త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errolla Srinivas | అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కాదు.. అబ‌ద్దాల ల‌క్ష్మ‌ణ్‌గా మారిపోయిండు

Errolla Srinivas | మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కాస్త అబ‌ద్దాల ల‌క్ష్మ‌ణ్‌గా మారిపోయార‌ని బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కులు ఎర్రోళ్ల శ్రీనివాస్ విమ‌ర్శించారు. పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌త‌డేమో అనుకుంటే వాళ్ల గొంతే కోస్తున్నాడ‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Aug 31, 2026, 1.04 pm IST

Errolla Srinivas | అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కాదు.. అబ‌ద్దాల ల‌క్ష్మ‌ణ్‌గా మారిపోయిండు
Advertisement
  • పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌త‌డు అనుకుంటే వాళ్ల గొంతే కోస్తుండు
  • హ‌రీశ్ రావు గురించి మాట్లాడే నైతిక అర్హ‌త ఉందా మీకు?
  • ముఖ్యమంత్రిని ఏక‌వ‌చ‌నంతో మాట్లాడితేనే ఫీల్ అయితున్న‌వ్‌
  • మ‌రి గురుకులంలో 2000 కోట్ల స్కామ్ జ‌రిగితే నోరు ఇప్ప‌క‌పోతివి
  • మ‌మ్మ‌ల్ని నిందించ‌డం ఆపి ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పండి
  • బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్‌

Errolla Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కాస్త అబ‌ద్దాల ల‌క్ష్మ‌ణ్‌గా మారిపోయార‌ని బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కులు ఎర్రోళ్ల శ్రీనివాస్ విమ‌ర్శించారు. పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌త‌డేమో అనుకుంటే వాళ్ల గొంతే కోస్తున్నాడ‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రిని ఏక‌వ‌చ‌నంతో మాట్లాడితే ఫీలయ్యే ఆయ‌న గురుకులంలో 2000 కోట్ల స్కామ్ జ‌రిగితే ఎందుకు నోరు విప్ప‌లేద‌ని నిల‌దీశారు. హ‌రీశ్ రావు గురించి మాట్లాడే నైతిక అర్హ‌త అడ్లూరికి లేద‌న్నారు. దళితులకు భూమి ఉపాధి, విద్యా, సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఎర్రోళ్ల మాట్లాడుతూ మంత్రి అడ్లూరిపై నిప్పులు చెరిగారు.

అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రెస్‌మీట్‌లో చాలా మాట్లాడారు. గత పాలనలో అమలైన పేద ప్రజల సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు.. ఇంకా దళితుల సంక్షేమం, మూడెకరాల భూ పంపిణీ పథకం, కేజీ టు పీజీ ఉచిత విద్య మాట్లాడారు. మా నాయకుడు హరీష్ రావును నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ కూడా ఇచ్చారు. దివ్యాంగుల పెన్షన్ గురించి.. ఇలా ఇంకా చాలా మాట్లాడారు మంత్రిగారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా.. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారా? లేదా ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కావడం లేదు. పొద్దున లేస్తే గత ప్రభుత్వం ఏం చేసింద‌ని మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అవుతుంద‌నే విషయం మర్చిపోతున్నారు.

హామీల అమ‌లు తేదీ చెప్పండి..

గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం అని ఇంకెన్ని రోజులు ఊదరగొడతారు గతం గతః. ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు గురించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అని.. ఆ తేదీ చెప్పండి. అమలు చేసి చూపించండి. అంతే తప్ప ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేతగాక మాపై ఎదురుదాడి చేస్తున్నారు, మేనిఫెస్టో పుస్తకంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయమంటే దమ్కీలు ఇస్తున్నారు. మీ దమ్కీలకు ఎవరు భయపడరు. హామీలు అమలు అయ్యేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటా మీ వెంట పడుతూనే ఉంటాం.

ఆడ‌బిడ్డ‌లు ప‌డుకునే బెడ్ల‌ను కూడా అమ్ముకుంటున్న‌వ్‌..

అడ్లూరి లక్ష్మణ్ గారు అంటే చాలా గౌరవం ఉండేది. చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంత్రి అయ్యాడని. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కాదు అబద్దాల లక్ష్మణ్ అని నిరూపితమైంది. అన్ని అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. బడుగుల పక్షాన నిలబడి మా బ‌తుకులు మారుస్తావ్ అనుకుంటే మా బడి పిల్లల జీవితాలను బుగ్గిపాలు చేస్తావని అనుకోలేదు. గురుకులాల్లో చదివే వివిధ విద్యార్థులకు పెద్దన్న అయితావ్ అనుకుంటే పేద విద్యార్థుల తినే పురుగన్నంలో విషం నింపుతావ్ అనుకోలేదు. ఆడబిడ్డలు పడుకునే బంగారు బెడ్లను కూడా అమ్ముకుంటున్నావు అనుకోలేదు. మీరు మా గురించి మా నాయకుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.

మీ అబద్ధాల చిట్టా విప్పితే మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరు కాబట్టి మీ అవినీతి బాగోతం విప్పుదం. హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక ఉందా? మీకు భాష గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు, మీ ముఖ్యమంత్రికి? ఏకవచనంలో మాట్లాడితేనే అంత ఫీల్ అవుతున్నారు కదా లక్ష్మణ్ గారు! 120 మంది మా పేద బిడ్డల కనీస సౌకర్యాలు అందక చనిపోతే ఒక్క రోజు కూడా మాట్లాడ‌క‌పోతివి కదా. గురుకులలో 2000 కోట్లు స్కామ్ అయితే ఎంక్వైరీ ఏపించమని అడిగితే నోరు విప్పకపోతివి కదా మంత్రిగారు.

కేజీ టు పీజీ విద్య ఎక్కడ?

కేజీ టు పీజీ ఉచిత విద్య కాంగ్రెస్ ప్రభుత్వం కేజీల చొప్పున అమ్ముకున్నారా మంత్రి గారు. మూడు ఎకరాల భూమి 695 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ పథకం ద్వారా మొత్తం 170963.31 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశాం. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. దళితులకు న్యాయం గురించి మాట్లాడే మీరు ముందు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. దళితులకు అభ్యున్నత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీరు దళితులకు భూమి ఉపాధి విద్యా సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా?

మమ్మల్ని నిందించడం కాదు మూడేళ్లలో మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పండి. పేదలకు సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు మీ పార్టీ యువతకు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో చెప్పండి. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్లు ఎన్ని, భర్తీ అయిన పోస్టులు ఎన్నో సమాధానం చెప్పండి మంత్రి గారు. ​అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎంత మందిని విదేశాలకు పంపించారు?

​ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. 200 గురుకులాల నుంచి 1200 పైగా గురుకులాల సంఖ్య పెంచాం. ​కానీ ఇప్పటివరకు విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా అందలేదు. అందించిన పాఠశాల దుస్తులలో (యూనిఫామ్స్) కొలతలు సరిగ్గా లేవు, అసలు నాణ్యతే లేదు. విద్యా వ్యవస్థ పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ​రూ. 2,000 కోట్ల కుంభకోణం జరిగింది. బంకర్ బెడ్స్ కొనుగోళ్లలో కుంభకోణం, ​ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపే పరిస్థితి వచ్చింది. విద్యార్థుల ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగాయి. గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక, ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహానికి తాళం వేసి దాచిపెట్టిన ఘన చరిత్ర మీది అని ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement