త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భ‌య‌ప‌డా.. నాకు చెప్పే బ‌దులు రేవంత్‌కు చెప్పండి

MLA Rajagopal Reddy | టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ చేసిన హెచ్చ‌రిక‌ల‌పై ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అదే స్థాయిలో రియాక్ట‌య్యారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు చెప్పినా భ‌య‌ప‌డ‌న‌ని స్వ‌రం పెంచి స్పందించారు.

S

Telangana | Published On Aug 15, 2026, 6.47 pm IST

MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భ‌య‌ప‌డా.. నాకు చెప్పే బ‌దులు రేవంత్‌కు చెప్పండి
Advertisement
  • పోచారంను పొమ్మ‌నుర్రి.. ఎవ‌లుండుమంటుర్రు పార్టీల‌
  • దానం నాగేంద‌ర్‌ది చిల్ల‌ర రాజ‌కీయం
  • చేరిక‌ల విష‌యంలో కేసీఆర్ చేసిన త‌ప్పే కాంగ్రెస్ చేస్తోంది
  • మ‌హేశ్‌కుమార్ హెచ్చ‌రిక‌ల‌పై స్వ‌రం పెంచిన ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

MLA Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ చేసిన హెచ్చ‌రిక‌ల‌పై ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అదే స్థాయిలో రియాక్ట‌య్యారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు చెప్పినా భ‌య‌ప‌డ‌న‌ని స్వ‌రం పెంచి స్పందించారు. నాకు చెప్పే బ‌దులు సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. కాంగ్రెస్ పార్టీల‌కు వ‌చ్చినోళ్ల‌కు, చేర్చుకున్నోళ్ల‌కు బుద్ధి లేద‌ని ఫైర‌య్యారు. చేరిక‌ల విష‌యంలో కేసీఆర్ చేసిన త‌ప్పునే కాంగ్రెస్ చేస్తోంద‌న్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ చేరికలపై ఘాటుగా స్పందించారు.

నంబ‌ర్ టూ పోచార‌మే..

నేను పార్టీ లైన్ దాటలేదు.. వ్యక్తిగతంగా నేను ఎవరినీ విమర్శించలేదు. నా మాటలను మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లినా ఇబ్బందేమీ లేదు. సీపీఐ మ‌ద్ద‌తు ఉండ‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది. బీఆర్ఎస్ బీ-ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‍లోకి తీసుకోవడం ఏంటి? గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యేలా వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు? కాంగ్రెస్ పార్టీ పతనానికి కేసీఆర్ నంబర్ వన్ అయితే నంబర్ టూ పోచారమే. ఆయన్ను ఎవరు రప్పించారు? పార్టీలో చేరాక ఇప్పుడు తనకు బాధ అనిపిస్తోందని పోచారం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అలాంటప్పుడు ఆయన్ను పార్టీలో ఎవరు ఉండమన్నారు? ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలి.

దానం బీఆర్ఎస్‌లోనే ఉన్నా అంటుండు..

ఇక దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటున్నాడు. ఇదేం చిల్లర రాజకీయం.! బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవద్దు. చేరికల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‍కు అన్ని తెలుసు.

మహేశ్ కుమార్ గౌడ్ నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పాలి. చేరికలపై మనం తప్పు చేస్తున్నామని, మన పార్టీ గౌరవం కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలి. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలి. నా వ్యాఖ్యలు పార్టీకి మేలు చేస్తాయే తప్ప నష్టం చేయవు అని రాజ‌గోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

Advertisement
Advertisement