త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | ఎటు పోతున్న‌ది ఈ సమాజం?.. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి: సీపీ స‌జ్జ‌న‌ర్‌

VC Sajjanar | రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ (VC Sajjanar) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేటి సమాజంలో మానవ సంబంధాలు యంత్రాల్లా మారుతున్నాయ‌ని, నైతిక విలువ‌లు మంటగలిసిపోతున్నాయ‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Aug 6, 2026, 11.41 am IST

VC Sajjanar | ఎటు పోతున్న‌ది ఈ సమాజం?.. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి: సీపీ స‌జ్జ‌న‌ర్‌
Advertisement

VC Sajjanar | త్రినేత్ర‌.న్యూస్‌: రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ (VC Sajjanar) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేటి సమాజంలో మానవ సంబంధాలు యంత్రాల్లా మారుతున్నాయ‌ని, నైతిక విలువ‌లు మంటగలిసిపోతున్నాయ‌ని చెప్పారు. బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ (Video Call) దర్శనం అంటూ మండిప‌డ్డారు. ఈ స‌మాజం ఎటు పోతున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. క‌న్ని, ఉన్న‌త చ‌దువురు చ‌దివించిన తండ్రిని చ‌ర‌మాంకంలో వృద్ధాశ్ర‌మంలో వ‌దిలేసిన అత‌ని ముగ్గురు కూతుళ్లు.. చివ‌రికి తండ్రి చ‌నిపోయినా చివ‌రిచూపు చూడ‌టానికి (Final Rites) కూడా స‌మ‌యం లేదంటూ దూరంగా ఉండిపోయారు. ఆయ‌న చితిమంట‌ల‌పై (Cremation) కాలుతుండ‌గా వీడియో కాల్‌లో చూస్తు ఉండిపోయిన ముగ్గురు కూతుళ్ల ఘ‌ట‌న‌పై సీపీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

`హర్యానాలోని సోనిపట్‌కు(Sonipat)  చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే. కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.

మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?. తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.` అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Advertisement
Advertisement