త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Sathaiah Awards | ఉమ్మ‌డి కుటుంబ విలువ‌లు కాపాడ‌డం గొప్ప విష‌యం

Ponnam Sathaiah Awards | పొన్నం స‌త్త‌య్య దూర‌దృష్టితోనే ఈరోజు వారి పిల్ల‌లు ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌ని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. పొన్నం కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ విలువలను కాపాడుకుంటూ ఉండటం అభినందనీయమ‌న్నారు.

S

Telangana | Published On Sep 13, 2026, 5.41 pm IST

Ponnam Sathaiah Awards | ఉమ్మ‌డి కుటుంబ విలువ‌లు కాపాడ‌డం గొప్ప విష‌యం
Advertisement
  • పొన్నం స‌త్త‌య్య అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్

Ponnam Sathaiah Awards | త్రినేత్ర‌.న్యూస్‌: పొన్నం స‌త్త‌య్య దూర‌దృష్టితోనే ఈరోజు వారి పిల్ల‌లు ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌ని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. పొన్నం కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ విలువలను కాపాడుకుంటూ ఉండటం అభినందనీయమ‌న్నారు. నేటి కాలంలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు తగ్గుతున్న సమయంలో ఇది అందరికీ ఆదర్శమ‌ని కొనియాడారు. కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఉమ్మడి కుటుంబం గొప్పతనమ‌న్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అనేక మందిని సత్కరించాలని కోరారు. ఆదివారం ర‌వీంద్ర‌భార‌తిలో పొన్నం స‌త్త‌య్య పేరిట అంద‌జేస్తున్న అవార్డుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

పొన్నం సత్తయ్య జీవితం గొప్ప ఆదర్శం. తన పిల్లలు జీవితంలో ఎదిగి, ప్రయోజకులుగా నిలవడం చూసినప్పుడు ఒక తండ్రికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. పొన్నం సత్తయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలను ముగ్గురు కుమారులు ముందుకు తీసుకెళ్తున్నారు. పెద్ద కుమారుడు అశోక్ గౌడ్ న్యాయరంగంలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు రవిచంద్ర రెడ్డి జర్నలిజం రంగంలో మంచి స్థాయిలో ఉన్నారు. మూడో కుమారుడు పొన్నం ప్రభాకర్ రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు కూడా తమ జీవితాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. వారి పిల్లలు కూడా వివిధ రంగాల్లో రాణించడం పొన్నం సత్తయ్యకు నిజమైన ఆనందం కలిగించే విషయం.

 

పొన్నం సత్తయ్య గారి జీవితాంతం వ్యవసాయంపై ఆధారపడి కష్టపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడుతూ కుటుంబాన్ని ముందుకు నడిపించారు. వ్యవసాయం చేస్తూనే పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే దూరదృష్టి ఆయనది. వ్యవసాయ కుటుంబంలో పుట్టినా పిల్లలు ఉన్నతంగా ఎదగాలని భావించి వారికి మంచి విద్య అందించారు. తండ్రి కష్టానికి, దూరదృష్టికి నేటి వారి విజయాలే నిదర్శనం. ఎన్నో సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ కష్టపడి పనిచేసే తత్వాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యవసాయం పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం ఉంది. రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

వ్య‌వసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అభినందనీయం. జానపద కళారంగంలో ప్రతిభ చూపుతున్న కళాకారులను గుర్తించి పురస్కారం అందించడం అభినందనీయం. ముఖ్యంగా ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పించడం ద్వారా కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. పురస్కారం పరిమాణం చిన్నదైనా, సమాజానికి ఇచ్చే సందేశం చాలా పెద్దది. ప్రతిభ ఉన్నవారిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు మరింతగా రాణిస్తారు. సమాజంలో ఎన్నో ప్రతిభలు అవకాశాలు లేక మట్టిలోనే కలిసిపోతున్నాయి. సరైన సమయంలో సరైన అవకాశం లభిస్తే అలాంటి ప్రతిభలు మాణిక్యాలుగా వెలుగులోకి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

ప్రతిభావంతులను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేసిన జ్యూరీ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు. పొన్నం ప్రభాకర్ 1985 నుండి పరిచయం. బ‌ల‌వంతంగా రాజకీయాల్లోకి తెచ్చా. వాళ్ళ అన్న పొన్నం అశోక్ నాకు పరిచయం. పొన్నం ప్రభాకర్‌ను రాజకీయాల్లోకి రమ్మంటే నాకెందుకు అన్నారు. ఈరోజు మంత్రి అయ్యారు. పక్కనే ఉన్న గిడుగు రుద్రరాజు, పొన్నం ప్రభాకర్ నాకు రాజకీయాల్లో ప్రియ శిష్యులు. ఎన్నో పోరాటాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. అనేక మందిని సత్కరించాలి.

ముగ్గురు అన్న‌ద‌మ్ములు క‌లిసి ఉండడం సంతోష‌క‌రం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖ

పొన్నంతో ఆత్మీయ అనుబంధం ఉంది. పొన్నం ప్రభాకర్ ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. కాంగ్రెస్‌లోని ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలు, నాయకులను సోదరభావంతో కలుపుకుపోయే నాయకుడిగా ఉన్నారు. పొన్నం సత్తయ్య గారు చూపిన మార్గం, కుటుంబ విలువలు నేటికీ పున్నం కుటుంబంలో కొనసాగుతున్నాయి. ముగ్గురు అన్నదమ్ములు ఐక్యంగా, ప్రేమగా ఉండటం ఎంతో సంతోషాన్ని క‌లిగించే విషయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, పరస్పర సహకారం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

పొన్నం సత్తయ్య గారి ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య, శిక్షణ, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు. విదేశాల్లో చదువుకునే అవకాశం పొందుతున్న పేద, బలహీన వర్గాల విద్యార్థులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

పేదలు, బలహీన వర్గాల కోసం చేస్తున్న సేవల కారణంగా పున్నం ప్రభాకర్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. ఆయనకు లభిస్తున్న ఈ గుర్తింపు వెనుక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, సేవాభావం ప్రధాన కారణం. పొన్నం సత్తయ్య గారు పేదలు, బలహీన వర్గాల పట్ల చూపిన శ్రద్ధను పున్నం ప్రభాకర్ గారు కొనసాగిస్తున్నారు. ఆయన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలవాలని కృషి చేస్తున్నారు.

ఉమ్మ‌డి కుటుంబంలో స‌మ‌స్య‌లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి

పొన్నం సత్తయ్య గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి ఆలోచనలు, విలువలు, ఆశయాలు నేటికీ మనకు స్ఫూర్తిగా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం ,కుటుంబ ఐక్యతను కాపాడుకోవడం. ఈ సమాజానికి అవసరం ఆస్తులు ఇవ్వడం కంటే గొప్ప వారసత్వం విలువలు, మంచి ఆలోచనా విధానం, ధైర్యం, కష్టాలను కలిసి ఎదుర్కొనే తత్వం, సమాజం పట్ల బాధ్యత అవసరం. పొన్నం ప్రభాకర్ ఎదుగుదల వెనుక కుటుంబ విలువలు కీలకంగా ఎంతో ఉన్నాయి. ఆయన కష్టం, పట్టుదలతో పాటు పొన్నం సత్తయ్య, వారి సతీమణి అందించిన జీవన విలువలు గొప్ప బలంగా నిలిచాయి.

ఈ సందర్భంగా 2004 నాటి రైతుల ఆత్మహత్యల పరిస్థితిని గుర్తు చేసుకోవాలి. కరువు, వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలపై సభలో ప్రశ్నించే అవకాశం లభించింది. కుటుంబం ఒక వ్యక్తికి మానసిక బలాన్ని ఇస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల ఓదార్పు, అండ ఎంతో అవసరం. ఉమ్మడి కుటుంబం ఉంటే సమస్యలను కలిసి ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. బలమైన కుటుంబ వ్యవస్థే బలమైన సమాజానికి పునాది.

కుటుంబాల్లో ప్రేమ, గౌరవం, పరస్పర సహకారం పెరిగితే సమాజంలో కూడా శాంతి, సామరస్యం పెరుగుతాయి. పొన్నం కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. కుటుంబ ఐక్యతను కాపాడుకోవాలి. మన సంస్కృతిలోని ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. పొన్నం సత్తయ్య పవిత్ర స్మృతికి ఘన నివాళులు. ఆయన చూపిన కుటుంబ విలువలు, మానవతా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Advertisement
Advertisement