త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ (TET 2025) పరీక్ష వాయిదా పడింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

J

National | Published On Jun 27, 2026, 5.08 pm IST

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
Advertisement
  • రేపు జరగాల్సిన మహారాష్ట్ర టెట్ (TET 2025) పరీక్ష పేపర్ లీక్ అనుమానాలతో వాయిదా
  • థానే జిల్లా భీవండిలో పోలీసుల దాడుల్లో లభ్యమైన ప్రశ్నలు టెట్ పేపర్‌తో మ్యాచ్ అయినట్లు అధికారుల గుర్తింపు
  • ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు, త్వరలో కొత్త ఎగ్జామ్ తేదీల ప్రకటన
  • అభ్యర్థులు మళ్లీ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపిన అధికారులు

Maharashtra TET 2025 Postponed | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలో ఆదివారం జూన్ 28న జరగాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2025) ఎగ్జామ్ వాయిదా పడింది. ప్రశ్నపత్రం లీక్ అయిందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 'మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్' (MSCE) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. థానే జిల్లాలోని భీవండిలో జరిగిన పోలీసు దాడుల్లో కొన్ని అనుమానాస్పద ప్రశ్నలు బయటపడటంతో అధికారులు ఈ ఎగ్జామ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఈ ప్రశ్నలు నిజంగా టెట్ ఎగ్జామ్ పేపర్‌లోనివా, లేక కేవలం మాక్ టెస్ట్ పేపరా అనే కోణంలో విద్యాశాఖ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దీనిపై పూర్తి స్పష్టత వచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

భీవండి దాడుల్లో ఏం తేలింది?

రహస్య సమాచారం మేరకు జూన్ 27న ఉదయం భీవండిలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో MSCE అధికారులను కూడా పోలీసులు ఘటనా స్థలానికి పిలిపించారు. నిందితుల వద్ద లభ్యమైన ప్రశ్నలు.. TET 2025 ఎగ్జామ్ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన విద్యాశాఖ వెంటనే అప్రమత్తమైంది. భీవండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు.. ఈ పేపర్ లీకేజ్ ఎక్కడి నుంచి మొదలైంది? ఎంతమందికి చేరింది? అనే విషయాలపై లోతైన విచారణ ప్రారంభించారు.

మళ్లీ అప్లై చేయాల్సిన పనిలేదు

పరీక్ష వాయిదా పడటంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కౌన్సిల్ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే ఒక ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఈ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు మళ్లీ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

"ఇందులో అభ్యర్థుల తప్పు ఏమీ లేదు. కాబట్టి కొత్తగా ఎలాంటి ఫీజు వసూలు చేయం, మళ్లీ అప్లై చేయాల్సిన అవసరమూ లేదు," అని ఆమె వివరించారు. పరిస్థితిని చక్కదిద్ది, త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. అయితే, ఇంత భారీ స్థాయిలో జరిగే పరీక్షను రీ-షెడ్యూల్ చేయడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని ఆమె అంచనా వేశారు.

కఠిన చర్యలు తప్పవు

ఈ వ్యవహారంలో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు ప్రియా షిండే వెల్లడించారు. పోలీసుల దర్యాప్తుతో పాటు.. ఎగ్జామినేషన్ కౌన్సిల్ కూడా మరోవైపు విచారణ జరుపుతోందని తెలిపారు.

పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యత అని మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని, అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. విచారణ పూర్తయిన తర్వాత టెట్ ఎగ్జామ్ కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.

Advertisement
Advertisement