త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Raja Narasimha | 96 ల‌క్ష‌ల మంది చిన్నారుల ర‌క్ష‌ణ కోస‌మే.. ఆల్బండ‌జోల్ ట్యాబ్లెట్ల పంపిణీ: మంత్రి దామోద‌ర‌

Damodar Raja Narasimha | ఆల్బండ‌జోల్ ట్యాబ్లెట్ల (Albendazole Tablet) వల్ల నులిపురుగుల సమస్య తగ్గి, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ (Damodar Raja Narasimha) అన్నారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పిల్లల ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.

G

Telangana | Published On Jul 13, 2026, 12.20 pm IST

Damodar Raja Narasimha | 96 ల‌క్ష‌ల మంది చిన్నారుల ర‌క్ష‌ణ కోస‌మే.. ఆల్బండ‌జోల్ ట్యాబ్లెట్ల పంపిణీ: మంత్రి దామోద‌ర‌
Advertisement
Damodar Raja Narasimha | త్రినేత్ర‌.న్యూస్‌: ఆల్బండ‌జోల్ ట్యాబ్లెట్ల (Albendazole Tablet) వల్ల నులిపురుగుల సమస్య తగ్గి, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ (Damodar Raja Narasimha) అన్నారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పిల్లల ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. 96,81,855 మంది చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ చేప‌ట్టామ‌ని తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు ఆల్బండజోల్ ట్యాబ్లెట్లను అందజేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 1 నుంచి 19 ఏండ్ల‌ వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులందరికీ ఆల్బండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రుల‌కు విజ్ఞప్తి చేశారు.

పిల్లల్లో నులిపురుగుల (Intestinal Worms) సమస్య వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ‌న్నారు. ఇవి పిల్లల చదువుపై, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతాయి. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా వారి ఆరోగ్యానికి హానికరమ‌ని చెప్పారు. అందుకే ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర వేయించడం అత్యంత అవసరమ‌ని తెలిపారు. మాత్రలు పంపిణీ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసిపోద‌ని.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లను ప్రతి చిన్నారిలో అలవర్చడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఈ అంశాలపై పిల్లలు, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామ‌న్నారు. ఏ కారణంతోనైనా ఆల్బండజోల్ మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్ర అందజేస్తామ‌ని చెప్పారు. ప్రతి తల్లిదండ్రి ఈ కార్యక్రమానికి సహకరించి తమ పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు.

Advertisement
Advertisement