త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్‌ సీనియ‌ర్ల‌కే 60 శాతం ప‌ద‌వులు..

Congress | కాంగ్రెస్ (Congress) కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌నున్న‌ నామినేటెడ్ పోస్టుల్లో (Nominated Posts) 60 శాతం పార్టీ సీనియ‌ర్ల‌కే ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

G

Telangana | Published On Aug 6, 2026, 12.36 pm IST

Congress | నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్‌ సీనియ‌ర్ల‌కే 60 శాతం ప‌ద‌వులు..
Advertisement

Congress | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ (Congress) కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌నున్న‌ నామినేటెడ్ పోస్టుల్లో (Nominated Posts) 60 శాతం పార్టీ సీనియ‌ర్ల‌కే ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మండ‌ల మాజీ అధ్య‌క్షులు, జిల్లా నేత‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. హైద‌రాబాద్ గాంధీ భ‌వ‌న్‌లో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా రాబోయే వ్యవసాయ పరపతి సహకార సంఘాల (PACS) డైరెక్టర్లు, చైర్మన్లు, పలు నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధి విధానాలు రూపొందించారు.

ఉమ్మడి జిల్లాలకు ఉన్న ఇన్‌చార్జ్ మంత్రి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ నాయకులతో సమావేశ‌మై, సమన్వయంతో ఆశావహుల నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. ప్రధానంగా 60 శాతం నామినేటెడ్ పోస్టులను గతంలో మండల అధ్యక్షులుగా ప‌నిచేసిన‌వారికి, జిల్లా కార్యవర్గంలో పని చేసిన వారికి, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం క‌ల్పించాల‌ని నిర్ణయించారు. అన్ని సంప్రదింపులు చేసి తుది జాబితాను సిద్ధం చేశాక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు కలిసి నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.

గ‌తంలో విమ‌ర్శ‌లు రావ‌డంతోనే..

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భ‌ర్తీచేసిన పార్టీ ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్టుల్లో పాత కాంగ్రెస్ నేత‌ల‌ను కాద‌ని, వ‌ల‌స నేత‌ల‌కే ఎక్కువ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో మొద‌టినుంచి పార్టీ జెండా మోస్తున్న నేత‌ల‌కు న‌ష్టం జ‌రిగింద‌ని, వారంతా అసంతృప్తితో ఉన్నార‌ని అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం భ‌ర్తీచేయ‌నున్న ప‌ద‌వుల్లో పాత కాంగ్రెస్ నేత‌ల‌కు న్యాయం చేయాల‌ని హైక‌మాండ్ సూచించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అందువ‌ల్ల వ్య‌వ‌సాయ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘాల చైర్మ‌న్‌, డైరెక్ట‌ర్ ప‌ద‌వుల‌తోపాటు వ్య‌వ‌సాయ మార్కెట్‌, దేవాల‌య క‌మిటీల్లో పాత కాంగ్రెస్ నేత‌ల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించింది.

Advertisement
Advertisement