త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | గోదావ‌రి జ‌లాల వినియోగానికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ

Bhatti Vikramarka | గోదావరిలోని ప్ర‌తి చుక్క‌నీటిని స‌ద్వినియోగం చేసుకుంటూ గ్రావిటీ, లిఫ్ట్‌తో చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు అందించ‌డ‌మే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌ పథకం, సీతమ్మసాగర్ మ‌ల్టిప‌ర్ప‌స్ ప్రాజెక్టుల‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Jul 16, 2026, 3.53 pm IST

Bhatti Vikramarka | గోదావ‌రి జ‌లాల వినియోగానికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ
Advertisement
  • చివ‌రి ఆయ‌క‌ట్టుకు నీరందించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యం
  • దురుద్దేశంతోనే కేసీఆర్‌ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల రీడిజైన్‌
  • రీడిజైన్‌తో అద‌న‌పు భారం
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
  • సీతారామ‌, సీత‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించిన మంత్రులు

Bhatti Vikramarka | గోదావరిలోని ప్ర‌తి చుక్క‌నీటిని స‌ద్వినియోగం చేసుకుంటూ గ్రావిటీ, లిఫ్ట్‌తో చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు అందించ‌డ‌మే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌ పథకం, సీతమ్మసాగర్ మ‌ల్టిప‌ర్ప‌స్ ప్రాజెక్టుల‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వాతావరణ మార్పుల ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వేగంగా చర్యలు చేపడుతోందన్నారు. మూడు రోజుల క్రితం దేవాదుల ఎత్తిపోతల పథకంలోని సమ్మక్క బ్యారేజ్ బ్యాక్‌వాటర్‌ వద్ద అన్ని పంపులను పూర్తిస్థాయిలో ప్రారంభించి నీటిని ఎత్తిపోశామని గుర్తు చేశారు. దాదాపు 12 జిల్లాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపే కార్యక్రమాన్ని తానే స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షించినట్లు తెలిపారు.

వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తాం..

సీతారామ ప్రాజెక్టును కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు భట్టి తెలిపారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ సంకల్పమన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత రైతులకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను రూపకల్పన చేశారని భట్టి గుర్తు చేశారు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. డుమ్ముగూడెం వద్ద రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టును రూ.1,681 కోట్ల అంచనా వ్యయంతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారని చెప్పారు. అలాగే, గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతమైన రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,824 కోట్లతో మరో 2 లక్షల ఎకరాలకు నీరందించేలా చేపట్టారని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3,505 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతిని బ‌య‌ట‌పెట్టాం..

రాష్ట్ర విభజనకు ముందే ఈ రెండు ప్రాజెక్టులపై సుమారు రూ.2వేల కోట్లు ఖర్చు చేశారని భట్టి తెలిపారు. మరో రూ.1,505 కోట్లు వెచ్చిస్తే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం దురుద్దేశంతో వాటిని రీడిజైన్‌ చేసిందని ఆరోపించారు. రీడిజైన్‌ కారణంగా సీతమ్మసాగర్‌ బ్యారేజీని కూడా కలిపి ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.24 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. దీంతో అదనంగా రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ప్రజాధనం భారం పడిందని విమర్శించారు. ఆ సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, తాను ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈ అంశంపై సభల్లో, ప్రజల మధ్య పూర్తి ఆధారాలతో అవినీతిని బయటపెట్టామని భట్టి తెలిపారు. అసలు రూపకల్పనలో ఉన్న రెండు ప్రాజెక్టులనే పూర్తి చేయాలని ఎన్నిసార్లు కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా రీడిజైన్‌ను కొనసాగించిందని విమర్శించారు.

లోపాల‌ను స‌రిదిద్దుతున్నం..

గత ప్రభుత్వ విధానాలను గమనించిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారని భట్టి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రివర్గం ఈ ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించిందన్నారు. ఇప్పటికే భారీగా ప్రజాధనం వెచ్చించిన నేపథ్యంలో పనులను నిలిపివేయడం సమంజసం కాదని భావించి, ప్రాజెక్టును పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ కాలువల లేమి, రిజర్వాయర్ల సామర్థ్యానికి సంబంధించిన లోపాలను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. రాజీవ్‌ కాలువను సాగర్‌ కాలువతో అనుసంధానం చేస్తున్నామని, లింక్‌ కాలువలు, సొరంగ మార్గాల ద్వారా వైరా, పాలేరు రిజర్వాయర్లను నింపే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సత్తుపల్లి వరకు నీటిని తీసుకెళ్లే పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నింటినీ నిర్దిష్ట గడువులో పూర్తి చేసేందుకు నెలవారీ కార్యాచరణ రూపొందించి, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఒక్క రూపాయి వృథా కానివ్వం..

"ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజాధనంలో ఒక్క రూపాయి కూడా వృథా కానివ్వం. ఇప్పటికే చేపట్టిన పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం" అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గోదావరి నదికి చివరి భాగంలో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకుని జిల్లా రైతుల ఎన్నో ఏళ్ల ఆకాంక్షను నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భ‌ట్టి స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement