త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Treatment | రాయితీపై ప్ర‌భుత్వ భూమి.. ప్రైవేటు హాస్పిట‌ళ్లు పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించాల్సిందే..!

Free Treatment | ప్ర‌భుత్వ భూమిని రాయితీ ధ‌ర‌కు పొందిన ప్రైవేటు ద‌వాఖాన‌ల‌కు (Private Hospitals) పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్య‌త ఉంద‌ని హైకోర్టు (High Court) స్ప‌ష్టం చేసింది. రొమ్ము క్యాన్స‌ర్‌తో (Breast Cancer) బాధప‌డుతున్న ఓ పేద మ‌హిళ‌ల‌కు ఉచిత చికిత్స (Free Treatment) అందించాల‌ని బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్సిట‌ల్‌కు (Basavatarakam Cancer Hospital) ఆదేశాలు జారీ చేసింది.

G

Telangana | Published On Jul 22, 2026, 9.33 am IST

Free Treatment | రాయితీపై ప్ర‌భుత్వ భూమి.. ప్రైవేటు హాస్పిట‌ళ్లు పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించాల్సిందే..!
Advertisement

Free Treatment | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ భూమిని రాయితీ ధ‌ర‌కు పొందిన ప్రైవేటు ద‌వాఖాన‌ల‌కు (Private Hospitals) పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్య‌త ఉంద‌ని హైకోర్టు (High Court) స్ప‌ష్టం చేసింది. రొమ్ము క్యాన్స‌ర్‌తో (Breast Cancer) బాధప‌డుతున్న ఓ పేద మ‌హిళ‌ల‌కు ఉచిత చికిత్స (Free Treatment) అందించాల‌ని బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్సిట‌ల్‌కు (Basavatarakam Cancer Hospital) ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌భుత్వ జీవోల ప్ర‌కారం 25 శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటాలో బాధితురాలిని చేర్చుకుని చికిత్స ప్రారంభించాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మ అనే వితంతువు రొమ్ము క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌లో బ‌స‌వ‌తార‌కం ద‌వాఖాన‌కు వెళ్లాల‌ని సూచించారు. దీంతో హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌ర్వాత త‌న వ్యాధి ఆరోగ్యశ్రీ (Aarogyasri) ప‌థ‌కం ప‌రిధిలో లేద‌ని, చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మొత్తం ఖ‌ర్చును భ‌రించాల్సి ఉంటుంద‌ని హాస్పిట‌ల్ యాజ‌మాన్యం ఆమెకు తెలిపింది. ఈ నేప‌థ్యంలో 25 శాతం ఉచిత కోటా కింద చికిత్స అందించాల‌ని కోరిన‌ప్ప‌టికీ.. తిర‌స్క‌రించ‌డంతో ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు.

ఉచితంగా చికిత్స..

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 25 శాతం ఇన్‌పేషెంట్, 40 శాతం ఔట్‌పేషెంట్‌ కోటాలో పేదలకు ఉచితంగా చికిత్స అందించాలనే షరతుతో బంజారాహిల్స్‌లోని 7.5 ఎక‌రాల భూమిని లీజుకు ఇస్తూ 1989లో ప్రభుత్వం జీవో 434 జారీ చేసింద‌ని తెలిపారు. ఈ ష‌ర‌తుల అమలు పర్యవేక్షించేందుకు వైద్యఆరోగ్యశాఖ 2022లో జీవో 80 జారీ చేసిందన్నారు. ఈ జీవోల ప్రకారం ఉచిత వైద్యం అందించాలన్న‌ పిటిషనర్‌ అభ్యర్థనను ద‌వాఖాన‌ నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు..

తాము ఆరోగ్యశ్రీ ప‌థ‌కం కింది చికిత్స కోర‌డం లేద‌ని, ప్ర‌భుత్వ భూమిని రాయితీపై పొందినందుకు ప్ర‌తిఫ‌లంగా హాస్పిట‌ల్‌పై ఉన్న 25 శాతం ఉచిత చికిత్స బాధ్య‌త‌ను అమ‌లు చేయాల‌ని మాత్ర‌మే కోరుతున్నామ‌ని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌కు తక్షణమే 25 శాతం ఉచిత కోటాలో ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. ఆమెకు అందుతున్న చికిత్సను పర్యవేక్షించడంతోపాటు 25 శాతం ఉచిత చికిత్సకు సంబంధించిన నివేదికనూ సమర్పించాలంటూ డీఎంహెచ్‌ఓను ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేశారు. త‌దుప‌రి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. కాగా, ఈ తీర్పు కేవ‌లం ఒక్క బాధితురాలికే ప‌రిమితం కాకుండా.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ రాయితీ పొందిన అన్ని ద‌వాఖాన‌కు వ‌ర్తిస్తాయా?.. కోర్టు ఆదేశాల‌ మేర‌కు ఎన్ని హాస్పిట‌ల్లు ఉచిత వైద్యం అందిస్తాయో చూడాల్సిందే..!

Advertisement
Advertisement