త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఉత్త‌మ్‌ను బ‌య‌ట కూసోబెట్టి నీళ్ల మీటింగా?

Harish Rao | కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర‌య్యారు. న‌దుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jun 27, 2026, 3.30 pm IST

Harish Rao | ఉత్త‌మ్‌ను బ‌య‌ట కూసోబెట్టి నీళ్ల మీటింగా?
Advertisement
  • రేవంత్ బ‌య‌ట కూర్చోమంటే ఎలా కూర్చున్న‌వ్‌
  • సీఎం తెలంగాణను ముంచే 'ముంపు మేస్త్రి'గా మారిండు
  • ముగ్గురు సీఎంలు చేసుకున్న ఆ 'చీకటి ఒప్పందం' ఏంటో రేవంత్ బయటపెట్టాలి
  • మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఫిడేల్ వాయించిన 'నీరో చక్రవర్తిలా చోద్యం చూస్తున్నడు
  • రేవంత్‌పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర‌య్యారు. న‌దుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగారు.

ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చేస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తుంగభద్ర నదిపై ఈ 55 టీఎంసీల నీటిని అటు కర్ణాటక, ఇటు ఏపీ ఆపేస్తే ఆ నీరు అల్టిమేట్‌గా శ్రీశైలం ప్రాజెక్టుకు రాదు. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏపీతో అనుబంధం ఉండి, చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడితో కేంద్రంలో కార్యదర్శిగా నియమింపజేసుకున్న కాంతారావు సమక్షంలో జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలి.

ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 147 టీఎంసీల నదుల అనుసంధానం చేయాలని, ఆ అనుసంధానం తెలంగాణ భూభాగం సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్ నుంచి వెళ్లాలని, అందులో సగం నీళ్లు 74 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ నాడే కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో వందల సార్లు మినట్స్ ఆఫ్ మీటింగుల్లో రికార్డు చేయించింది. ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాను పూర్తిగా వాడేసుకుని, ఇప్పుడు నదుల అనుసంధానం పేరిట గోదావరి నుండి మరో 200 టీఎంసీల నీటిని తరలించాలని చూస్తోంది.. దీనిపై రేవంత్ రెడ్డి తెలంగాణకు దక్కాల్సిన సగం వాటా కోసం వాదించడం లేదు.

పోలవరం-బనకచర్ల లింకింగ్ తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రా పోలవరం నుంచే పోయే విధంగా రేవంత్ రెడ్డి అగ్రిమెంట్లు చేసుకున్నారని పత్రికల్లో లీకులు వస్తున్నాయి.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలి. కేసీఆర్ తొమ్మిదేళ్లు పోరాడి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి కృష్ణా నదీ జలాల పునర్ పంపిణీ కోసం ట్రిబ్యునల్ సాధించారు. కొద్ది నెలల్లోనే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు నీటి లెక్కలు తేలనున్నాయి. కానీ రేవంత్ రెడ్డి అజ్ఞానం, గురువుకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే తపన.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు శాపంగా మారింది.

ఏపీ జ‌ల దోపిడీకి రెడ్ కార్పెట్ ప‌రిచాడు..

రేవంత్ రెడ్డి గత ఏడాది జూన్ 18న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ NOC ఇస్తామని, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారు. మళ్లీ సెప్టెంబర్ 13న జరిగిన‌ సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారు. ఢిల్లీ మీటింగ్‌కు పోను పోను అంటూనే పోయి ఎజెండాలో లేని బనకచర్లపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సంతకం పెట్టన‌ని చెబుతూనే సంతకం పెట్టి, కమిటీ వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ పరిచారు.

కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చెప్తే వినే పరిస్థితిలో ఉంది..

ప్రతి దశలోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తూ, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. సీక్రెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు, కేంద్ర కార్యదర్శి కాంతారావు ఏం చెప్పారో రేవంత్ రెడ్డి బయటపెట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డి నిన్ను బయట కూర్చోబెడితే ఎలా ఊరుకున్నావు.. కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకైనా తెలంగాణ సోయి లేదా? 968 టీఎంసీల నికర గోదావరి జలాలు, నదుల అనుసంధానం, కృష్ణా నికర జలాలు, ఆర్డీఎస్-తుంగభద్ర అంశాలపై రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల వల్ల రాష్ట్ర భవిష్యత్తు కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల్లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు చెప్తే వినే పరిస్థితిలో ఉంది అని హ‌రీశ్ తీవ్రంగా విమ‌ర్శించారు.

ముగ్గురు సీఎంలు ఏం మాట్లాడారో శాస‌న స‌భ‌లో చ‌ర్చించాలి..

ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ముగ్గురు సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను వెంటనే శాసనసభలో పెట్టి చర్చించాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ తెచ్చే పేరుతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టును బలి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు 4 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు బలిపెడుతున్నారు? అని మాజీ మంత్రి ప్ర‌శ్నించారు.

బాబు భిక్షం పెట్టాల్సిన‌ అవ‌స‌రం లేదు..

కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పరీవాహక ప్రాంతం చట్టరీత్యా తెలంగాణకు 700-800 టీఎంసీలు వస్తాయి. పోలవరం డైవర్షన్ కింద 45 టీఎంసీలు, పాలమూరుకు 90 టీఎంసీలు రావాల్సిందే. దీనికి చంద్రబాబు భిక్షం పెట్టాల్సిన అవసరం లేదు. నదుల అనుసంధానం చంద్రబాబు, మోదీ కల కావచ్చు. కానీ అది తెలంగాణను బలిపెట్టి చేయకూడదు. పైన కర్ణాటక 16 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపుకొని, కింద గోదావరి నీళ్లను ఏపీ వాడుకుంటే మధ్యలో నష్టపోయేది తెలంగాణే అనే కనీస జ్ఞానం రేవంత్ రెడ్డికి లేదు అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

క‌నీసం ఒక నిర‌స‌న ఉత్త‌రం కూడా రాయ‌లే..

హైడ్రా విషయంలో హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్ల విషయంలో రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన 'నీరో చక్రవర్తి' స్ఫూర్తిగా తీసుకుని ఉండవచ్చు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక నిరసన ఉత్తరం కూడా రాయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కేమో గురుదక్షిణ, కర్ణాటకకేమో ఎన్నికల సహాయానికి ప్రతిఫలంగా దక్షిణ చెల్లించుకుంటూ తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ధారపోస్తున్నారు అని మండి ప‌డ్డారు.

968 టీఎంసీల గోదావరి హక్కులను కాపాడారా?

సమ్మక్క సాగర్ ఇంటర్ లింకింగ్ ప్రతిపాదన ఉందా లేదా? అందులో 50% నీళ్లు తెలంగాణకు వస్తున్నాయా? ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలు సాధించారా? కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని లేఖ రాస్తారా లేదా? అన్ని విషయాలపై రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ట్రిబ్యునల్స్ ముందు వాదనలు గట్టిగా వినిపించి, మంచి లాయర్లను పెడితే 700-800 టీఎంసీలు సాధించే అవకాశముంది. రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు.. కానీ తెలంగాణను ముంచే 'ముంపు మేస్త్రివి' కావద్దు అని హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌నాత్మ‌కంగా సూచించారు.

Advertisement
Advertisement