త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. త‌ల్లి శంక‌ర‌మ్మ విజ్ఞ‌ప్తి

Shankaramma | హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నిర్మిస్తున్న కొత్తపేట టిమ్స్‌కు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు ఇస్తోందన్నారు.

S

Telangana | Published On Jul 13, 2026, 1.44 pm IST

Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. త‌ల్లి శంక‌ర‌మ్మ విజ్ఞ‌ప్తి
Advertisement
  • సీఎం రేవంత్‌ను నాలుగుసార్లు క‌లిసి మాట్లాడా
  • కాంగ్రెస్ హ‌యాంలో అమ‌రుల కుటుంబాల‌కు న్యాయం జ‌రుగుతుంది
  • మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ వ్యాఖ్య‌లు

Shankaramma | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నిర్మిస్తున్న కొత్తపేట టిమ్స్‌ (TIMS)కు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీకాంతాచారి త్యాగం ఎనలేనిదని, టిమ్స్‌కు ఆయ‌న పేరు పెడితే అమరులకు సముచిత గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈమేర‌కు ఆమె సోమ‌వారం స్పందించారు.

బీఆర్‌ఎస్ హయాంలో సీఎం, మంత్రులను కలవనీయలేదు. శ్రీకాంతాచారి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించలేదు. కేసీఆర్‌ను ఏడుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు. సీఎం రేవంత్‌రెడ్డిని నాలుగుసార్లు కలిసి సమస్యలు వివరించాను అని శంక‌ర‌మ్మ పేర్కొన్నారు. కాగా ఎల్బీన‌గ‌రంలో స‌మీపంలోని పాత పండ్ల మార్కెట్ స్థలంలో 27 అంతస్తులతో ఈ టిమ్స్ ఆసుప‌త్రిని అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మిస్తున్నారు.

2009, డిసెంబ‌ర్ 3న ప్రాణ‌త్యాగం..

తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్యమకారులపై జ‌రుగుతున్న దమనకాండ, అరెస్టులను చూసి శ్రీకాంత్ చ‌లించిపోయాడు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో చావడానికి వెన‌కాడ‌లేదు. ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని ఆత్మాహుతికి యత్నించాడు. 2009, నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అగ్నికి ఆహుతి అవుతూనే జై తెలంగాణ అంటూ నినదించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2009, డిసెంబర్ 3న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాడు.

Advertisement
Advertisement