీసు శాఖ, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకుల సహకారంతో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశాం అని అంజనీ తెలిపారు.

ప్ర‌త్యేక బ‌స్సులు..

అదనంగా టీజీఆర్టీసీతో చర్చలు జరుపుతూ 110 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తం. వీటితో పాటు విశ్రాంతి కేంద్రాల నుండి కార్యక్రమ ప్రాంగణానికి భక్తులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆహారం, ఆహ్వానాలు, పూజా విభాగం, ఆరోగ్యం, అత్యవసర వైద్య సేవలు, సోషల్ మీడియా, ముద్రణ, అలంకరణ, క్యాటరింగ్, పార్కింగ్, గ్రౌండ్ మేనేజ్‌మెంట్, ప్రెస్, మీడియా, వేదిక భద్రత, ప్రకటనలు, ప్రచారం, ప్రయాణం/టాక్సీలు, బస్సు సేవలు, ఫోటోగ్రఫీ తదితర విభాగాలకు ప్రత్యేక ఉపకమిటీలను ఏర్పాటు చేశాం అని ఆయ‌న చెప్పారు.

ఈ సందర్భంగా మనీష్ అగర్వాల్ ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధ‌న‌లు పాటించాలని స్వచ్ఛంద సేవకులకు సూచించారు. అదనంగా ధీరేంద్ర శాస్త్రి పాల్గొనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు అంజనీ కుమార్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సంజయ్ అగర్వాల్, రాకేష్ జలాన్, రాకేష్ నర్సింగ్‌పురియా, సందీప్ మిత్తల్, ఘనశ్యామ్ అగర్వాల్, నవీన్ అగర్వాల్, పవన్ తిబ్రేవాల్, అంకిత్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్, రూపేష్ అగర్వాల్, శుభమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement