త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సింగ‌రేణికి రేవంత్ స‌ర్కార్ బ‌కాయి రూ. 50 వేల కోట్ల‌పైనే : హ‌రీశ్‌రావు

Harish Rao | ఒక‌ప్పుడు సిరుల గ‌నిగా వెలుగొందిన సింగ‌రేణి.. ఇప్పుడు స్కామ్‌ల గ‌నిలా మారిపోయింద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. విద్యుత్, బొగ్గు బ‌కాయిలు క‌లిపి సింగరేణికి రేవంత్ సర్కార్ రూ. 50 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు ప‌డింద‌ని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On May 26, 2026, 4.02 pm IST

Harish Rao | సింగ‌రేణికి రేవంత్ స‌ర్కార్ బ‌కాయి రూ. 50 వేల కోట్ల‌పైనే : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఒక‌ప్పుడు సిరుల గ‌నిగా వెలుగొందిన సింగ‌రేణి.. ఇప్పుడు స్కామ్‌ల గ‌నిలా మారిపోయింద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. విద్యుత్, బొగ్గు బ‌కాయిలు క‌లిపి సింగరేణికి రేవంత్ సర్కార్ రూ. 50 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు ప‌డింద‌ని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ భ‌వ‌న్‌లో టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

సింగ‌రేణి ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంది. కొన్ని నిజాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. సింగ‌రేణి ఒక‌ప్పుడు సిరుల గ‌ని. ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగ‌రేణి ప‌రిస్థితి. పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న‌ట్టు ఇవాళ సింగ‌రేణి నిండా.. ఈ రెండున్నండ్ల‌లే అది స్కామ్‌లా గ‌ని అయిపోయింది. సింగ‌రేణి స్కామ్‌ల గ‌ని అయిపోయింది అని హ‌రీశ్‌రావు అన్నారు.

19 వేల మందికి వార‌స‌త్వ ఉద్యోగాలను ఇప్పించి జీవం పోసింది కేసీఆర్

ఆనాడు చంద్ర‌బాబు నాయుడు వార‌స‌త్వ ఉద్యోగాల‌ను తొల‌గిస్తే.. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక 19 వేల మందికి తిరిగి వార‌స‌త్వ ఉద్యోగాలను ఇప్పించి జీవం పోసింది కేసీఆర్, మ‌న బీఆర్ఎస్. కానీ జ‌రుగుతున్న‌ది ఏంది..? వార‌స‌త్వ ఉద్యోగాల మీద ఎంక్వైరీ వేస్తం. వీలైతే గోల్డెన్ షేక్ హ్యాండ్ ప‌థ‌కం తెచ్చి ఉన్న ఉద్యోగాల్లోంచి తొల‌గిస్తాం.. ఇది కాంగ్రెస్ వైఖ‌రి. ఉద్యోగాలిచ్చుడు బీఆర్ఎస్ వైఖ‌రి అయితే.. ఉన్న ఉద్యోగాల‌ను తొల‌గించుడు కాంగ్రెస్ వైఖ‌రి. వీళ్లు వ‌చ్చిన త‌ర్వాత రెండు మెడిక‌ల్ బోర్డులు పెడితే ఒక‌దాంట్లో ఐదుగురు, మ‌రోదాంట్లో 23 మంది వ‌చ్చిన‌ట్టు ఉన్నారు. వీళ్ల‌ను అన్‌ఫిట్ చేశారు.. మిగ‌తాది అంతా ఫిట్ అన్నారు. బైపాస్ స‌ర్జ‌రీ, ప‌క్ష‌వాతం వ‌చ్చిన వారిని ఫిట్ అని చెబితే.. సీఎండీ వ‌ద్ద‌కు వెళ్లి వారి ప‌క్షాన గ‌ట్టిగా కొట్లాడినం అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ధ్య నైనీ బ్లాక్ వివాదం

కానీ ప‌రిస్థితి ఏమైంది.. సింగ‌రేణిని కాపాడాల‌నో, దీని భ‌విష్య‌త్ బాగుండాల‌నే ఆలోచ‌న‌లో లేరు. ఇక మ‌ళ్లీ మేం గెలిచే ప‌రిస్థితి లేదు.. అందిన‌కాడికి దోచుకోవాల‌నే ధోర‌ణిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంది. ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ధ్య నైనీ బ్లాక్ వివాదం ఏర్ప‌డింది. ఈ విష‌యంలో చివ‌ర‌కు జ‌ర్న‌లిస్టులు అరెస్టు అయ్యేదాకా పోయింది. మంత్రులు బ‌హిరంగంగా వాటాల కోసం మాట్లాడార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

రెండున్న‌రేండ్ల‌లో 14 వేల కోట్లు

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణికి బ‌కాయిలు అడ్డ‌గోలుగా పెరుగుతూ పోతున్నాయి. అస‌లు బ‌కాయిలు చెల్లించ‌డం లేదు. సింగ‌రేణి నుంచి ప్ర‌భుత్వం బొగ్గు, క‌రెంట్ తీసుకుంట‌ది. బీఆర్ఎస్ హ‌యాంలో కూడా బొగ్గు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాక‌ముందు బ‌కాయిలు ఎన్ని ఉండంటే.. 2014లో అధికారంలోకి వ‌చ్చేనాటికి ప్ర‌భుత్వానికి రూ. 3 వేల కోట్ల బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప‌దేండ్లు గ‌వ‌ర్న‌మెంట్‌లో ఉన్నాం. మ‌న బ‌కాయిలు క‌లిపితే మొత్తం రూ. 7 వేల కోట్లు ఉండే.. టీఎస్ జెన్కో నుంచి ఇది బొగ్గుకు మాత్ర‌మే. కొత్త‌గా మ‌న హ‌యాంలో రూ. 4 వేల కోట్లు ఉండే. ఈ రోజు రూ. 21 వేల కోట్లు బకాయి ఉంది.. బొగ్గుకు మాత్ర‌మే. రెండున్న‌రేండ్ల‌లో 14 వేల కోట్లు పెరిగింది. అంటే సింగ‌రేణికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ. 14 వేల కోట్లు బాకీ ప‌డింది. మ‌న క‌ట్టుకుంటూ పోయాం సింగ‌రేణికి. క‌రోనా వ‌ల్ల ఇబ్బంది ఏర్ప‌డ‌డంతో ఆ రెండేండ్ల‌లో రూ. 4 వేల కోట్లు బ‌కాయి ప‌డ్డాం. వీళ్ల‌కు ఏమైంది. ఒక్క రూపాయి కూడా సింగ‌రేణికి ఇస్త‌లేరు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

విద్యుత్, బొగ్గు రెండు క‌లిపితే రూ. 50 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు

క‌రెంట్ విష‌యానికి వ‌స్తే.. అదొక రూ. 20 వేల కోట్లు బకాయి ఉంది. విద్యుత్, బొగ్గు రెండు క‌లిపితే రూ. 50 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు ఉన్నాయి. సింగ‌రేణి పేరు మీద రూ. 3 వేల నుంచి రూ. 4 వేల కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంట‌ద‌నేది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు ఓడీ(ఓవ‌ర్ డ్యూ) ఉంది. యావ‌త్ తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్రం ఇచ్చే ఓడీ రూ. 2400 కోట్లు. కాంగ్రెస్ వ‌చ్చినాక రూ. 3200 కోట్లు ఓడీ ఉంది. అంత‌కంటే ఎక్కువ పోవొద్దు. సింగ‌రేణి ఓడి ఎంతంటే.. రూ. 4 వేల కోట్లు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఓడీ కంటే సింగ‌రేణి ఓడీ ఎక్కువ‌. బీఆర్ఎస్ హ‌యాంలో సింగ‌రేణి ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ. 3 వేల కోట్లు ఉంటుండే. కాంగ్రెస్ వ‌చ్చాక ఫిక్స్‌డ్ డిపాజిట్ పోయింది.. రూ. 4 వేల కోట్ల ఓడీకి పోయింది. మీకు జీతాలు రావాలంటే బ్యాంకుల‌కు వెళ్లి అప్పులు, ఓడీ తెస్తే, బ‌తిమిలాడితే మీకు నెల‌కు జీతం ప‌డుతుంది. ఇంకో నాలుగు రోజులు పోతే దాని ప‌రిస్థితి ఏందాక పోతుందో అర్థం కాని ప‌రిస్థితి సింగ‌రేణిలో ఉంది. కార్మికులు అర్థం చేసుకోవాలి ఓడీకి ఎందుకు పోయింది.. రెండున్న‌రేండ్ల‌లో కాంగ్రెస్ ఏం చేసింది.. అంటే లోతైన విష‌యాలు ఉన్నాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు స్టాక్ ఉంద‌ట‌..

సింగ‌రేణి వెబ్‌సైట్‌లో చూస్తే 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు స్టాక్ ఉంద‌ని చూపిస్తున్నారు. మంద‌మ‌ర్రి బొగ్గుబాయి మీద 7 ల‌క్ష‌ల 20 వేల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు స్టాక్ ఉంద‌ట‌. శ్రీరాంపూర్ వ‌ద్ద 8 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, ఆర్జీ1 వ‌ద్ద‌ 6 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, ఆర్జీ 3 వ‌ద్ద 4 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, భూపాల‌ప‌ల్లి బొగ్గుబాయి వ‌ద్ద 5 ల‌క్ష‌ల 40 వేల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు స్టాక్ ఉంద‌ట‌. ఇల్లందు బొగ్గు బాయి వ‌ద్ద 3 ల‌క్ష‌ల 50 వేల మెట్రిక్ ట‌న్నులు, స‌త్తుప‌ల్లి వ‌ద్ద 2 ల‌క్ష‌ల స్టాక్ ఉంద‌ట‌. సింగ‌రేణి అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి చేసి బాయిల మీద స్టాక్ ఉంద‌ని చూపిస్తుంది. ఈ 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల మీద ట‌న్నుకు రూ. 4200 చొప్పున మాకు ఇంత ప్రాఫిట్ వ‌చ్చింద‌ని ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టారు. కేంద్రానికి డివిడెంట్, రాష్ట్ర ప్ర‌భుత్వానికి డివెడెంట్ ఇచ్చారు. కోల్ సెస్ క‌ట్టారు. డీఎంఎఫ్‌టీ సెస్ డ‌బ్బులు కూడా ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ఈ బొగ్గు ఎటు పోయింది.. ఇది ఆఫీషియ‌ల్ రికార్డు.. ఉట్టిగ‌నే చెప్ప‌డం లేదు. బొగ్గు తీయంగానే ప్రాఫిట్ అని కొత్త లెక్క తీసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

ఈ స్కాంను బ‌య‌ట‌కు తీయండి..

నా డౌట్ ఏందంటే.. 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు యాడికి పోయింది. ఉన్న‌దా..? లేదా..? రూ. 4 వేల చొప్పున లెక్క వేసుకున్న దీని విలువ రూ. 1600 కోట్లు. మ‌రి ఈ బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు. మ‌రి ఎక్క‌డికి పోయింది.. పోతే ఈ పైస‌లు ఎవ‌డు తిన్న‌డు.. ఎవ‌రికి జేబులోకి పోయాయి. మ‌రి ఈ రూ. 1600 కోట్ల బొగ్గు ఉన్న‌ద‌ని ఎట్ల చూపించారు. ఈ 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు తీశామ‌ని, ఇన్‌కంట్యాక్స్, డివెడెంట్, డీఎంఎఫ్‌టీ సెస్ క‌ట్టి కోల్ సెస్ క‌ట్టి ఎవ‌నీ కొంప ముంచుతున్నారు.. ఎటు పోయింది బొగ్గు.. ఒక్క బొగ్గు ముక్క‌న్నా దొరుకుత‌దా..? ఆ బొగ్గు ఏమైంది.. దీనిపై ప్ర‌శ్నించాలి. ఎవ‌రికి అమ్ముకున్నారు. ఈ బొగ్గు ఎక్క‌డున్న‌ద‌ని నిల‌దీయాలి. ప్ర‌తి డివిజ‌న్ డీఎంల‌ను నిల‌దీయండి.. ఈ స్కాంను బ‌య‌ట‌కు తీయండి అని సింగ‌రేణి కార్మికుల‌కు హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement