త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moosarambagh Bridge | ఎట్ట‌కేల‌కు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

Moosarambagh Bridge | మూడేండ్ల నిరీక్ష‌ణ‌కు మ‌రికొన్ని గంట‌ల్లో ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంది. ముసారాంబాగ్-అంబ‌ర్‌పేట మ‌ధ్య ప్ర‌యాణించే వాహ‌న‌దారుల క‌ష్టాలు ఇక తీరిపోనున్నాయి. మూసీ న‌ది ఉప్పొంగిన ప్ర‌తిసారీ అంబ‌ర్‌పేట వైపు వెళ్లాల‌న్నా, అటునుంచి రావాల‌న్నా గోల్నాక బ్రిడ్జిపై నుంచి చుట్టూ తిరుగుతూ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చేది.

G

Hyderabad | Published On Aug 31, 2026, 7.27 am IST

Moosarambagh Bridge | ఎట్ట‌కేల‌కు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌
Advertisement

Moosarambagh Bridge | త్రినేత్ర‌.న్యూస్‌: మూడేండ్ల నిరీక్ష‌ణ‌కు మ‌రికొన్ని గంట‌ల్లో ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంది. ముసారాంబాగ్-అంబ‌ర్‌పేట మ‌ధ్య ప్ర‌యాణించే వాహ‌న‌దారుల క‌ష్టాలు ఇక తీరిపోనున్నాయి. మూసీ న‌ది ఉప్పొంగిన ప్ర‌తిసారీ అంబ‌ర్‌పేట వైపు వెళ్లాల‌న్నా, అటునుంచి రావాల‌న్నా గోల్నాక బ్రిడ్జిపై నుంచి చుట్టూ తిరుగుతూ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చేది. అయితే ముసారాంబాగ్‌-అంబర్‌పేట ప్రాంతాలను కలుపుతూ మూసారాంబాగ్ (Moosarambagh Bridge) వ‌ద్ద మూసీ న‌దిపై స‌రిగ్గా మూడేండ్ల క్రితం ప్రారంభించిన హైలెవ‌ల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నులు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. సోమ‌వారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు దానిని అంకితం ఇవ్వ‌నున్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో 2023 సెప్టెంబ‌ర్ 24న రూ.52 కోట్ల వ్యయంతో హైలెవ‌ల్ బ్రిడ్జి (Moosarambagh Level Bridge) నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. అయితే ప్ర‌భుత్వం మార‌డంతో ప‌నులు కొంత ఆలస్య‌మ‌య్యాయి. 2024, 2025 సంవత్సరాల్లో మూసీ వరద ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న ముసారాంబాగ్‌ బ్రిడ్జి పనులకు ఆటంకం కలిగింది. అయితే ఇటీవ‌లే ప‌నులు పూర్తికావ‌డంతో బ్రిడ్జిని ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

కాగా, హైలెవల్‌ బ్రిడ్జిని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ముసారాంబాగ్‌ వద్ద ఎడమ వైపు వంతెన(డౌన్‌ స్ట్రీమ్‌) నిర్మాణం పూర్త‌యింది. ఇంతవరకు ఉన్న లో లెవల్‌ బ్రిడ్జికి 10మీటర్ల ఎత్తు(32అడుగుల)లో దీనిని నిర్మించారు. బ్రిడ్జిపై పాదాచారులు నడిచేందుకు వీలుగా 3.5 మీటర్ల వెడల్పులో పుట్‌పాత్‌ను కూడా నిర్మిస్తున్నారు. అప్రోచ్‌ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బ్రిడ్జి కుడివైపు నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కుడివైపు బ్రిడ్జిని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈలోగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఎడమవైపు బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అనుమతించనున్నారు.

Advertisement
Advertisement