త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Awards | వ‌చ్చే ఏడాది కేటీఆర్, హ‌రీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Gaddar Awards | తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై తెలంగాణ మత్స్య అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

S

Telangana | Published On Sep 13, 2026, 5.33 pm IST

Gaddar Awards | వ‌చ్చే ఏడాది కేటీఆర్, హ‌రీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
Advertisement

మాక్ అసెంబ్లీ ముందు జ‌బ‌ర్ద‌స్త్ షో కూడా దిగ‌దుడుపే
తెలంగాణ భ‌వ‌న్‌ను నాట‌కాల‌కు అద్దెక్కివ్వండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై మెట్టు సాయికుమార్ సెటైర్లు

Gaddar Awards | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై తెలంగాణ మత్స్య అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు మాక్ అసెంబ్లీ పేరుతో కపట నాటకాలు, డ్రామాలు ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. ఆ కార్యక్రమాన్ని చూస్తే జబర్దస్త్ కామెడీ షో కూడా దిగదుడుపేనని, ఇకపై తెలంగాణ భవన్‌ను నాటకాలకు అద్దెకివ్వడం మంచిదని వ్యాఖ్యానించారు.

ఆస్కార్ స్థాయి నటన.. గద్దర్ అవార్డులకు అర్హులు

సురభి నాటక కంపెనీలు రంగస్థలం నుంచి సినిమాల వరకు ఎంతోమంది గొప్ప కళాకారులను అందించాయని, అయితే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించిన నటన వాటన్నింటినీ మించిపోయిందని సాయికుమార్ అన్నారు. కేటీఆర్, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని తదితరులకు ‘నవరస సార్వభౌమ’, ‘కళా ప్రపూర్ణ’, ‘కళా తపస్వి’ వంటి బిరుదులు సరిపోతాయని అన్నారు. వచ్చే ఏడాది వారందరికీ ‘గద్దర్ అవార్డులు’ ఇవ్వాల్సిందేనని సెటైర్ వేశారు. పేజీల కొద్దీ డైలాగులు చెబుతూ, కపట ఏడుపులతో కార్యక్రమాన్ని రక్తికట్టించారని విమర్శించారు.

‘ఇక్కడ నాటకాలు వేయబడును’ అంటూ బోర్డు పెట్టండి

వినాయక చవితి, దసరా నవరాత్రుల్లో వీధి నాటకాలు వేసుకోవడానికి తెలంగాణ భవన్‌ను అద్దెకిస్తే సరిపోతుందని సాయికుమార్ సూచించారు. “ఇచ్చట నాటకాలు వేయబడును.. కపట నాటక సూత్రాలు నేర్పబడును.. నాటకాలకు భవనం అద్దెకు ఇవ్వబడును” అంటూ బోర్డు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, ప్రతిపక్షాలను అసెంబ్లీలో మాట్లాడనివ్వని వారు ఇప్పుడు సభా సంస్కృతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు నంగనాచి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న వారంతా మాజీలే!

బీఆర్ఎస్‌కు ఉన్న 35 మంది ఎమ్మెల్యేల్లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కేవలం ఐదుగురు మాత్రమే కోరుకుంటున్నారని, మిగిలిన 30 మంది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనను సమర్థిస్తున్నారని సాయికుమార్ పేర్కొన్నారు. నిన్నటి మాక్ అసెంబ్లీలో కేవలం పది మంది ఎమ్మెల్యేలే ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. వారిలోనూ సగం మంది బలవంతంగా వచ్చినట్లుగా కనిపించిందన్నారు.
అమరవీరుల త్యాగాలపై అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దివాళా తీశారని బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. మాక్ అసెంబ్లీ సెట్‌లో నటన చేసిన నేతలంతా వచ్చే ఎన్నికల్లో శాశ్వత ‘మాజీలు’ కావడం ఖాయమని అన్నారు. ఇంకా పదేళ్లపాటు ఆ మాక్ అసెంబ్లీ సెట్‌ను అక్కడే ఉంచుకోవాలని, ప్రజలు వారికి నిజమైన అసెంబ్లీ గేట్లు తెరిచే ప్రసక్తే లేదని మెట్టు సాయికుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement