త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అప్ర‌క‌టిత క‌రెంట్ కోత‌ల‌తో.. తెలంగాణ‌లో అంధ‌కారం

Harish Rao | రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రం అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 16, 2026, 5.37 pm IST

Harish Rao | అప్ర‌క‌టిత క‌రెంట్ కోత‌ల‌తో.. తెలంగాణ‌లో అంధ‌కారం
Advertisement

బీఆర్ఎస్ హ‌యాంలో క‌రెంట్ పోతే వార్త‌
ఇప్పుడు క‌రెంట్ ఉంటే వార్త‌
హైడ‌ల్ ప‌వ‌ర్‌కు నీళ్లు లేవు..
థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌కు బొగ్గు లేదు..
అందుకే అప్ర‌క‌టిత క‌రెంట్ కోత‌లు
కాంగ్రెస్ తీరు వ‌ల్లే విద్యుత్ కేంద్రాల్లో నిలిచిన ఉత్ప‌త్తి
సీఎం రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రం అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయ‌న తెలిపారు. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు. థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు నిల్వలు పెట్టుకోలేదు. దీనికి అనుగుణంగా ఏం ఏర్పాట్లు చేసారు. ఏం ముందస్తు చర్యలు తీసుకున్నారు అని కాంగ్రెస్ స‌ర్కార్‌ను హ‌రీశ్‌రావు నిల‌దీశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు గురువారం మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అన్న పరిస్థితి నెలకొంది. ఈరోజు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల ముందు రైతాంగం ధర్నాలు చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయి. సింగరేణి విషయంలో పీపీటీలు పెట్టి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ముందే చెప్పాం. 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని ప్రభుత్వం చెప్పింది.. వాస్తవానికి లేదని మేం హెచ్చరించాం. బీఆర్ఎస్ నిద్ర లేపినా కూడా ప్రభుత్వం నిద్రలేవలేదు. కాంగ్రెస్ తీరు వల్ల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

6–7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు

కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6–7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. యాదాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయింది. అసలు విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో లోడ్ కేవలం 15 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదు. నిన్న కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగింది. అంటే సగం సామర్థ్యం కూడా వినియోగించడం లేదు. ఉన్న సామర్థ్యంలో కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. 56 శాతం సామర్థ్యాన్ని వినియోగించడం లేదు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

విద్యుత్ సరఫరాలో కూడా ఫెయిల్

బొగ్గు సరఫరాలో వైఫల్యం.. నీటి నిల్వల నిర్వహణలో వైఫల్యం.. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో వైఫల్యం. బొగ్గులో స్కాం, పవర్‌లో స్కాం, సాండ్‌లో స్కాం, ల్యాండ్‌లో స్కాం.. కాంగ్రెస్ పాలన అంతా స్కాముల మయంగా మారింది. రాష్ట్రం మీద అసలు సోయి ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గి సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. నీటిని లిఫ్ట్ చేయలేదు.. రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అసాధ్యం చేశారు. ముందస్తు ఆలోచనతో అయినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చూడలేదు. సాగునీటి సరఫరాలో ఫెయిల్ అయ్యారు.. విద్యుత్ సరఫరాలో కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి ధ్వ‌జ‌మెత్తారు.

కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణకు మొత్తంగా 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అయినా ప్రస్తుతం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. దీనికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నాం. సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారు. నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారు. 70 రేకులు పంపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి. అందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. మీ దగ్గర బొగ్గు ఉండి కూడా అడ్డగోలు ధరలకు పవర్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకు కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హైడ‌ల్ ప‌వ‌ర్‌కు నీళ్లు లేవు.. థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌కు బొగ్గు లేదు..

రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1059 టీఎంసీలు. ప్రస్తుతం ఉన్న నిల్వ కేవలం 351 టీఎంసి అంటే 33.17 శాతం. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు. థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు నిల్వలు పెట్టుకోలేదు. దీనికి అనుగుణంగా ఏం ఏర్పాట్లు చేసారు. ఏం ముందస్తు చర్యలు తీసుకున్నారు. కరువు వస్తది అని ఎప్పటి నుంచో చెబుతున్నది వాతావరణ శాఖ? అటు నీళ్ల మీద ధ్యాస లేదు, ఇటు పవర్ మీద ధ్యాస లేదు. మీ ధ్యాస అంతా కమిషన్లు, కొట్లాటల మీదనే అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రైతులను మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం

బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో గుండెలపై చేయి వేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. లోవోల్టేజ్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. త్రీ ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలం వద్ద జాగారం చేయాల్సి వస్తోంది. ఇందిరమ్మ పాలన అంటే సమైక్య రాష్ట్రం నాటి విద్యుత్ కష్టాలను మళ్లీ తీసుకురావడమేనా? పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కరెంట్ కోతలే ఉన్నాయి. రైతులు మాత్రమే కాదు.. చిన్న వ్యాపారులు, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గంటల తరబడి కరెంట్ ఉండడం లేదు. విద్యార్థులు రాత్రి సమయంలో చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

గ్రీన్ ఎన‌ర్జీ పాల‌సీని ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు..?

గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 3 వేల మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు ఎందుకు క్లియర్ చేయలేదో ప్రభుత్వం చెప్పాలి. కమిషన్లు తేలక ఆపారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? కమిషన్ల కక్కుర్తితో గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయకుండా పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి. థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు సరఫరా చేయాలి. రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర రైతాంగం తరఫున బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని హెచ్చరిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

సీతారామ మోటార్లు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే..

ఖమ్మం జిల్లాలో ఈరోజు మంత్రులు ప్రారంభించిన సీతారామ మోటార్లు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. కేసీఆర్ పెట్టిన మోటార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్విచ్ వేయడానికి మాత్రమే వెళ్తోంది. మొన్న దేవాదుల ప్రాజెక్టుకు కూడా అలాగే వెళ్లారు. మూడో ఫేజ్ దేవాదుల కూలిపోతే అది కూడా కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టే. రిటైర్డ్ ఇంజినీర్లు, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని చెబితే వారిని బెదిరిస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వమంటే బెల్టులతో కొడతాం, రక్తం పంట పొలాలపై చల్లుతాం అంటూ అధికార పక్షం రాజకీయాలు చేస్తోంది. సీతారామ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేద‌ని మాజీ మంత్రి స్ప‌ష్టం చేశారు.

మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవి ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement