త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణ వ్య‌తిరేక అంశాల‌ను ఎజెండా నుంచి తొల‌గించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజ‌రైతే చూస్తూ ఊరుకోం

Harish Rao | తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఎజెండా అంశాల‌ను తొలగించకుండా ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే బీఆర్ఎస్‌ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో బీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చరించారు.

S

Telangana | Published On Aug 14, 2026, 1.43 pm IST

Harish Rao | తెలంగాణ వ్య‌తిరేక అంశాల‌ను ఎజెండా నుంచి తొల‌గించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజ‌రైతే చూస్తూ ఊరుకోం
Advertisement
  • జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
  • కాళేశ్వ‌రం నీళ్ల‌తో పంట‌లు పండ‌లేద‌ని ప్ర‌చారం చేస్త‌వ్‌
  • మ‌రి గోదావ‌రి జ‌లాల‌ను ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోయండ‌ని ఎందుకు చెప్తున్న‌వ్‌
  • సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదిక‌గా మండిప‌డిన హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఎజెండా అంశాల‌ను తొలగించకుండా ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే బీఆర్ఎస్‌ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో బీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చరించారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయని రేవంత్ ప్రచారం చేస్తున్నార‌ని.. మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారు? ప్ర‌శ్నించారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

రేవంత్‌రెడ్డి గారు.. అర్ధ‌స‌త్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం.. ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా? మీరు మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగుతాయా?

కృష్ణా జ‌లాల కోసం మ‌ళ్లీ ఉద్య‌మాలు చేసే ప‌రిస్థితి తెస్తున్నరు..

ఎల్లంపల్లి-మిడ్‌మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు అనే వాస్తవాన్ని ఎంత దాచిపెట్టినా దాగ‌వు. కాళేశ్వరం ద్వారా SRSP, నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేరు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై మీరు చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారింది. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారు.

అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపండి. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను GRMB ఎజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోండి. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్‌ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది. వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ డా.ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌ అద్భుతమైన వ్యాసం రాశారు. ఆయ‌నకు అభినంద‌న‌లు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement