త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | కావాల‌నే సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికి వ‌దిలేశారు.. మండిప‌డ్డ మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ పార్టీని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌లు ఎప్పుడూ స‌రిగా ఆద‌రించ‌డం లేద‌నే క‌క్ష‌తో అత్యంత కీల‌క‌మైన సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు ప‌లు సాగునీటి ప్రాజెక్ట్‌ల‌ను ఆ పార్టీ నాయ‌కులు గాలికి వ‌దిలేశార‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు.

S

Telangana | Published On Jul 16, 2026, 3.41 pm IST

Ponguleti Srinivas Reddy | కావాల‌నే సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికి వ‌దిలేశారు.. మండిప‌డ్డ మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌లు ఎప్పుడూ స‌రిగా ఆద‌రించ‌డం లేద‌నే క‌క్ష‌తో అత్యంత కీల‌క‌మైన సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు ప‌లు సాగునీటి ప్రాజెక్ట్‌ల‌ను ఆ పార్టీ నాయ‌కులు గాలికి వ‌దిలేశార‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. గురువారం నాడు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి ఖ‌మ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌ను మంత్రి పొంగులేటి సంద‌ర్శించారు. ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ప‌రిస్ధితిని చూస్తే క‌డుపు త‌రుక్కుపోతోంద‌ని అన్నారు.

గ‌తంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతీయులు ఓట్లు వేసి సీట్లు ఇవ్వ‌నందున గిరిజ‌నులు అధికంగా ఉండే కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల‌కు ఉప‌యుక్త‌మైన సీతారామ ప్రాజెక్ట్‌కు అన్యాయం చేశారు. ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ప్రాజెక్ట్‌ల‌కు మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టిన‌ట్లే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ వాటిని ద‌శ‌ల వారీగా అభివృద్ది చేస్తున్నాం. ఎటువంటి బేష‌జాల‌కు, ప‌ట్టుద‌ల‌కు పోకుండా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం త‌ప్పు చేసినా సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను స‌రిదిద్దే త‌ప‌న‌తో ప‌నిచేస్తున్నాం. వారు క‌ట్టార‌ని కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను వ‌దిలేయం, గిరిజ‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే సీతారామ ప్రాజెక్ట్ ల ప్రాధాన్య‌త గుర్తించి ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అందుబాటులోకి తెస్తామ‌ని మంత్రి తెలిపారు.

ఉన్న నిధుల‌ను బీఆర్ఎస్ పెద్ద‌లు కొల్ల‌గొడితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ లోటును భ‌ర్తీ చేస్తూ మ‌రోవైపు సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తోంది. రాష్ట్రంలో నీటిపారుద‌ల రంగం కుంటుప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నాం. ఈ సీతారామ ప్రాజెక్ట్‌కు గ‌తంలో రూ. 115 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసి వ‌దిలేశారు. ఇప్పుడు నిధులిస్తూ 1480 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసి ఖ‌మ్మం, వైరా, స‌త్తుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల‌కు తాగునీటిని కూడా అందిస్తున్నాం. 1.25 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని విడుద‌ల చేస్తూ క‌రువు వ‌చ్చినా కాపాడేలా చేస్తున్నాం. అవ‌స‌ర‌మైతే అద‌నంగా నీటిని విడుద‌ల చేస్తాం. రైతుల‌కు నీరు ఇవ్వాల‌న్న త‌ప‌న‌తో రేవంత్‌ రెడ్డి నాయ‌క‌త్వంలో చాలా గ‌ట్టిగా ప‌నిచేస్తున్నాం. ప్ర‌తిప‌క్ష‌పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ పెద్ద‌లు క‌డుపులో విషం పెట్టుకొని అబ‌ద్దాల‌తో కాలం గ‌డుపుతున్నారు. ప‌దేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల క‌ష్టం గుర్తించ‌ని నాటి పెద్ద‌లు ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం ఎలా ప‌నిచేస్తుందో చూస్తూ జ్ఞానం తెచ్చుకోవాలి.. అని మంత్రి పొంగులేటి హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement